Thursday, July 9, 2020

Bharatavarsha - 1

విశాఖపట్నం – ఆనందనిలయం

                                       

విశాఖపట్నం మువ్వవానిపాలెం రెండులక్షల యాబదివేల జనాభా కలిగి   ఆసియాలో అతిపెద్ద జనావాసము గా పేరుగొన్నది.  అచ్చట కైలాసగిరి చెంత  ఆనంద నిలయము  అను ఈ పురాతన మండువా గృహము మధ్య తరగతి ఆవాసముల మధ్య  "సమదూర ఫల మధ్యే ఆమ్రే, తాళవన మధ్యే వటవృక్షే, మర్కటమధ్యే అంజనపుత్రే, కౌరవ సభాంతర విరాట్రూపే అన్నట్టుండి ( ద్రాక్ష పండ్ల మధ్య  బంగిన పల్లి మామిడి పండువలె ,    తాడిచెట్ల మధ్య వటవృక్షమువలె  మర్కటముల మధ్య వీరాన్జ నేయునివలె,  కౌరవ కొలువున శ్రీ కృషుని విరాట్ రూపమువలె కన్పించుచు ) చూపరులకు  భావోద్వేగమును  రోమోద్గమమును  కలిగించుచున్నది.   


ఆ ఇల్లు  ఆంగ్ల వడదెబ్బ తగిలి తెలుగు భాషా సంప్రదాయములు కొనఊపిరితో యున్న సమాజమునకు జీవనాధార  చికిత్సవిభాగం (ఐ సి యు)  వంటిది. ఒక్క మాటలో చెప్పవలెనన్న గంజాయి వనమున తులసి మొక్క వంటిది.  బిర్రబిగుతు నీలిగోతాము  కట్టి పిర్రలు చూపు  వెన్నెలాడులిచ్చట  లేరు. ఆంగ్ల వేషధారణతో వచ్చీరాని ఆంగ్లమును కప్పిపుచ్చుకొనుచూ ఆంగ్లేయుల హావభావములను శరీరమునకు అద్దుకొని  ఆత్మవంచన చేసుకొనువారు లేరు. 

తరతరాలుగా దేశసేవలో  తరించి, దేశముకొరకు యుద్ధములలో పోరాడి ప్రాణములనర్పించిన అమర జవానులు ఆత్మల నిలయము  ఆనందనిలయము. తెలుగు వస్త్రభాషా సంప్రదాయములు ఆ నట్టింటనడయాడుచుండును.  సత్ సాహిత్య స్ఫూర్తి పొంది, భాషా సంప్రదాయములను దివ్వెలను వెలిగించి ఆవెలుగులో దేశములు దేదీప్యమానమొనర్చు  ఆ ఇంటి  వాతావరణము మనసుని మార్దవ పరచి సంప్రదాయములపై మమకారము పుట్టించును.  


అట్టి ఇంటి ముంగిట రాధామనోహరం అనొక వన్నెలాడి  శత సహస్ర పుష్పములతో సహస్రాక్షుని సైతము లెక్కచేయక చూపరులను మరులు గొలుపు చుండెను.  పందిరినంతయూ అల్లిబిల్లిగా నల్లుకుని ప్రహరీపైకి  ప్రాకి పిల్లవాయువుల తాకిడికి అల్లనూ గుచూ కన్నుల  పండుగ చేయుచుండెను. దాని పువ్వులు నవ్వులవలెరత్నముల రాసుల వలెనుండి చూచువారి కన్నుల  కాంతులను  కొని కెంపులవలె మెరియుచూ  పాంచజన్యము మ్రోగించునట్లున్నది. 

 

 త్రిచక్ర వాహనము నుండి బయటకు దిగిన యువకుడు అట్లే నిలిచి  గోడవద్ద స్థంభముపై నున్న విద్యుత్ దీప కాంతిలో గుత్తులు గుత్తులుగా విరబూసిన  రాధామనోహర పుష్పములను గాంచి "లేత గులాబీఎరుపు ఛాయలలో నిగనిగలాడుచూ  రాధామనోహరములు కన్నెపిల్లల సొగసులను తలపింప జేయుచున్నవి కదాఅనెను. ఆతీగ  అతడి మాటలు విన్నదేమో అన్నట్టు పరవశించి  నాట్యమును పెంచెను   అది చూచి ఆ యువకుడు "ఇంద్ర సభలో పూర్వ జన్మలో నర్తకై యుండునని అనెను.  అదివిని ఆ లత వళ్ళు వయ్యారంగా త్రిప్పుచుండెను   అది చూచి ఆ యువకుడు "పిల్లవాయువులతో పరిహాసమాడుచూ బంగారువన్నెలీనుచున్న రాధామనోహరమును  సీత వనవాసమున  చూచినున్నచో బంగరులేడిని కోరియుండెడిది కాదనుకొనెను.      చల్లనివెన్నెల రేయి పిల్లనగ్రోవి నూదు చున్నట్లున్నది”. చల్లగాలి... కారుమబ్బు ను తాకినట్లు యామిని అందము అతడి మనసు తాకగ కవితావృష్టిని కురిపించెను.


శా. ఆట్లాడే సుమబా లలంత మురిసే రాకాశ దీప్తం దు తా 

 రాట్లాడే సుమబా ల లన్ని వెలిగెన్ రాత్రంత మోదంబు గా

మూట్లేగ ట్టినచం దమంతకురిసే వేవేలదారాలుగా  

మాట్లడెన్ కవయా మినంద ముమనో భావాల వర్షించ గా


ఆట్లాడే పుష్పబాలలు అద్భుత ఆకాశ వెలుగులో మురియుచున్నవి. రాధామనోహర మనోజ్ఞ కాంతిలో రాత్రి వెలుగుచున్నది. రాత్రి తన అందమంతా మూటగట్టి మురారి స్వరాలవలే కురిపించుచుండగారాధామనోహరములు తమ అందాలతో కవిని రేపుచు మాట్లాడించెను.  


