Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, August 31, 2020

Bharatavarsha 32

కవిరా   జులుద్భ  వించిన   

కవనకృ తికీర్తి బడసిన కట్టడ మిదియే  

నవరస మధుర ఇతిహాస  

శివమోక్ష  ముచుకుం దఇంద్ర  సంగమ  మిదియే   

ఋగ్వేద కాలమందు కావేరి నది వొడ్డున వెలసిన   బహు పురాతన పూంపుహార్ పట్టణము పురాణ సాహిత్యమునకు పుట్టినిల్లుఉరుతి రంగన్నార్ , యను రెండవ శతాబ్దపు తమిళ కవి రాసిన పత్తినప్పలై  పుహార్‌ పట్టణమున కద్దము పట్టును. పుహార్ అనగా తమిళమున  నదీసముద్ర సంగమమని యర్థము. ఇచ్చట దృగ్గోచరమగు కావేరీ సాగర సంగమమును  అగోచరమగు సంగమ సాహిత్య సంగమము మరింత పవిత్రమొనర్చి పూమ్పుహార్  రేవుపట్టణమునకు  దిగంతఖ్యాతి నొసగుచుండ  జ్ఞానచక్షువులున్న కొండొక వ్యుత్పన్నుఁడది  గాంచి మహానందము నొందుచుండగా  తక్కిన మ్రుక్కటి జనులొక్క మునకవేసి పరితుష్టి నొందుచుందురు.  

ఐదు గొప్ప తమిళ ఇతిహాసాలలో ముఖ్యమైన  సిలపతిగారము గ్రీకులకు ఇలియాడు వలె  తమిళులకు ఉత్కృష్ట కావ్యము, మణిమేకలై యను రెండు ఇతిహాసములు ఇచ్చటనే పుట్టినవి  కావేరినది ఇచ్చటనే సముద్రమున కలియుటచే ఇచ్చట సందర్శకులు నదీసంగమ మందుపుణ్య  స్త్నానమాచరింతురు. సిలపతిగారం  శిల్పప్రదర్శనశాల    కోత్రా వంటి రంగస్థలము (ఇతిహాస సౌందర్య రాసి యగు నర్తకి మాధవి నాట్యమాడిన స్థలము )ఇతర దర్శనీయ స్థలములు ఉండుటచే పూమ్బుహారు నిత్యమూ తీర్ధ యాత్రికులతోపాటు సందర్శకుల తోనూ కిటకిట లాడుచుండునుపూమ్బుహార్  సముద్రతీరం వద్ద  హోటల్ తీసుకొని వారా రాత్రికి విశ్రాంతితీసుకొనిరిషిరోమి "నాకిక్కడ స్నేహితులు కలరు వారింట నుండెదను" అని చెప్పి సెలవు తీసుకొనెను.  

మరుసటిరోజు ప్రాతః కాలమున అంగయారు కన్నె, వరదాచార్యుడు నదీసముద్రసంగమము వద్ద స్తనమాచరించి అల్పాహారం తీసుకొని హోటల్ నందు వేచి యుండగా షిరోమి వచ్చి వారిని నగరసందర్శనముకొరకు తన వాహనంలో కొనిపోయెను. సిలపతిగారం శిల్పప్రదర్శనశాల,   సందర్శించి కోత్రా పండల్ నందు మాధవి చిత్రములను గాంచి ముదమున సౌహిత్యము నొందిరి. 

చోళరాజుల పాలనలో ఈ రేవు పట్టణమున  ఇంద్రుడు  వినాశకరమైన ఆయుధాలను కలిగి ఉన్న శక్తివంతమైన రాక్షసులపై పై పోరు సలిపెను.  అమరావతి రాజ్యాన్ని కాపా డుటకు   తన దళాలను  ముచుకుంద చోళ ఎంత గొప్పగా నడిపించాడో పురాణాలు చెబుతున్నాయి.  కృతజ్ఞతగా ఇంద్రడు తన  విశ్వకర్మను అమరావతి తరహాలోనే నగరాన్ని నిర్మించమని ఆదేశించెను. సర్వాంగ సుందర నగరాన్ని విశ్వకర్మ నిర్మించి ఇచ్చెను. అన్ని  ఖండాల నుండి  పుహార్ను సందర్శించుటకు అనేకులు వచ్చెడివారు. దేవతలు వచ్చి దేవాలయాలలో పూజలు చేశారని తమిళ పురాణము  సిలపతికరమ్ చెప్పుచున్నది" అని చెప్పెను. అప్పుడా దంపతులు సిలపతిగారం గూర్చి చెప్పమని షిరోమిని అడిగిరి  వారప్పుడు  పురాతన పల్లవనేశ్వరర్ ఆలయమును జేరిరి మీరు దర్శ నానంతరము కోనేటివద్దకు వచ్చిన నేనచ్చటనే యుండునని జెప్పి కోనేటికడ వేచియుండెను కొలది సేపటిలో వరదునిగూడి కన్య  అచ్చటికి వచ్చి "కోనేటి మెట్లపై కూర్చొని ఆంధ్రదేశమునుండి వచ్చిన ఒక యువకునితో సంవాదమునున్న షిరోమిని గాంచి  ఆ జంట వారి ప్రక్కనే కూర్చొనెను.  

