Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, August 24, 2020

Bharatavarsha -27

శేషాచలం గారు ఉపాంత్ర శస్త్రచికిత్సానంతరం(appendectomy)మూడు రోజులాసుపత్రిలో ఉండవలసి యున్ననూ రెండురోజులు మాత్రమే యుండి  మూడవరోజు భార్యకారోగ్యము సరిగా లేదని జెప్పగా ఇంటికి  వచ్చి విషయము దెలుసుకొని కుప్పకూలినారు. దుఃఖమునంతటినీ దిగమింగుచూ అంతిమ సంస్కారాలను యధావిధిగా జరిపించినారు. భారతవర్ష   అంతిమయాత్ర నందు పాల్గొనగా  మాలిని మంజూషలు విదిషనోదార్చ ప్రయత్నించుచుండిరి. బసవడు సిద్దాంతిగారు కూడా వచ్చి విదిషను పరామర్శించిరి. దు:ఖభారాన్ని తగ్గింపబూని సిద్దాంతిగారు పురాణ ఇతిహాసాదులనుండి జీవితమింతేనని తెలుపు గాథలను, జీవితసత్యాలను బోధపరిచిరి అయిననూ ఆమె శాఖలువాఱు  శోఖప్రేషమున   తిండి తినక చినిగిన చేటవలె నగుపించుచుండెను. ఎవరైనా యున్నచో    పెల్లుబికి వచ్చు అశ్రు  ప్రవాహమును బిగబెట్టుకుని, నిలువుగుడ్లు బడి చేష్టలుడిగి చేటపెయ్యవలె  యుండి  ఏకాంతమున పెట్టునేడ్చుచుండెను. ఇదంతయు శేషాచలంగారిని కలిచివేయుచున్ననూ అతడు దిట్టగుండె గలవాడగుటచే నిగ్రహించుకొనుచూ విదిషనోదార్చుచుండెను. 

బైరెడ్డిపై భారతవర్ష పోలీసులకు పిర్యాదు జేసిననూ బైరెడ్డి వారికి చిక్కక తప్పించుకు తిరుగుచుండెను. భారతవర్ష పోలీసుపెద్దదికారులతో మాట్లాడిన జోరు చూసి నేరస్తుని అన్వేషణకు ఆదేశములు జారీ జేసినప్పటికీనూ బైరెడ్డి పరారీ లోనుండుటచే పోలీసులు మిన్నకుండిరి. మంజూష స్నేహితులు వారి తల్లిదండ్రులు బైర్రెడ్డి  విషయమై పోలీసులను సంప్రదించుచుండిరి. బైరెడ్డి అన్ననాగిరెడ్డి  నక్కజిత్తులున్నూ రాజకీయపలుకుబడి నుపయోగించి ఒక వారము క్రితమే బైరెడ్డి కర్ణాటక రాష్ట్రమందలి  హసను కుబోయి యుండెనని  సాక్ష్యమును జూపుచూ  బైరెడ్డి అసలీ రాష్ట్రములోని లేడని పోలీసులను అవ్యవస్థిత బరుచుటతో వ్యవహారము కకపికలగు నేమోయని మహిళా  బృందములు  దిగులుకొనుచుండ  భారతవర్ష రంగములోకి దిగి పోలీసు దుస్తులలో  స్థానికులను  విచారించి కూపీలాగుచుండగా మరీదు కనిపించెను “ ఇచ్చటేల యుంటివోయి? ఏదైనా పనిచేయుచున్నావా?"యని అడుగగా “పని చేయకున్నా నాకు గడుచుటెట్లు, సహకారరంగమున చేయుచున్నాను.” యని మరీదు జెప్పను. 