 కళ్ళార్పన్ తరమే పిసాళి హొయలన్ కాంచంగ పూబాల లే

 త్రుళ్ళాడే రుమరా ళసోయ గములే రువ్వేరు తారాడుచున్

 వేళ్ళాడే సుమబా లలాడ మనసే మీటేను సారంగమే  

 కళ్ళా రా కన వేల్పుచేడియలు ఈ  గారాల  పూబాల లే

         

కళ్ళార్పతరమే పిసాళి హొయలన్ (బంగారు అందాలు) కాంచంగ పూబాలలే (పూవులు) త్రుళ్ళాడేరు (నర్తించేరు)మరాళసోగములే(హంససొగసులు) రువ్వేరు  ఈ రేయిలో  పిళ్ళారి  కృతులెన్నొపాడి విరులే మీటేనుసారంగమే, కళ్ళారాకన, (రసదృష్టితో చూచిన,) వేల్పుచేడియలు (అప్సర కన్నెలు) ఈ గారాల పూబాలలే!  అని మరింత మురియుచూ

      

ఉ.కన్నెలు  పండువెన్నెలలొ కన్నుల ఊయల లూగుచుండగా                         

   వన్నెల ఎర్రని  మెరుయు వాసము  చూడను మోదమేగదా                      

   వెన్నెల  హంసలే   కదల  వెచ్చని  వేడుక  భాగ్యమే కదా 

    చిన్నెలు  చల్లగ   తడమ జిల్లని  మేని  పులాకమే  గదా


చంద్రకాంతిలో బంగారపుటుంగరములో పొదిగిన కెంపులవలె  పుష్ప కన్నెలందాలు నిగ్గార మురియుచున్నవి. వెన్నెలలో మెరియుచున్న రాధామనోహరం లత వేల్పుచేడియ (దేవకన్య)వలే నున్నది. పిల్లగాలి కూగు ఖంకరముల(ముంగురులు) వలే విరులు నాట్యమాడు చుండగా  మనసునేదో  ప్రణయాలాపన తట్టుచున్నది.   

             

“ఔరా! హృదయమనోహరమీ రాధామనోహరం. ఇవియేగదా ఈ గృహము “ఔరా! హృదయ మనోహరమీ రాధామనోహరం. ఇవియేగదా ఈ గృహము నకు ఆనందనిలయమను నామమును సార్ధకము చేయుచున్నవ”ను కొనుచూ ఆ యువకుడు తలఎత్తి ఆకశమున మబ్బుకన్నెల నల్లని పైటల మాటున దోబూచు లాడుచున్నపున్నమి చంద్రుని జూచి


 “రాత్రికి నీ అందమే అబ్బెను సుమా! నీవులేని రాత్రి తావిలేనిపువ్వే కదా!” అని ఆకాశమును చూడగా అతడికి గ్రీకు పురాణములో ఎండిమియన్ గుర్తుకు వచ్చెను. ఎండిమియన్ను (భూలోక సుందరుడైన గొర్రెల కాపరి) మోహించి తస్కరించి రాసలీల లాడి  సమ్మోహ పరిచి సెలీన్ (చంద్రుడు గ్రీకు పురాణములో స్త్రీ, అందాలరాసి  అందమైన పురుషులనపహరించుకుపోవు గుణముగల ఆమె ఎండమియన్ తో  యాబది బిడ్డలను కనెను ) నీవేకదాఔరా! ఇందులకే గదా ఆకాశములోనే కాక భారతీయగ్రీక్ఆంగ్ల పురాణ ములందు వెలుగొందుచున్నావు.

ఔరౌఆంగ్ల ప్రణయకవి జాన్ కీట్స్ ఎండిమియన్ పద్యకావ్యమును నాలుగు  పుస్తకములు   వ్రాసినాడనిన నీ రూప లావణ్యముచూసి ఎంతమురిసెనోకదాఏమి  రాత్రి నాలో భావుకుడింత చెలరేగుచున్నాడని  యవకుడు  అనుకొనుచుండగా ఒక నల్ల వస్త్రధారి ఎవ్వడో పరుగు పరుగున బోయి గోడచాటున నక్కి నాడుఆతనిని తరుముతూ ఒక రక్షకభటుడు వానిని గమనించక ముందుకు సాగినాడునక్కినది జాలు లెమ్ము. రక్షకభటుడు వెడలినాడికబయటకురమ్మని  దాగున్న వానినాయవకుడు  పిలవగా బయటకు వచ్చుచూ,  ఆ నల్ల వస్త్రధారి రహదారిపక్కనున్న బురదయందుజారిపడెను.

ఉ.వానలు బాగుగా  కురిసి  వాగులు పొంగెను  ఎల్లడ,  వృష్టే  

 కోనల  కారుచూ    జగము కొత్తగ  పచ్చటి   కాంతులీ నగా

వీనుల   విందుగా  డగరు  వేడుక  చెయగ  మత్తుసొక్క దా    

 మేనక  యాడగా   నటన   మేగని   గుండెలు  గుబ్బతిల్లవా 

 

మొన్ననే వర్షఋతువు పోయి శరదృతువు బాటపడిన ఆంధ్రలోక మంతయూ చెరువులు నిండి చెంగల్వలు పూచి, వృష్టే   కోనల (కొండలచారికలుగా కారుచున్నది.    జగమంతయూ   పచ్చటి  కాంతులీనుచూ  కొత్తగ కనిపించుచున్నది. డగరు (గండు కోయిల) తీయగా పాడుచుండగా మేనక దిగి నాట్యమాడుచున్నట్లున్నదిచెరువులు నిండి గరువులు  గుంతలుబడి, రహదారుల చెంత అడుసు నిలిచిన ఫలితమిది. “ఇంత నిశిరాత్రి యందు ఎచ్చటికి పోవుచున్నావు, పరుగు నీకలంకారమా? రక్షకభటు డెందులకు నీ వెంటబడి తఱుము చున్నాడ?ని సందేహాస్పముగా యవకుడు అడిగెను.

 

 “నావృతికి పరుగు అలంకారము కాదు అవసరముఅని మూలుగుచూ నల్ల వస్త్రధారి  దుస్తులు సవరించు కొనుచూ దీపపుకాంతి వద్దకొచ్చి నిలిచెను. “ఏమిటోయి నీ వృత్తికొంపదీసి చోరవృత్తి కాదుగదా!” యని  యవకుడడిగెను. నిస్సందేహముగా చోరవృత్తే, నన్ను కాపాడినందులకు కృతజ్ఞతల”ని ముందుకు దుమక ప్రయత్నించుచుండ ఆ యువకుడు " బురదతో   ఎక్కడికి పోగలవు? ఆరుబయట నున్నమా  స్నానాల గదిలో కడుక్కొని పొమ్మని బురదగారుచున్న  చోరునితో యని  అతడి స్నానము ముగియు సమయమునకు అచ్చట నిలిచి "అవి తడి వస్త్రములు, చిరిగిపోయినవి వాటినెంత కాలము వాడెదవ"నుచూ  తువ్వాలు, వస్త్రములనిచ్చి "నిన్నెక్కడో చూచి నట్టున్నద"నెను.  