యువకుడు : ఇచ్చటమియునూ ఆకర్షనీయమైన ప్రదేశములు కానరావు ఈ దేవాలము కూడా మారు మూల విసిరివేయబడినట్లున్నది ఎందులకు వచ్చితినని చింతిచుచున్నాను 

షిరోమి: వేయి సంవత్సరముల పూర్వము నీ పూర్వజు లిచ్చట ఈ పురాతన దేవళము ను నిర్మించుట నీవు మెచ్చకున్ననూ ఇచ్చటనే కావేరీ నది సముద్రమునందు కలియు నదీసముద్ర సంగమము గాంచి సంతసించుము. పూమ్పుహార్  దైవ నిర్మిత నగరమని పురాణములు జెప్పుచున్నవి.

 యువకుడు: నేను పుక్కిట పురాణములను నమ్మజాలను.

అయినచో ఇతిహాసమును జెప్పెదను వినుము అనుచూ  

షిరోమి: కన్నగి పురాతన తమిళ సాహిత్య రచన సిలపతిగారం యొక్క పురాణ కథానాయిక. తమిళ సంస్కృతి మరియు పవిత్రతకు చిరస్మరణీయ చిహ్నమైన కన్నగి తమిళ స్త్రీల వ్యక్తిత్వ ప్రతీక. కన్నగి నమ్మకద్రోహము చేసిన  భర్త  కోవలన్తో కలిసి ఉండే పవిత్ర మహిళగా అభివర్ణించబడిందికోవలన్ ఒక నర్తకి మాధవిని కలుసుకున్నాడు మరియు ఆమెతో సమ్మందం పెరుగుచుండ   అతని సంపద తరుగు చుండెను. అట్లాతడి సంబంధము సంపద మొత్తమును నర్తకి కోసం ఖర్చు చేయడానికి ప్రేరేపించింది. చివరికి, డబ్బులేని, కోవలన్ తన తప్పును గ్రహించి, తన భార్య కన్నగి వద్దకు తిరిగి  వచ్చెను

కన్నగి యొక్క విలువైన కాలి అందెను అమ్మి మదురైలో వ్యాపారం చేసి  తన అదృష్టాన్ని తిరిగి పొందవలెనని  కోవలన్ భావించగా కన్నగి తన అందెను అందించెను. అందెను విక్రయించ ప్రయత్నించు చుండగా, అది రాణి గారి దొంగిలించబడిన కాలిఅందె అని పొరపాటుగా భావించి రాజా భటులతడిని గొనిపోయిరివిచారణ లేకుండా కోవలన్కు   శిరచ్ఛేదం  గావించబడెను . విషయం కన్నగికి తెలియగానే ఆమె కోపంగా   రాజు ఆస్థానానికి వచ్చి, తన భర్త  నుండి స్వాధీనం చేసుకున్న అందెను  తెరిచి, అందులో మాణిక్యాలు లుండుట  చూపి రాణిగారి (అందెలో ముత్యాలున్నవి) అందె కాదని నిరూపించెను.

క. విరిగెను అందియ రూఢిగ        

వరిగెను రేణిశి రముచకి  తులాయిరి  బుధులు   

పెరిగెను తాపము ఇంతికి        

 పొరపడి నాధుని శిరమున రకగన్ 

తప్పుగా నిందించబడి మరియు న్యాయం విచారణ లేకుండా  భర్తకు శిరచ్చేదము జేయుటవల్ల  కన్నగి మదురై రాజునేదుంజ్ చెలియన్నుమదురై నగరాన్ని శపించెనుమధురై నగరము మంటలలో చిక్కుకొనేని కాలిపోగా తప్పును గ్రహించి, రాజు సిగ్గుతో ఆత్మహత్య చేసుకున్నాడుమీనాక్షి దేవి విజ్ఞప్తి మేరకు, ఆమె శాంతిం చెను, తుదకు కన్నగి మోక్షము నొందెను." 