ఒక క్షణమాలోచించి నేరుగా అడుగుటకు నిర్ణయించుకొని “మరీదు నీ మంచి గుణము నాకు దెలియును అతివృష్టి వలె ఎంతకురిసిననూ తాత్కాలికమే నీవంటి మంచివానికి కష్టములు తాత్కాలికమే.యని ప్రారంభించి తదుపరి బైరెడ్డి ఛాయాచిత్రమును చూపి అతడు చేసిన ఘోరమును దెలిపి  "యితడు నీకు తెలియునా?" యని అడిగెను. మరీదు జరిగిన కథంతయూ, చలన చిత్రమును చూచుట, కోటిగాడిని కలుసుట అంతయూ చెప్పెను.   నాడు వారు చూచినది విడుదల చిత్రము పాత్రికేయులను సంప్రదించిన ఛాయాచిత్రములేమైననూ దొరకవచ్చని భావించి హర్ష పాత్రికేయుడు మారయ్యగారిని సంప్రదించగా మారయ్యగా రొక గంటాగి దూరవాణి యందు “నాలుగు ఛాయా చిత్రములున్న”వని తెలపగా వారిని కలిసి యా ఛాయాచిత్రములను నేత్రములు గుడ్లగూబలవలె విశాలమొనర్చి పరిశీలించి జూచెను. అందు బైరెడ్డి కానరాకుండెను.  సూర్యుడు పడమట క్రుంగుచుండ చీకటిలలుముచుండెను ,  నైరాశ్యమలుము  చుండ వర్షుడు కుంగుచూ ఇంటిముఖంపట్టెను.  

                                                                    ***

రాధామనోహరము నేడు కళావిహీనంగా తోచుచున్నది. యింటనెవ్వరూ లేక ఇల్లు వంటరిదైనది. మాలినిగారు, మంజూష, కేశవుడు కానరాక  మనసు బోరుమనుచుండగా బాల్య స్నేహితురాలు విదిష విషణ్ణ వదనము స్మృతి పథమున మెదులుచుండ మానిపుక్కిటిపులుఁగు హృదయమును గొట్టుచున్నట్లుండగా  వీణా వాదనము జేయుచూ  బాధాతప్త డెందమునకు సంగీత లేపనమును పసమనమును కలిగించుచూ అట్లే  వీణపై పడి నిద్రించెను. కొంతసేపటికి ఎవ్వరో తట్టిలేపుచున్నట్లనిపించి కనులు తెరచి చూచెను అన్నము తినమని తల్లిగారు చెప్పుచున్నట్లనిపించి లేచి చుటూ చూసిననూ ఎవ్వరూ కానరాకుండిరి. బైటకు పోయి చూడగా తల్లి చెల్లి వచ్చుచు కనిపించిరి  " కేశవుడేడి ఎచ్చటకు బోయినాడని వారినడిగెను.  కేశవుడి అక్క ( చారుమతిగారి కూతురు ) మంచము  పట్టెనని కబురు తెలిసెనని కేశవుని బస్సెక్కించి వచ్చుచున్నామని చెప్పిరి. హతవిధీ కష్టములన్నియూ కట్టకట్టుకొనిరావలెనా.అని భారతవర్ష అనగా "ఇదంతయూ  ఏమి అరిష్టమునకు దారితీయునో?" యని మాలినిగారు వాపోయినారు. భోజనములు చేయుచూ  "మనముఁబోయినచో పోలీసులు హడావిడి చేయుచున్నారు తప్ప బైరెడ్డి వ్యవహారము  ఎచ్చట వేసిన గొంగళి అచ్చటనే యున్న"దని మంజూష అనెను. బలమైన సాక్ష్యమున్నాకానీ  పోలీసులేమియునూ చేయజాలరు.అని మాలినిగారు అనుచుండగా "  సాక్ష్యములను తారుమారు చేయగల సమర్థులు వారు సాక్ష్యమున్న ప్రయోజనమేమి యని మంజూష అనెను. వారట్లు మాట్లాడుకొనుచుండగా వర్షుడి మనసున ఒక ఆలోచన తళుక్కు మనెను. అతడు ముఖపుస్తకమున విడుదల చిత్ర వర్ధమాన కథానాయకుని అభిమాన సంఘములవారి కొరకు దేవులాడుచుండెను. నిశరాత్రి....ఒక అభిమాని తన మిత్రులతో గూడి ఆ సబ్బవరం చిత్రమందిరము ముంగిట గ్రహించిన ఛాయాచిత్రమును కనుగొనెను అందు బైరెడ్డి సుస్పష్టముగా కనిపించుచుండ మేఘమండల మదురునట్టు ఆత్మధన్యనాదము జేసి పిమ్మట నాలుక కరుచుకొనెను. 