"నేను మిమ్మల్ని ఎరుగుదును. నాకు మీపేరు కూడా తెలియును. మీ పేరు భారతవర్ష. మీరునూ నన్నెరుగుదురు. వెలుతురూలో చూచిన గుర్తు పట్టగలరు. నన్ను మరీదందురు.  మొదటిసారి నేను మీ వాహనము నందు నక్కి  తప్పించుకొంటిని. రెండవసారి కూడా నన్ను కాచినారు. మీ మేలు మరువన"ని యా చోరుడు పలికెను.

 భారతవర్ష  " నీవా! నీ పేరు నేనెరుగనుఅయిననూ మొదటిసారి నాకిచ్చిన మాట మరిచి మరలా ఇదే వృత్తిని కొనసాగించుటకు సిగ్గన్నదిలేదా? అని అడిగెను.

 

తేసిగ్గు బారెడున్నను పొట్ట చెడ్ద దన్న 

 మరచి నయెడల మనుగడ మరిక జరగ

 దన్న అడిగిన  ఇచ్చెడి   దాత సున్న          

 చల్ల గఇటులు సాగిన  చాలు నన్న   

 

"అయ్యా సిగ్గు చాలా యున్నది దానితోపాటుగా పొట్ట కూడ యున్నది.   మీకు మాట ఇచ్చిన పిమ్మట శతవిధముల యత్నించిననూ  కొట్టువాడేకాని పెట్టువాడు లేడ”ని చెప్పుచుండ భారతవర్ష ఆతని కడుపులో ఆకలిని కళ్ళలో దైన్యము చూచి చలించి

"మరి మారుమాట్లాడక ఇంటిలోకి రమ్మని తాళము తీసి ఇంటిలోనికి చేయిపట్టుకుని తోడ్కొని పోయెనునీ ఆకలి తీర్చుట నా కర్తవ్యముమా బంధువులకు సుస్తీ చేయుటవల్ల మా అమ్మ చెల్లి  ఆసుపత్రికేగినారు, రాత్రి వారచ్చటనే  యుందురు.   నేను చిటికలో వంట చేసెదను తినిపొమ్ము. అని వంట చేయ సాగెను.

 

 అతడు వంట జేయునంతలో మరీదు ఇల్లంతయూ  కలియ జూసెను.  చుట్టూ గదులు గల  మండువా  లోగిలి. మరీదు కిటికీ గుండా బయటకు చూసెను ఇంటి బయట చుట్టూ  ఖాళీ ప్రదేశము పచ్చని చెట్లు, పూల మొక్కలుతో నిండియున్నదివానలు కురియుచుండుటచే కొమ్మలు రెమ్మలు తడిసియున్నవి. వాతావరణము మనోజ్ఞముగా యున్నదనుకొని మండువాలోకి దృష్టి మరల్చెను. గోడపై పూలమాలచే అలంకరించబడిన సిపాయి చిత్రము చూచి. " చిత్రమెవరిద?" నడిగెను.  

 

 "యుద్ధమందు వీరమరణమొందిన మా తండ్రి ఉగ్ర నరసింహ దీక్షితులు గారిద"ని వర్షుడు చెప్పెనుమరీదు ఆ అమర జవాను చిత్రపటమునకు  కరములు జోడించి మరల మండువా చుట్టూ కలియ చూడసాగెను. మండువాకు చుట్టూ గదులు కలవుగ్రంధాలయము(వర్షుని గది), కొట్టుగదివంటగది, పెద్ద పూజా మందిరము, పడకగదులు. “రాత్రియందు దీపకాంతిలో మెరియు చున్న    గృహమును చూచిన మనసిచ్చటనే చిక్కుకొని తిరుగు చుండునని అబుద్ధి పూర్వకముగా అతడి మాటలు వెలువడినవి.

 మరీదు గ్రంథాలయములో ప్రవేశించెను. గ్రంధాలయము నిండా   పుస్తక ములు కనువిందు చేయుచున్నవి.  అచ్చటనే ఒక వీణ మరియు కుట్టు యంత్రము  కానవచ్చెను. అతడట్లు పరికించుట జూచిన భారతవర్ష  "ఏమయ్యా, నా చిన్నప్పుడే  మా తండ్రిగారు కాలము చేసినారు. మాతాతలు సంపాదించిన ఆస్తులేమియూ లేకున్ననూ వారు కట్టిన ఇల్లొక్కటే మాకు మిగిలినది. మా తల్లిగారు ఇంటిని నా చదువును ఇంతవరకు లాగినారు.   వీణ నాకు  బహుమతిగా వచ్చినది." అనెను.  మాటలకర్ధము "ఇందేమి ఎత్తుకెళ్లుటకు ఎత్తుగడ?"

 

అది గ్రహించిన మరీదు మాన్పడ్డ ముఖమున లజ్జవడు స్వరమునఅయ్యా నేను దొంగనే గాని నీచుడను కాన”ని మిక్కిలి వినమ్రతన చెప్పగా,భారతవర్ష నవ్వి  మండువా లోగిలిలో  విస్తరివేసి వడ్డన గావించెనుభోజనము ముగిసెను. మరీదు కళ్ళు  చెమర్చెను

 

భోజనము ముగిసిన పిదప పక్కనే ఉన్న వీణను చూచి “నేటి ఆధునిక కాలమున మగవారు వీణ వాయించుట నేనెక్కడనూ చూడ లేద”నెనుఅదివిని భారతవర్ష “నేటికాలమున యువకుడెవ్వడూ  వీణ వాయించుట కిష్టపడడు. వీణావాదనమన్న, చరిత్రపఠనమన్న చులకన. మాతృభాషలో సంభాషించుటకు నీటినుంచి దీసిన మీనము వలె  గిజగిజ లాడుదుర”ని భారతవర్ష జెప్పుచుండ మరీదు గోడపై నున్న భారత రాష్ట్రపతి అబ్దుల్కలాంగారు  వీణవాయించుచున్న చిత్రపఠమును చూసిఇది భారతరాష్ట్రపతి అబ్దుల్కలాంగారు  కదూ!  ఈయన వీణ వాయింతురని నాకు తెలియదు. కానీ ఇది ఎంత గొప్ప విషయమోకదా! భారతావనికి ఆర్యుడు కలామార్యుడ”నుచూ మరీదు కరములు జోడించి  చిత్రపటముకు వందనము జేసెనుఅప్పుడు భారతవర్ష గళము విప్పి కలామార్యుని పై ఒక మత్తేభమును ఆసువుగా వినిపించెను.