క. అసువులు బాసిన పెనిమిటి 

కోసము కానఁగి బొటబొట కన్నీరు కార్చెన్                        

విసవిస  విసిరెను  శాపము 

తీర్చెను మీనా  క్షియమ్మ  తాపము వీడెన్ 

 షిరోమి కథను ముగించి ఆంద్రునివంక చూచు చుండెను 

యువకుడు: ఇది ఒక మాదిరి "ట్రాజిక్ లవ్ స్టోరీ" అనిన విషాదాంతమగు ప్రేమకథ.  షేక్స్ పియర్ ఇటువంటి కథలు పుంఖాను పుంఖాలుగా వ్రాసియుండెను పూంపుహార్... పూంపుహార్.."యని చిత్ర రావములు ( cine prattle) చేయుచూ లేచి వెడలిపోయెను. 

తదుపరి వారొక సత్రము కడ తేనీరు సేవించుచూ సేదదీరారుచుండిరి "జ్ఞాననేత్రములే లేనిచో ఎదుట పరమేశ్వరుడు నిలిచిననూ దేనికో వెదుకుచుందురు" యని వరదాచారి అనగా, "జ్ఞాననేత్రములు లేకున్ననూ కుతూహలమున్న చాలును  నాకు తెలుసు కోవలెనని కుతూహలము కలుగు చున్నది, మరికొంచెము .. అనుచుండగా షిరోమి నవ్వుచూ

"సిలపాధిగరం ఇతిహాసం ఆధారంగా  1942 లో నిర్మితమైన   కన్నగి అనే తమిళ  చిత్రము 2016 లో నిర్మితమైన పత్తిని అనే సింహళ చిత్రం శ్రీలంకలో విడుదలైనవి. కన్నగి విగ్రహము  సుందర మెరీనా సాగరతీరానికి, సరైన స్థానానికి   చేరెను . ఆమె విగ్రహము 1968 లోనాటి ముఖ్యమంత్రి అన్నదురై ఆధ్వర్యంలో స్థాపించబడింది. ఈ విగ్రహము జయలలిత ప్రభుత్వానికి అరిష్టమని వాస్తు నిపుణులు జెప్పియుండుటచే  2001లో  (అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎఐఎడిఎంకె అధినేత్రి) , అవినీతి కేసుల్లో దోషిగా తేలిన తరువాత సెప్టెంబరులో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవలసి వచ్చినందున  కన్నగి విగ్రహాన్ని ఎఐఎడిఎంకె  ప్రభుత్వం తొలగించింది. మన ప్రభుత్వము లిట్లున్నవి. 

ఐదు గొప్ప తమిళ ఇతిహాసాలలో మణిమేకలై  ఒకటి. మణిమేకలై  4,861 పంక్తులను కలిగి సిలపతికరం ఇతిహాసం యొక్క జంట-ఇతిహాసం (సీక్వెల్). తమిళ ప్రజల యొక్క జీవితం, సంస్కృతి మరియు సమాజం గూర్చి  అవగాహన కలిగించు  ముఖ్యమైన గ్రంథంగా మణిమేకలై విస్తృత ఆదరణ పొందింది .  కోవలన్ మరియు మాధవి కుమార్తె పేరు మణిమేకలై , ఆమె తల్లి అడుగుజాడల్లో నర్తకిగా మరియు బౌద్ధ సన్యాసిని (భికూని) గా అనుసరిస్తుంది." 

ఈ సమీపమునింకేమైననూ  ప్రసిద్ధ దేవాలయములు గలవా యని వరదాచార్యుడు షిరోమిను అడుగగా ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం రంగనాథస్వామి ఆలయం తిరుచిరాపల్లి నందుగలదు చూడవలె నన్నచో ..." యని షిరోమి అనుచుండగా " పోయెదము, ముందు భోజనములు కానిచ్చి పోయెదము" అని వరదాచార్యుడనెను. వారు స్థానిక సత్రమునందు భోజనములు ముగించి , కొలదీసేపు విశ్రాన్తి తీసుకొని బయలు దేరిరి. 

రంగనాథస్వామి ఆలయాన్ని  236 అడుగుల ఎత్తుగలిగి విశ్వములోనే అత్యంత ఎత్తైన సమున్నత హిందూదేవాలయము. విజయనగర సామ్రాజ్యానికి చెందిన అచ్యుత దేవరాయ హయాంలో రంగనాథస్వామి ఆలయ రాజగోపురం నిర్మాణం ప్రారంభమైంది.  అతని మరణం తరువాత నిర్మాణం నిలిపివేయబడింది  రాజగోపురం నిర్మాణం 400 సంవత్సరాలకు పైగా అసంపూర్తిగా ఉంది. 

చరిత్ర ను చదువువాడు ఆలకించువాడునూ లేని నేటి సమాజమున సంస్కృతి ఇంకను మిగిలియున్నదన్నచో దానికి కారణము  భక్తి సంస్కృతి. అట్టి భక్తి సంస్కృతికి బీజములు తమిళనాట పడినవి. 5 వ మరియు 9 వ శతాబ్దాల మధ్య నివసించిన శైవ నయనార్లు మరియు వైష్ణవ అల్వార్లతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. వారి ప్రయత్నాలు చివరికి 12 వ -18 వ శతాబ్దం నాటికి భారతదేశం అంతటా భక్తి కవిత్వం మరియు ఆలోచనలను వ్యాప్తి చేయడానికి సహాయపడ్డాయి. 

రామానుజ వైష్ణవ మత బోధలకు ఒక తాత్విక ఆధారాన్ని ఇచ్చారు. దక్షిణాదికి చెందిన నింబార్కా భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రాధా కృష్ణ ఆరాధనను ప్రతిపాదించాడు. దేవాలయాల వెనుక రాజులు మరియు  ఆధ్యాత్మిక వేత్తలైన కవులు కళాకారులు ,ఎందరో మహాను బావులు ఉండటంవల్ల సుస్థిరమైన భారతసంస్కృతి సాధ్యపడినది.  భక్తి, గానం మరియు నృత్య సంప్రదాయంతో ప్రారంభ భక్తి ఉద్యమం యొక్క కేంద్రాలు ఈ దేవాలయాలు. భక్తి ఉద్యమం  అనుచరులు కుల భేదాన్ని తిరస్కరించారు. సమానత్వం ఆధారంగా వారు కలిసి కలపడం ప్రారంభించారు. వారు సాధారణ వంటగది నుండి కలిసి భోజనం తీసుకున్నారు.వామ పంక్తులకు ఈవిషయములు దెలిసిననూ బ్రిటీషు పాలన వలననే మనకి నాగరికత  సమానత్వము తెలిసివచ్చెనని, వారు రానిచో మనము అనాగరికులవలె నుండెడివారిమని ప్రచారము చేతురు.

హిందూ మతం  దేవతలలో స్వలింగ సంపర్క ధోరణులు, జాతులును  స్పష్టంగా వివరిస్తుంది. నాటి  ఇస్లాం దండయాత్ర  తరువాత  క్రైస్తవ నైతికత మరియు చివరకు విక్టోరియన్ కాలం  కూడా  అత్యంత అభివృద్ధి చెందిన మరియు ఆరోగ్యకరమైన లైంగిక అవగాహనను చూశాయి ఆనాడు సెక్స్ కూడా నిషిద్ధం కాదు. స్వలింగ సంపర్కం, లెస్బియన్ మరియు ద్విలింగత్వం ఆమోదయోగ్యమైన ప్రవర్తనా విధానాలుగా నుండెడివి.   ఆధునిక భారతదేశంలోవలె   స్వలింగ సంపర్కులను మరియు లెస్బియన్లను నాఁడెక్కడా   గేలి చేయలేదు.

మా అమ్మను చూడవలెను అని పూనమల్లి పోయెదము అని వరదుడు షిరోమిని పూనమల్లి పొమ్మనెను తరువాత భోజనం ముగించి వారు ఆఖరి మజిలీ  పూనమల్లి బయలుదేరిరి.   చెన్నపట్టణానికి 24 కిలోమీటర్ల దూరంలో వున్న.  "పూనమల్లికి సమీపములో ఫోర్ట్  సెయింట్ జార్జ్ చూడవలసిన ప్రదేశము అచ్చటకు పోని మ్మందురా?" యని షిరోమి అడుగగా వరదుడు నవ్వి "మనము వచ్చినది తీర్ధ యాత్రలకి కావున మన మచ్చటికి పోరాదు, పూనమల్లి పోనిమ్ము మా అమ్మగారు ఎదురు చూచుచుందురు. నీవు మాతో కలసి భుజించవలెను. 

నేను చిన్నపటినుంచి ఇచ్చటనే పెరిగితిని ఫోర్ట్  సెయింట్ జార్జ్ గూర్చి మీకంటే నాకే ఎక్కువ తెలియును మీరిద్దరూ అర్ధ తమిళులు మీకు నేను చెప్పెదను. వాణిజ్య కార్యకలాపాల కోసం 1600 లో భారతదేశంలోకి ప్రవేశించిన ఈస్ట్ ఇండియా కంపెనీ  తొలుత  సూరత్ వద్ద వ్యాపారాన్ని ప్రారంభించింది, పిదపిచ్చట తీరప్రాంత భూమిని కొనుగోలు చేయడంలో విజయవంతమైంది. ఇక్కడ కంపెనీ, ఒక నౌకాశ్రయం మరియు కోటను నిర్మించెను. ఈ కోటనిర్మాణము  1644  లో పూర్తయింది,  ఫోర్ట్  వ్యాపారి కార్యకలాపాల కేంద్రంగా మారింది. ఇది జార్జ్ టౌన్ అనే కొత్త స్థావరానికి జన్మనిచ్చింది, ఇదే  మద్రాస్ నగరం ఏర్పడటానికి  కర్ణాటకపై ఆంగ్ల ప్రభావాన్ని స్థాపించడానికి కూడా కారణమైనది. వాహనము పూనమల్లి పొలిమేరలు చేరగానే అంగయార్ కన్నె "పూనమల్లి అనే పేరు  పూవిరుండవల్లి నుండి ఉద్భవించిందని, అంటే “మల్లె పండించిన ప్రదేశం” అని అర్ధం. అని మార్గదర్శకుని చందమున జెప్పుచుండ షిరోమి నవ్వసాగెను. 