 

 

.   మితభాషీ   సుగుణాలరాసి వర సామాన్య   సమాలోచనా

 హితకార్య  కృతకృత్య  వందిత  మితాహార్య  నిరాడంబరా   

 వితగు ప్త క్షిపణీ ధరాధర  కలామార్య  మణీవ  ప్రజా 

 హిత శాస్త్ర   పరమాణుయోధ హరి   అంభోభృత్పథ  మేగెనే

 

మితభాషీ సుగుణాలరాసి వర  గంభీరా స్త్రలక్ష్యా ధిపా

హితకా  ర్యకృత  కృత్యాభి  కవర  వాహినీ దళాధి పతీ                     

 వితగు  ప్తక్షిప  ణీ ధరా  ధరక  లామార్యా  మణీవ  ప్రజా 

హితశా   స్త్రపర   మాణుయో ధభవ  రాహిత్య ప్రబద్ధా ధిపా 

    

శ్రవణానందకరముగానున్న ఈ పద్యమునకు అర్థము తెలిసినచో బాగుండునని  మరీదనగా  వర్షుడు అర్థమును ఇట్లు వివరించెను. మితభాషీ, సుగుణాలరాసివర=  శ్రేష్ఠుఁడుసామాన్య  సమాలోచనాసామాన్య ఆలోచజేయు; హితకార్య  కృతకృత్య= మంచి పనులు విజయవంతముగా చేసిన; వందిత = పూజ్యనీయుడు;  మితాహార్యమితవస్త్రాలుదాల్చు;    నిరాడంబరావితలపాతాళ ;   గుప్తదాగిన; క్షిపణీధరాధర=మిస్సైల్ మేన్;  కలామార్య = కలాం సార్మణీవమణితో పోల్చదగ్గ,  పరమాణుయోధ  హరిపరమాణు శాస్త్రజ్ఞులలో సింగముఅంభోభృత్పథ మేగెనేస్వర్గమునకేగె.

 

“మా   తెలుగు  పండితులు కందాల కృష్ణమూర్తి గారిని  గుర్తు చేసినా రు. ఆహా!  ఏమిచక్కని స్వరము వారిది. అంతే  చక్కని స్వరము మీది. అని మరీదు అనగానీవు చదువుకొంటివా?”యని భారతవర్ష ప్రశ్నించెను" పదవతరగతి పరీక్ష వ్రాసినాను కానీ ఆంగ్లమున గెలుపొందలేదుదానికి కారణము ఆంగ్లమన్న ఇష్టము లేకుండుటే. ఆంగ్లమనిన భీతి. తెలుగనిన ప్రీతి. మీరు మాటలాడుచున్న తెలుగు నాకు బాగుగా తోచుచున్నద”ని సిగ్గుతో మరీదు  నవ్వుచుండగా "నాయనా నీ వయసు ఎంత?” అనడిగెను.పద్దెనిమిది సంవత్సర ముల”ని మరీదు చెప్పెను.


“నీ మాతృభాషాభిమానము ఆంగ్లము మిళితముకాని తెలుగు మాట్లా డుచున్నపుడు కనబడుచున్నది. ప్రయత్నించినచో  స్వచ్ఛమైన తెలుగు  ఎవ్వరైననూ మాట్లాడవచ్చు. కానీ ప్రయత్నించుటకే నేటివారు  సిగ్గుతో సగము చత్తురు. తెలుగుని నిజముగా ప్రేమించువారు  ఎవ్వరైననూ స్వచ్ఛమైన  మాతృభాషలో వినుటకు చదువుటకు ఇష్టపడుదురు. అటు పిమ్మట మాట్లాడుట సులభముగా అబ్బును. తెలుగు ఇష్టమని బొంకుటే కానీ తెలుగుని నిజముగా ప్రేమించువారు తక్కువ. అట్లని ఆంగ్లమును  ప్రేమింతురాయనిన అదియునూ కల్లయే. అవసరార్ధ శ్రద్ధను, కపటప్రేమను జూపుట ఇచ్చట సర్వసాధారణము. ఇచ్చటివారికి జీవితమనిన డంబముఇతరులకు చూపుటకొరకే గానీ, తమకు వలయునదేమియునూ లేదని భారతవర్ష అనగా  “అవును మీరు చెప్పినది నిజమే  రక్షకభటునికి చూపు శిరస్త్రాణమువలెయని మరీదు నవ్విమీరేమి చదువుచున్నారు?” అనడిగెను.

 

 భారతవర్ష గోడపై యున్న ఒక చిత్రమును జూపెను. అది భారతవర్ష పంచకట్టులో విశాఖ కళాశాలలో ఉపన్యాసకులతో కూడి దిగిన ఛాయా చిత్రము. మరీదు ఎమ్. ఏ. తెలుగు, చరిత్ర పుస్తకములను చూచెను. “ఇంక ఏమియునూ చెప్ప నక్కరలేదు. నేను చెప్పెదనని, చరిత్ర, తెలుగనిన ఇష్టము, మీ అమ్మగారు కుట్టు మిషను కుట్టుచుందురు. మీరు తెలుగు ఉపన్యాసకులు, రాత్రులు త్రిచక్రవాహనము నడుపు చున్నారు.