నాటి రాత్రి వరదాచార్యుడు సన్యాసము స్వీకరించవలెననెడి తన మనసులోనున్న కోరిక తెలుపుచూ మీ ఇద్దరి అంగీకారము కావలెనని తల్లిని అర్ధాంగిని అర్ధించెను. కన్నె ను అడుగగా " మీ అమ్మగారి అంగీకారము తెలుసుకొనుడు " అని చెప్పెను. ఆయన తల్లిగారు "నా అంగీకారము  కంటే నీ భార్య అంగీకారమే ముఖ్యమనుచు త్రోసి పుచ్చెను."

కొంత సేపు మౌనము రాజ్యమేలెను. గత మూడు సంవత్సరములనుండి నాకొడుకు నాకు నచ్చ జెప్పుచున్నాడు నాకేమియునూ తోచలేదు , ఇప్పుడు కూడా అదే ఉద్దేశ్యమున్నచో ...నేను నచ్చ జెప్పజాలను , యని కన్నె మొఖమును తన చేతిలోకి తీసుకొని కన్నీరు కార్చ సాగెను. కన్నె ఆమెను ఓదార్చి కన్నీరు తుడిచెను. వరదాచార్యుడు కొన్ని ఆస్తి పత్రములు , విడాకుల పత్రములు సంతకము చేసి ఇచ్చి మౌనముగా తన గదిలోకి పోయెను. తెల్లవారి చూసిన అంగయార్ కన్నెకు వరదుడు కనిపించలేదు.  ఒక అధ్యాయము ముగిసెనని భావించి కన్నెఅత్తగారు లేచువరకు నుండి ఆమెకు పత్రములు ఇచ్చి ఆమెను తనతో పాటు తీసుకొని  చెన్నపట్నమునకు బయలుదేరెను.  

Bharatavarsha -31

రేగడ  రాగమున ధగధగ లాడు ఫియాగో   బేగడ రాగమువలె  వలె సాగుచుండ మదోన్మత్త తురంగ సకిలింతలు సద్దుమణిగిన అంగయార్ కన్నెమది సారంగరాగము పాడుచుండె. శృంగార సాఫల్యతా సంతృప్తి బడసిన దేహము కొంగ్రొత్త కాంతులీనుచుండ పంచక్షేత్రాలు నొక్కసారిగా దర్శించిన కలుగు ప్రశాంతత మనమునలుముకొనగా కన్నె కొనకంట వరదాచార్యుని గాంచి మధుర ధరహాసముజే యుచూ మైమరపు బొందుచుండెను. ఆచార్యుడు అంకె యని అల్లన పిలిచెను. బదులుపలకని కన్నెను  గాంచి “అంగయార, అంగయార” యని వత్తి బలికెను. తలతిప్పిజూచిన పూబోణితో   పిలిచిన పలుకక ఏ లోకమునుంటివి యనెను “ ఎప్పుడో  వివాహమైన కొత్తలో  అంగయార , అంకె  యని పిలిచెడివాడవు. ఇంకనూ ఆపిలుపులెట్లు గుర్తుండును. “శృంగార విభావరి తలచుకొన్న ఇంతుల శృంగార కైవల్యము పునఃప్రాప్తి నొందరే, ఏమో యనుకొంటిని అంకెకాడవే నీవు యనుచు బుగ్గ పోటున, సిగ్గునొందె. వాహనమును నడుపుచున్న షిరోమి నవ్వుకొని వాహన వేగమును పెంచెను.

మనముఁబోవుచున్నది తీర్థ యాత్రకు శృంగార యాత్రకు కాదు, చిలకల కొలికి శృంగార కవయిత్రివగుచున్నదే యనగా, నేను గాయకురాలిని అని తెలియజేయుట కన్నట్లు సందర్భోచితముగ

“అంకెకాఁడవోఁగు నూతులౌభళేశ, పొంకమాయ నీ సతి పొందు మఱవకుమీ” 

అన్నమయ్య గీతమునాలపించెను. కన్నులర్ధనిమీలితము లగుచుండగా, ఆ నిండు గోదారితన పెనిమిటి  ఎదపైవాలెను. కుచద్వయ ఒత్తిడికి వరదాచార్యుడు సిద్ధునివలె చలించక, భార్యాజితుని వలె  నొఱగక ఆమెను లేవనెత్తి, దూరముగా జరిగి కిటికీకడకు బోయి బాహ్య ప్రపంచ మందు  లీలమయ్యెను. ఆ ముగ్ద వాహనచాలకుని సమక్షమమునిట్లు జేసిన తన నాథుని కప్రియమగు చున్నదని తానునూ మరొక గవాక్షమునాశ్రయించెను. చిరుగాలి తాకిడికి పైకెగురు ముంగుర్లను సవరించుకొనుచూ మింటినేగుచున్న కొక్కరాయి గుంపులను జూచుచుండెను.  

వారి మౌనమును గమనించిన షిరోమి వాహనము పాటలు మీటనొత్తబోవుచుండగా వలదనివారింనాచార్యుడు “అవివాహితులసంఖ్యాకులెదురు జూచు మాసము మాఘమాసం   తెలుగు నాట వివాహాల సందడి ప్రారంభమైంది.  ఈ నాలుగు రోజులూ వేలాది ముహూర్తాలు!

పెళ్లిల సందడి నాకునూ కలిసి వచ్చును యని శిరోమి శృతి కలిపెను. అది యెట్లని మనమున్నది తమిళనాట కదా యని కన్నె అచ్చెరువొందెను .  

తమిళనాట తెలుగువారుండరా వారు తెలుగు సంప్రదాయములనే పాటించెదరు. వివిధ ప్రాంతములనుండి ఆ వివాహములకు వచ్చు వారందరూ కాకున్నకూ, కొద్దిమంది పుణ్యక్షేత్రములు దర్శింపక మానరు. యని షిరోమి తెలుపగా. 

భళా! షిరోమి భళా! బహు బుద్ధిశాలివి నీవు , సింహళీయునివలె నున్నావు యని ఆచార్యుడనగా షిరోమి అవునని తల పంకించెను. “ఇచ్చట సింహళీయులున్నారా?" యని అనిన  అంగయారుకన్నెను జూచి " ఇదెక్కడి చోద్యము తమిళనాట నివసించుచు ఇక్కడ సింహళీయులున్నటు గ్రహించలేదా?" యని షిరోమి అడుగగా, వరదుడు నవ్వుచూ"  ఆంధ్రదేశము పోయిన ఇంతకంటే చోద్యములెన్నియో చూడగలవు , అచ్చట జనులు కూపస్థమండూకములవలె ,కనులున్న కొబోదులవలె దేహధ్యాస తప్ప దేశధ్యాస లేకలమటించుచుందురు, ఆదియట్లుండనిమ్ము నీ వృత్తాంతమును దెలపుమ"నెను.  

భారతదేశంలో రెండు లక్షల మంది సింహళీయులు గలరు. త్రిచిరాపల్లిలోని తువకుడి, నీలంకరై, చెన్నైలోని వలసరవక్కం, కన్నియకుమారిలోని నాగర్‌కోయిల్, కోయంబత్తూరులోని వల్పరైలో శ్రీలంక తమిళ కుటుంబాలు నివాస మేర్పరుచుకొన్నవి. ఐదు వందల సింహళ కుటుంబములు చెన్నపట్నమును తమ గృహముగా జేసుకొని చిరకాలంగా ఇచ్చట బ్రతుకుచున్నవి. వారందరూ శ్రీలంక డెప్యూటీ హై కమీషనర్ గారి కార్యాలయము పనిచేయువారు, సమాచార సాంకేతికశాస్త్ర నిపుణులు. వీరు టైడల్ పార్క్ నందు పనిచేయుచుందురు.  కొద్దిమంది మంది విద్యార్థులు పైచదువులనభ్యసించు వారు కూడా కలరు.

ఇద్దరు తమిళ మత్సకారులను శ్రీలంక నేవి హతమార్చుట వలన నిన్న చెన్నపట్నములో హింసాకాండ జరిగినది. అది పురాతన మహాబోధిసమాజమువారి కెన్నెత్ హౌస్ పై దాడికి కారణం భూతమైనది.  చెన్నపట్టణ నడిబొడ్డునున్న ఎగ్మోర్ నందుగల  కెన్నెత్ హౌస్ 1891 నందు స్థాపింపబడిన ప్రాచీన బుద్ధా సమాజము పైదాడిజరుగుట మిక్కిలి కలకలమును రేపుచున్నది.  

మా నాన్నగారు హై కమీషనర్ గారి కార్యాలయము పనిచేయుచుండెడివారు. వారి మరణానంతరము మేము మా దేశము పోదలచిననూ అన్నగారికి,   సాంకేతిక నిపుణులగుటచే మరియు టైడల్ పార్క్ నందు ఉద్యోగము లభించుటచే, ఎగ్మోర్ నుండి టైడల్ పార్కులకి మకాము మార్చిమేమిచ్చేటనే నివసించుచున్నాము. 