 

 అదెందుకు జేయుచున్నారో తెలియదు కానీ మీది ఇతరులకి సాయంచేయు గొప్ప మనసు. వెళ్లివత్తున”ని మరీదు బయలుదేరెను.  భారతవర్ష "మరీదు, ఒక్క మాట నీవు వేరొక వూరికి బోయినచో  నిన్ను దొంగని నెవ్వరూ గుర్తుపట్టరు. "ఎచ్చటికైననూ పోయి గౌరవంగా  బ్రతుకమని కొంత డబ్బు చేతిలో పెట్టెను.

 

                                                         ***

 

సీతారత్నం రాక 

 

తూర్పు కనుమల్లో సూర్యుడు ఉదయించుచుండెను. బాలభానుని బంగారు కిరణములు పుడమికి స్వర్ణవర్ణములద్దు చుండెను.  భారతవర్ష ఆనందనిలయం ముందటున్న ఉపవనమునదు కూర్చొని  ఆదిత్యుని వెచ్చని కిరణస్పర్శ లో పులకించుచూ ఆ నిజదేవుని  తిలకించుచూ నయనానందము నొందుచుండగా పక్షుల కిలకిలా రావములతడికి శ్రవణానందమును కలిగించు చుండెను. 

అల్లన వీచెడి  గాలికి తలలూ పుతున్న  బంతి, చామంతి కుంకుమ పువ్వులా సూరిని  విస్మయముగా చూచుచుండెను. “నింగికాంతులు  పొంగిపొరలు  ప్రాతః కాలమందు  విరులన్నియూ గోపికలవలె  స్నిగ్ధ ప్రకృతి  కొలనులో  స్నానమాచ రించు చున్నట్టు న్నవి కదా!”యని వర్ష తనలోతానే  చెప్పుకొనుచు ఉదయగీత మాలలనల్లుచుండెను జామ చెట్టు కొమ్మ మీద మదాలాపి కూయుచుండెను.

 ఆ సమయమున మాలిని, తన కుమార్తె  మంజూష తో ఆనందనిలయ మందడుగిడెను. రాధామనోహరం వారిని  చూసి నవ్వఁచుండగా మాలిని తోటలో వ్రాసుకొనుచున్న వర్షని వైపు చూసి  కాఫీ సిద్ధం చేయుటకు వంటగదిలోకి వెడలెను. మంజూష ఎర్రని పుష్పముల వైపు మెచ్చుకోలుగా చూసి "ఈ ఎర్రటి కుసుమములు స్వర్గము నుండి రత్నాలను దొంగిలించేనేమో!" అనిమెరిసే పూలగుత్తిని చేతుల్లోకి తీసుకుని ముద్దాడి తన కవన మెట్లున్నదని తన సోదరుడి దగ్గరకు వెళ్లి, ఒక చిన్న బల్ల పై అతని పక్కన కూర్చొనెను.

వర్షుడు మౌనము వహించెను. నా కవనముపై వ్యాఖ్యానించ కున్ననూ  నీవెట్లు జెప్పెదవో జెప్పుమనెను.

అప్పుడు వర్షుడు “అమరేజ్యుని ప్రజ్వలించు ఉజ్వల జ్ఞాన దీప్తులా! అమరపురిలో అప్సరల నలంకరించు శృంగార భూషణములా!” అని రాధామనోహరములను వర్ణింపగా “నీ కవన శక్తి నాకెట్లబ్బున”ని నిట్టూర్చి “రాధామనోహరమువలె ఎన్నటికీ వాడని కవితా పుష్పములు పూయు తీగ నీవ”ని   మంజూష అన్నవైపు మెచ్చుకోలుగా చూసెను.     

ఆమె తీగపై ఉన్న నల్లని తడి బట్టలను  చూపుచూ  "హుమ్!  నిన్న రాత్రి మళ్ళీ ఒక అతిథి వచ్చెనా!" అని అచ్చెరువందెను. వర్ష నవ్వుతూ "అవున"ని బదులిచ్చెను "నువ్వు ప్రజలకు చదువు జెప్పుటకు లోక సంచారము జేయుట చాలదన్నట్టు  ఇంటికి అతిథులను తీసుకొచ్చుచు న్నావ" ని మంజూష అనెను.

"నేను తీసుకువచ్చుటా? అనుకోకుండా వారే వచ్చుచున్నార"ని వర్షు డనెను. "ఓ! అటులనా  మేము బయటకు వెళ్లినప్పుడే  అతిథు లెట్లు వచ్చుచున్నారో !" అని మంజూష వ్యంగ్యమాడెను.

అప్పుడే మాలిని రెండు కప్పుల కాఫీతో తోటలోకడుగిడెను. వర్షుడు మంజు ఆమె చేతుల్లోంచి కప్పులు తీసు కొనెను. "ముక్కు మొగమై నను తెలియనివారందరినీ ఇంటికి తీసుకువచ్చుటచే ఆనందనిలయం  ఒక సత్రమాయెన'ని మాలిని హాస్యమాడెను.

మంజూష: ఇంతకీ కొత్త అతిథికి ఏమేమి ఇచ్చెనో ?

వర్షుడు: ఒక జత బట్టలు మరియు” అని  వర్షుడు  తడబడుచుండగా

"మరియు కొంత డబ్బు" యని మాలిని పూర్తి చేసెను.

మంజూష నిరాశ చెంది "అమ్మా తన సంపాదనే కాక నువ్వు సంపాదించిన డబ్బంతా ఇట్లు ఖర్చు చేసినచో  నీతో పాటు నేనునూ కుట్టుపని మొదలు పెట్టవలెన"ని మంజాష  కోపముగా పల్కెను.

ఆమె కోపము కోపమువలె కాక సాంబ్రాణి ధూపము వలె మనోల్లా సము నందించెను. మాలిని మంజూషని చూసి నవ్వి "వాడిని  ఖర్చు పెట్టనిమ్ము, మళ్ళీ కుట్టడం నాకు కష్టమేమీ కాదు. వర్ష తన తండ్రిలా దయాళువు. నువ్వు ఈ కుట్టు యంత్రము ముట్టనవసములేదు. నువ్వు ఇంకో యంత్రము (కంప్యూటర్) నేర్చుకొనుచున్నావు. అది చూచుకొనిన”  చాలుననెను.

“మంజు, నువ్వు (పీజీ) స్నాతకోత్తర విద్యయందు ఆసక్తి చూపినచో  నీ ఏకాగ్రత నా నుండి చదువు వైపు మళ్లున” ని వర్షుడనెను.   అన్నయ్య చెప్పేది మంజుషకి అర్థమై "చూడమ్మా, అన్నయ్య నన్ను ఎలా ఆటపట్టిస్తున్నాడో!" అని మంజు తల్లికి  ఫిర్యాదు చేసెను.