నేను ఐదు సంవత్సరములనుండి ఇచ్చటనే సింహళయాత్రీకులకు మార్గదర్శకుని గా యున్నాను.  యాత్రీకుల సౌకర్యార్ధము నావాహనమునందే  వారిని స్వయముగా తీసుకుపోయి నగరములోపల వెలుపల నున్న పుణ్యక్షేత్రములు చూపుచుందును. యని షిరోమి చెప్పెను .

హింస చెలరేగునని  భయపడుచున్నావా యని వరదాచారి షిరోమిని  అడుగగా  

షిరోమి "తమిళులు మంచివారు, ఇంకనూ హింస ప్రజ్వరిల్లునని భయములేదు కానీ హింసాప్రభావమున సందర్శకులు తప్పక తగ్గిపోవు అవకాశము కలదు.” అనెను

"సందర్శకులు తగ్గినచో నీకొచ్చిన ముప్పేమియునూలేదు నీవు వాహనము కూడా కలిగియున్నావు కదా !" అని అంగయార్ కన్నె పలుకగా షిరోమి నవ్వుచూ వెనుకకు తిరిగి నేను మార్గదర్శకునిగా (టూరిస్ట్ గైడ్) మాత్రమే పనిచేయుదును. అందరివలె వాహనమును కిరాయికి తిప్పువాడనుకాను అని జెప్పి తిరిగి ముందుకు చూచుచూ వాహనమును నడుపసాగెను.

“అబ్బో సింహళీయులు గట్టివారే” యని అంగయార్ కన్నె చమత్కరించగా, మీ తమిళులకంటే కాదనుచూ షిరోమికూడ చతురమైన ప్రత్యుత్తరము నిచ్చెను. నగరంలో నదులు కలుషితమైపోవుటచే నగరంలో నదీస్నానము దుర్లభముయింది. కేశవరం గ్రామంలో మూలం నుండి  పట్టాబిరామ్ ఆనికట్ వరకు, కూవం నది పరిశుభ్రంగా యుండుటచే వారిరువురు  మునక కై అచ్చటికి పోయి వచ్చినారు.  చెన్నపట్నమున ఉత్తరాన కోసస్థలైయార్, దక్షిణాన అడయార్ నది మరియు, పట్టణ మధ్య భాగాన కూమ్ నదులను దాటుతూ సాగిన ప్రయాణము మైలాపూర్ లో ఉన్న అత్యంత పవిత్రమైన పురాతన కపలీశ్వరాలయం వరకు సాగెను.   వాహనము కపలీశ్వరాలయం ముంగిట నిలిపి ...

“కపలీశ్వరాలయం ఏడవ శతాబ్దానికి చెందినది దీని ఎత్తైనగోపురం చూపరులను ఆశ్చర్య చకితులను జేయుచుండును.  మైలాపూర్ అనే పేరు పురాణం నుండి వచ్చినది తమిళంలో "మాయిల్" అంటే నెమలి యనర్ధము . క్రీ.పూ 3000లో, బ్రహ్మాండ పురాణమునందు  మైలాపూర్ను   మయూరపురి గా  పేర్కొనినారు.పార్వతిదేవి  యొక్క ఒక రూపమైన కార్పగంబల్, ఒక శాపం కారణంగా  నెమలిగా   మారి, ఆమె అసలు రూపు  పొందటకు ఇక్కడ తపస్సు చేసెను.   స్కందుడిచ్చట   రాక్షస  నాశనమొనరించుటకు పార్వతిదేవి   నుండి ఈటియను  బొందెను. ఈ ప్రదేశం కైలాష్‌కు సమానమని  మాయిలే కైలై  యని పిలుచుచుందురు ”షిరోమి చెప్పుచూ సాగుచుండ ఆ దంపతులా మార్గదర్శకు ననుసరించు చుండిరి. పుష్కరిణియందు స్నానమాచరించి కపాలీశ్వరుని దర్శించి వారు   చెట్ల వరుసలతో ఆలరారు వీధులమీదుగా ఫియాగో పుంమ్బుహార్ దిశగా ముందుకు సాగిరి. మహాబలిపురం , పుదుచ్చేరి , కడ్డలూరు, చిదంబరం   మీదుగా  సాగిన 260 కిలోమీటర్ల ప్రయాణం రాత్రికి  పూమ్పుహార్ చేరెను.