వర్షుడు  "అది అట్లుండనిమ్ము దామికే మైనది ?"

మాలిని: దామిని లకుమతో వేగలేక పోవుచున్నది. లకుమ తల్లి లకుమను దామిని సంరక్షణలో ఉన్నచో క్రమశిక్షణ అబ్బునని ఆశించు చున్నది. ఆధునికతయే ఆదర్శమని భావించు  లకుమకు  సంప్రదా యాలన్న కంటగింపుగా యున్నది. ఈమెనెట్లు  దిద్దవలెనో కదా!

వర్షుడు : ఆమెనెట్లు దారికి తేవలెనన్నచింత  మాని నేటి తరమునెట్లు దారికి తేవలెనన్నది యోచింప వలెను. ఏలననగా వీరిది చిత్త  ప్రవృత్తి కాదు ఉన్మత్త స్థితి. ప్రపంచ ధోరణిని అనుకరించు చుందురు.  ఆధునికతను జీవిత పరమార్ధమను కొందురు. ఆధునికత మోజులో చరిత్ర సంప్రదాయముల నేవగించుకొని బ్రతుకుచున్నారు.

మాలిని: ఆమె తల్లికివి నచ్చకనే ఇటీవలే  లకుమను కళాశాల వసతి గృహము నుండి దామిని  వసతిగృహమునకు  పంపెను. దామినెంత యత్నించిననూ లకుమనునియంత్రించలేక పోవుచున్నది.నిన్నలకుమ వెంట పరుగెత్తు చుండగా పడి కాలుకి గాయమయ్యెను.  ఆమె నొక వారం విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చినారు.

వర్ష నవ్వుతూ "ఆమె అమాయకపు పిల్ల"అనెను.

మంజూషకు పట్టరానికోపమొచ్చెను"నీతోకలిసి  ఒకే బడిలో  చదువు కొన్నదని అట్లు వెనకేసుకు వచ్చుచున్నావు కానీ అది అమాయకపు పిల్లా?! ఆమెవద్ద ఆడపిల్ల కట్టుకునే బట్ట ఒక్కటైనానూ కలదా?   పుట్టినరోజు వచ్చినచో వేలు తెగలేయును. ఆమెది పూర్తి పాశ్చాత్య ధోరణి. అది నీకు అమాయకంగా యున్నదా?”అని మంజూష  రగిలెను. 

"మంజూ! మనం భయంకరమైన కాలంలో జీవించుచున్నాము! ఆంగ్ల విద్యతో మన జీవితమూ మొదలై వారి కొలువుతో ముగుయుచున్నది. ఆంగ్లేయులు మన దేశాన్ని విడిచిపెట్టిన చాలా కాలం తరువాత ఆంగ్ల భాష మరియు సంస్కృతి మన దేశాన్ని శాసించుచున్నది. ఆంగ్ల మాధ్యమములో చదువుకొన్న ఎంతమంది ఆంగ్లముపై ఆధారపడు  ఉద్యోగములు తెచ్చుకొని నారు?   ఆంగ్ల మాధ్యమ ములో చదువుకొన్న వారికి ఎంతమందికి ఆంగ్లమబ్బినది?  మాతృ భాషలో విద్యనభ్యసించి ననేకులు జిల్లా కలెక్టర్, మరియు పోలీసుఅధికారి వంటి పెద్ద పదవులలో ఉండుట మనము చూచుచున్నాము కదా.

ఆంగ్లంలో చదవనిచో  ఉద్యోగాలురావని (బ్రెయిన్ వాష్)తలంటినారు.  అట్లు నమ్మబలికిన ప్రబుద్ధులు మన పెద్దలే. మన పెద్దలనగా మన చిత్ర  దర్శకులు, నటులు రాజకీయ నాయకులు. కవులకు కోవిదులకు రచయితలకూ పూచికపుల్ల విలువలేని నేటి కాలాన వారే మన పెద్దలు. పూర్తి సత్య విరుద్ధమైన ఈ మాట మన పిల్లల  మనసులలో నాటు కొన్నది. ఆంగ్లమున మాట్లాడినచో  విద్యాధికుడు లేనిచో విద్యాహీనుడు డన్నట్లు చిత్రములందు చూపుచూ కడకు ఆంగ్లభాషను ప్రతిష్టాత్మకంగా మలచినారు, వస్త్రధారణలో(ప్రతి నటుడూ సూటు బూటు, హేటుతో) వారిని అనుకరించుచూ జీవన విధానములో (పబ్ లు, క్లబ్ లు) వారిని అనుసరించుచూ అట్టి వారే గొప్పవారని, అదియే గొప్పజీవన విధానమని సంప్రదాయ ములను మంటగలిపి, ఆ వివేక హీనులే మాతృభాషకు మంగళ హారతి పాడినారు. కొన ఊపిరితో ఉన్న తెలుగు భాషకు నేటి ప్రభుత్వములు కొరివి పెట్టి ఋణము దీర్చుకొన్నవి.

వస్త్రధారణ ఆధునికతగా వర్ధిల్లుచున్నది. వారి సంస్కృతి నాగరికత జీవన ప్రమాణములుగా వెలుగొందుచున్నవి.  ఇక్కడ ఎంత పాశ్చాత్య సంస్కృతిని ప్రదర్శిస్తే అంత గొప్పగా భావించెదరు. ఇది తరతరాలుగా మనకి అంటగట్టబడినది. నేడు వారి వస్త్రములను ధరించుకున్న తప్పు.  తాగకున్న తప్పు. 

మద్యము అమ్మకాలపై  ఒక్క రోజులో మన రాష్ట్ర ఆదాయము127 కోట్లు అనిన ఎంత విరగబడి త్రాగుచున్నారో తెలుసుకొనవచ్చు. ప్రజలను పతనపు  అంచుకి తీసుకువచ్చి పబ్బము గడుపుకొను పెద్దలు రాజకీయ, చిత్ర విద్యారంగ ములందు తిష్ట వేసి యుండగా లకుమవంటి పిల్లలు అమాయకులే  కదా!" అనెను. 