Saturday, August 29, 2020

Bharatavarsha 30

గుమ్మిడిపూండి గగన తలమున, మరకత వనమున మాఘ పౌర్ణిమ చలువఱేడు జిలిబిలి  వెలుగులు చిలుకు చుండెనుకలువ రేణి అమృత కిరణ  గాఢ పరిష్వంగమున  గంబూర  శోభిత  వనములుశృంగార సోయగ నగములు రమ్య రసానుభూతి నొందుచుండెను. యంత్ర రాణములు చొరబడని జనపదమున నెలవైన మరకత వనమున, పచ్చిక పడియల, ఘనమైన మడుగుల తోయరాశి లెల్లయు చంద్రికా  ఛాయల  తళతళ మెరియుచుండెను.


చంద్రలోకమువలె నున్న ఉపవనమున కుటీర గృహమువద్ద నిలిచి యా ముగ్ధ వధువు ప్రకృతిని నేత్రపర్వముగా పరికించి పరవశించెను. దట్టముగా దేవగన్నేరు వృక్షములు   నలు చెఱగుల మందార, గులివింద, మన్మథానంద వృక్షములు, అక్కడక్కడ కొల్లివిట్టులు మూలల పారిజాతములు రసమయ శృంగార భావములను రేపు చుండ శశివదన లాహిరి గొనెను.   మన్మథానంద వృక్షముపై  వాలిన పికము చక్కెర చంగమున రవములు పలుకుచుండ చక్కెర విలుకాడు  పుష్ప బాణములను సంధించుచున్నటు భ్రాంతి నొందెను. దూరముగా పచ్చికలో కొలువద్ద నున్న వరదా చార్యుడు కొలనులో మసలుచున్న మీనములను  తిలకించుటాపి తన ఎదుటనున్న విద్యుల్లతను చూచుచుండెను. సఖుడు తనను గమనించుట చూసి  వాలు కన్నుల వయ్యారి వాలుజడ నొకపరి విసిరి, కాంతులీను ధవళ వస్త్రములందు వరదాచారి క్రీగంట కాంచుచుండ పారిజాత పుష్పములను యెరుచూ శిల్ప సోయగ శుభాంగి మగని చెంగట రతీదేవి వలే సంచరించుచుండెను. శకునములు గాంచి డెందము పొంగారు చుండ లతలల్లిన లీలాగృహమున తోలి శోభన కార్యము నిర్విఘ్నమగునని నిశ్చయముగ దలిచెను.

కన్దర్ప శరమే తగిలెనో   సఖి ఇచ్చిన గుళిక యే పలికెనో కొత్తరాగమంకురించగా వరదాచార్యుడు మెల్లగా పిల్లివలె అడుగులు వేయుచూ యక్షిణి వలెనున్న కన్నెను సమీపించెను. ఇంకా కొలును వద్దనే యున్నాడనుకొని తలయెత్తి చూసిన రమణి పక్కనేవున్న తనసఖుని చూసిబంతి చామంతుల బుగ్గలు నిమురుచుండ అవాక్కయి తెల్లమొఖము వేయగా తెల్లని దేవగన్నేరు పుష్పములన్నియు పకపకా నవ్వు చున్నట్లు తోచెను.

అభిజ్ఞాన శాకుంతలమున శకుంతలను వర్ణించిన కాళిదాసు మనోహర వర్ణన అంగయారుకన్నె కతికినట్ల గుపించును.

అనాఘ్రాతం పుష్పం, కిసలయమలూనం కరరుహై  

రనావిద్ధం రత్నం మధునవమనాస్వాదితరసమ్ 

అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూపమనఘం 

న జానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః

శకుంతల రూపం యింకనూ వాసన చూడని అప్పుడే పూసిన పూవుమాయని , గోటితో గిల్లని క్రొత్త చిగురు. ఇంకనూ రంధ్రము వేయని తీర్చిన ముత్యము. ఇంకనూ తీపు చవి చూడని క్రొత్త పూదేనె. మనోహరమైన, పరిపూర్ణమైన పుణ్యాలకు ఫలము. అటువంటి శకుంతలననుభవించడానికి బ్రహ్మ యెవరికి రాసి పెట్టాడో నాకు తెలియకున్నదిఅని మధురమైన ఉపమానాలను శ్లోకంలో కూర్చాడు కాళిదాసు.

కొలనులో మసలుచున్న మీనములను తిలకించుట మీకిష్టముకదా?

నీకన్నులు చంచలమైన బేడిసలు కాదా!” యనుచు యా అనాఘ్రాతం పుష్పమును, యా ఘన జఘన విశాల కటివలయ విద్యుల్లతా విగ్రహ, భార కుచోద్వృత్త కుంభ నితంబ స్వర్ణ  భూషిత ధవళ వస్త్ర శోభిత సుందరి  చేతినందుకొని రజనీగంధ తేనె వాసనలూరించు లీలాగృహము ప్రవేశించెను.

పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె యను గానము గాలిలో అల వలె తేలుచులీలగా వినిపించుచుండెను.