అదే సమయము మాలిని పొరుగింటి సీతారత్నం తోటలోకి ప్రవేశించెను.  “సీతారత్నంగారా? రండి రండి ఏమీ ఇట్లు వచ్చినార”ని మాలిని అడుగగా  "కొబ్బరి పొట్టు తీయుటకు  వెడల్పాటి కత్తి కావలెనని." చెప్పుచూ ”దయచేసి నన్ను సోనీ అని పిలవండి. నా భర్త, పిల్లలునన్నట్లే పిలిచెదర”అనెను “సీతారత్నమును పేరుకే మొచ్చె. అది మార్చ పనేమున్నది?” అని మాలిని నొచ్చుకొనెను. “కానీ అది మొరటుగా యున్నది కదా. పనిపాట్లు చేసుకొనువారి పేరువలె నున్నది కదా! నా కూతురు పేరు సంఘవి. మేము ఆమెను సన్యా అని మరో కూతురు పేరు తనూజ. మేము ఆమెను తాన్య” అని పిలిచెదమని సీతారత్నమనగా మాలిని అవాక్కయ్యెను.


 “మన పొరుగింటి మంగళగౌరి ధన లక్ష్మి కూడా పిల్లల పేర్లనిట్లే మార్చినారు.” “మన సంస్కృతికి వంకపెట్టినారు కదా!”అని మంజూష అనగా “వంకేమున్నది ఆంగ్లేయులవద్ద మనమింకనూ పనిపాట్లు  చేసుకొను వారమే  కదా!  మీరు సముచితముగానే సెలవిచ్చినారు సోనీ మాతా” అని వర్షుడనెను.

నీకు భారతవర్ష అను పేరున్నది కదా దానినాధురీకరించవలె”ననెను "భారతవర్ష అనునది మన దేశపు ప్రాచీన నామము. నాతండ్రి అమర జవాను దేశముపై ప్రేమతో ఈ పేరు పెట్టెను. అది ఎన్నటికీ మార్చబోన”ని వర్షుడనగా “అయినచో ఉంచుకొనుము కానీ ఆంగ్లము నేర్చుకొనుము. ఆంగ్లము గొప్ప భాష. ఈ సాంప్రదాయ దుస్తులను వీడనిచో, ఏ అమ్మాయి నిన్ను పెళ్ళాడుటకు ముందుకు వచ్చును?”అని సీతారాట్నము ఈసడించెను. 

“సంప్రదాయాలను ఇష్టపడే అమ్మాయి అతనిని పెళ్లి చేసుకొనును లేనిచో వాడు బ్రహ్మచారిగా మిగులును. మీరు అతని పెళ్లి గురించి చింతించవలద" ని  మంజూష అనెను.  అంతలోనే మాలిని పెద్ద కత్తితో వచ్చి "పెద్దవారితో వాదనెందులక”ని మంజుని మందలించెను.

సీతారత్నం: చూడు మాలిని నీ కూతురు నాతో వాదనకు దిగుచున్నది. నేను నిజం చెప్పుచున్ననూ తలకెక్కించుకొనుటలేదు.

మాలిని: మన సంస్కృతికి వ్యతిరేకంగా నేను వారికి చెప్పలేను. నా భర్త  ఈ దేశం కొరకు  ఊపిరి వదిలినాడు అట్టి దేశపు సంస్కృతి మాకు ఊపిరి.  అందులకు మాప్రాణములు పోయిననూ మేము చింతించము. ఉద్యోగముల కొరకు మాతృభాషని వదిలి, విలాసముల కొరకు విదేశములు పొమ్మని చెప్పు పెద్దలుండుట మనకు సిగ్గు చేటు.  నా పిల్లలను పాశ్చాత్యీక రించలేను. వారి పేర్లను నేను సవరించలేను,  సన్నీ, బన్నీ, సోనీ అని నానోటితో నేను పిలువలేను. మాతృభాష మరియు మాతృభూమి అసమానమైనవి. నేను నేర్చుకున్నదియే. ఇదే నాపిల్లలకు నేర్పినాను.

సీతారత్నం: ఉద్యోగములటుండనిమ్ము పిల్లలకు పెళ్లిళ్లు అవ్వవలెను కదా. మా కొడుకు గుడిలో పూజారి. అతడిని పెండ్లాడుటకే యువతీ ముందుకు రాకుండెను. అందుచే వాడు  శ్రమకోర్చి  కంప్యూటరు విద్యల నేకము నేర్చి ఆంగ్లమభ్యసించి అమెరికాపోయినాడు. పిదప వాడికి పిల్ల దొరికినది  పెండ్లి కుదిరినది. నేడు యువతులు పంచె గట్టిన వారిని చూచి పరిహసించుచున్నారు. రామేశ్వరమునుండెడి నా తమ్ముడి కొడుకు కూడా అట్లే ఆంగ్లము నేర్చుకొని అమెరికా పోయినాడు. తెలుగు, సంస్కృతములు వ్యర్థ భాషలు.

అప్పుడే కోల ముఖము కొంచెం గడ్డంతో ఉన్న ఒక పొడవాటి వ్యక్తి లోపలికి వచ్చెను.  అతను సంభాషణ చివరి భాగం విని యుండుటచే “సీతారత్నం గారు, నేను వర్ష చిన్ననాటి స్నేహితుడిని . నా పేరు రాఘవ. నేను అమెరికా పోయి వచ్చితిని. నేను నా పేరు మార్చుకోలేదు మరియు మన సంస్కృతిని వదిలిపెట్టలేదు. 

నేను ఇంగ్లీష్ నేర్చుకుని అమెరికా వెళ్లితిని. అచ్ఛటంతయూ బ్రతుకు పోరాటం డాలర్ల కోసం ఆరాటం దప్ప మరే మియునూ కానరాదు.  అక్కడ జీవితందుర్గంధ భూయిష్టంగా నున్నది. ఇక్కడ ఎప్పుడూ చేయని పిల్లలనాడించుట,  మరుగుదొడ్లు కడుగుట వంటి  పనులు అక్కడ అనేకము చేయవలసి వచ్చెను. 

 భారతదేశంలో చాలా మంది యువకులు ఇట్లే  ఇంగ్లాండ్ అమెరికాలలో పాచిపనులు చేసి బ్రతుకుచుండగా వారి తల్లిదండ్రులుమనదేశములో గొప్పలు చెప్పుకొను చున్నార”ని రాఘవ తన అనుభవమును ఏకరువు పెట్టెను.  భారతవర్ష మౌనంగా ఉండుట చూచి ఇవన్నియూ వర్షునికి తెలియును కదా మారేల మౌనముగా నుండెననుకొని  ఆశ్చర్య పడెను. 

మాలిని రాఘవని "నీ పరిశ్రమ స్థాపన ఎంతవరకూ వచ్చెనని మాట మార్చ ప్రయత్నించగా. రాఘవుడామె మనసు గ్రహించిననూ పట్టించుకొనక"పెద్దవారికి పసిపిల్లవాడు నడక నేర్పినట్టు ఒక పండిత బహుబాషికి ఇంగ్లీషు గొప్పతనాన్ని నేర్పిస్తున్నార” ని ఎద్దేవా చేసెను. అందుకు నొచ్చుకున్న సీతారత్నం "నేను కూడా చదువుకున్న మహిళనే. యని తిప్పికొట్టెను.

"భారతదేశంలోని సంస్కృత పండితులు సూర్యుడికి వందకు పైగా పేర్లు పెట్టారు. సూర్యునికి ఆంగ్లంలో ఐదు పర్యాయపదాలు చెప్పగలరా?"అని రాఘవ అడగగా ఊహించని ప్రశ్నకు సీతారత్నం ఆశ్చర్య పోయెను. పిదప ఆలోచనలో పడెను.  కానీ ఆంగ్లం లో సూర్యకి మరే ఇతర పేరు కూడా చెప్పలేకపోయెను. 

భరతవర్ష " భానుడు, భాస్కరుడు, దినమణి  ఆదిత్యుడు, అంబరీషు, అనుచూ తెలుగులో అనేక పర్యాయ పదములు చెప్పుచుండగా రాఘవ ఆమెను "స్త్రీ అను పదమునకెన్ని ఆంగ్ల పర్యాయపదములు కలవ”ని మరో ప్రశ్నడిగెను.  సీతారత్నం నిశ్శబ్దంగా ఉండిపోయెను.

రాఘవ: అందమైన దంతాలు ఉన్న స్త్రీని సుదతి అని, పొడవాటి మందపాటి జుట్టు ఉన్న స్త్రీని కేసని అని, అందమైన పెదవుల ఉన్న స్త్రీని బింబదారి అని పెద్ద రొమ్ము ఉన్న స్త్రీని గుబ్బలాడి అని, విశాలమైన పిరుదులు ఉన్న స్త్రీని నితంబి అని పిలిచెదరు. మన పండితులు స్త్రీ  ఆకృతికి తగిన పేర్లు పెట్టినట్టుగానే అష్ట విధ నాయికలకు మానసిక స్థితినిబట్టి స్వాధీన పతిక, వాసకసజ్జిక, విరహోత్కంఠిత, విప్రలబ్ధ, ఖండిత, కలహాంతరిత, ప్రోషితభర్తృక అని పేర్లు పెట్టినారు. తన ప్రేమికుడిని కలవడానికి  సంకేత స్థలం వద్ద  ఎదురు చూసే స్త్రీ ని అభిసారిక అందురు.

భరతవర్ష: ఆంగ్లభాషాసంస్కృతుల నాలింగనము జేసుకొని యువకుడని  నిరూపించు కొనుటనాకు అత్యంతహేయమమని దోచుచున్నది. పాశ్చాత్య జీవన శైలిని చూపి అమ్మాయిని పెండ్లాడుట కంటే బ్రహ్మచారిగా మరణించుట మెరుగు.

“వయసు వేడిలో ఉన్నవానికేమి  జెప్పిన లాభమేమి? అయిననూ అన్ని విషయములు  బోధయోగ్యముకావు. కాలమే నీకు గుణపాఠం నేర్పున”ని సీతారత్నం కోపంగా కదిలిపోయును.



11 comments:

  1. ఇట్టి భాష ను మరలమరల ఆస్వాదించుటకు పుస్తక రూపమందు నిక్షిప్తము గావించుట అవశ్యకము
    మరో గొప్ప ప్రయోగానికి శ్రీకారము చుట్టిన గురువర్యులకు పెక్కు వందనములు

    ReplyDelete

  2. While reading Bharat Varsha chapter -1 I understand now a days most of Andhra people they losing their mother tongue and wearing the mask of English and speaking butler English but they don't learn both English and Telugu and I am also one of the example so it makes me to realise myself.

    ReplyDelete
  3. It was hard for me to read but still read and understood the overall meaning of this chapter. I hope my reading skill will improve by completing bharatavarsha.

    ReplyDelete
  4. గ్రీకు పురాణములో భూలోక సుందరుడగు గొర్రెలకాపరి చంద్రుడు వారికి పురుషుడు కాదు ఆమె ఒక అప్సరస రంభా ఊర్వశిలవోలె అపురూప సౌందర్యవతి యగు కామిని , అందుకే చంద్రగ్రహ అధ్యయమును ఆంగ్లమున సెలీనాలజీ యని వ్యవహరింతురు అందముగా ఉన్న పురుషులు కంట పడిన ఆమె వదిలిపెట్టదు.

    ReplyDelete
  5. Sir it's me dharahas the reading is some what hard but the lines were very interesting when I'm reading i got excited to read and i felt how much telugu language is.
    Thank you sir for helping to know the true value of telugu language🙏🙏🙏

    ReplyDelete
  6. పూలబాల గారు ఈ రోజే భరతవర్ష చదవటం మొదలెట్టాను. అచ్చ తెలుగులో అద్భుతంగా రాసారు. అబినందనలు

    ReplyDelete


  7. పూలబాల గారు ....
    అచ్చ తెలుగులో అద్భుతంగా రాసారు. అబినందనలు

    ReplyDelete

పేరు పాపారావు - మనసు మల్లెపూవు

తెలుగుపై మల్లెల్ల జల్లు కురిపించే కుర్రోడు. తల్లి దండ్రుల కల ఎలా ఉంటుంది అంటే ? స్కూల్ నుంచి  తెలుగు ఊసెత్తడానికి వీల్లేదు. తెలుగు పుస్తకాలు...