                                                                  ***

అర్ధరాతి  విదిషకు చిత్తవికారముచే తనతల్లి చావుకు కారకుడైన  బైరెడ్డి , వాడి అన్న నాగిరెడ్డి , ఎం ఎల్ ఏ సింహాచలం దివిటీలు చేతబూని భూతప్రేత పిశాచములవలె తనను చుట్టుముట్టి వలయాకృతిన రాక్షసతాండవము చేయు  దృశ్యము చాక్షుషప్రత్యక్షమైనది. ఆమె అంతర్జ్వలన కీలలందు ఎంతకాలిననూ గుండెబాధ  గండశిలవలె కరుగకుండెను. ఆమె అట్లే అధోలోకము నందలసి సొలసి నిద్రించెను.

                                                                  ***

మిషేల్కు నిజము దెలిసిపోయినది.   పాఠశాల భూవివాదమంతయూ    బూటకమని ఆదంతయూ  ఎం ఎల్ ఏ తనని వశపరుచుకొనుటకు పన్నిన జాలమని తెలిసి మొఖం ఎర్రబార  తనకు జేసినా మోసముతోపాటు తనఇంటనే తనతో కామక్రీడలాడుచున్న  కామ పిశాచమును తలుచుకొని హృదయము రగులుచుండ తల్లితండ్రులకు కలిగిన క్షోభ అవమానమునకు తుదిపలుకు చెప్పుటకు నిర్ణయించుకొని  ఎం ఎల్ ఏ రాకకోరకు ఎదురు చూచుచూ " ప్రతిరోజూ నేను పులి నువ్వు  జింక " యనుచు ఇచ్చము వచ్చిన రీతిన   నన్ను అనుభవించెడివాడవు కానీ నేడు నేను పులి నీవు జింక " యని గట్టిగా జెప్పుకుని. “ఆ మృగము వచ్చిన మేడపైకి పంపవలెనని  తల్లితో జెప్పి    మేడమీద గదిలో ఎదురుచూచు చుండెను. " పులి వచ్చింది , జింక ఎక్కడ ?" యనుచు లోపలికాడుగిడుచున్న కామరోగిని మానవ మృగమును ఛాతిలోనొక్క పోటుతో అంతమొందించెను. పూర్తిగా శ్వాస నిలుచువరకూ వేచియుండి శవమును ఠాణాకు ఈడ్చుకొనిపోయి నేరమునఁగీకరించి  మిషేల్  లొంగిపోయెను.   

                                                                   ***

మరునాడు విదిష ఆలస్యముగా నిద్ర లేచెను. ఇదంతయూ కలా? నిజమయిన ఎంత బాగుండునని  అనుకొనుచుండగా "రెండున్నర జాములకు(2.pm) పడుకొంటివి కాఫి త్రాగి మరల పడుకొన్న మనసు కుదుటపడును, అనుచు తండ్రి ఆమెకు  కాఫీ  ఇచ్చి   సింహాచలం  మరణవార్త  తెలిపెను. రాత్రి స్వప్నము నేటి సత్యమని గ్రక్కున నమ్మజాలకుండెను. సింహాచలం హత్యోదంతం దూరదర్శన పేటికయందు  గాంచువరకూ  స్వప్న, సత్య శంకల నడుమంబడి విదిష డెందము దండసిల్లిననూ(stuck) తత్తరపాటును వీడినామె హృదయము మెల్లన ఉల్లసిల్లె.  అంతలో ఆమెకు ఏదో తెలియని స్పృహ కలిగి  పాదముల క్రింద  భూకంప పానుభూతినిబొందెను. అవ్యక్త భావములు ముప్పిరిగొనుచుండ  విదిష తల్లి చిత్రపటము కడ  మోకరిల్లెను.                              


4 comments:

  1. అహల్య గారి మరణంతో కథ విషాదకరమైన మలుపు తీసుకున్ననూ ఎమ్మెల్యే మరణం కొంత ఊరటను కలిగిస్తుంది.బైరెడ్డికి కూడా తప్పకుండ శిక్ష పడవలెను.భారత వర్ష ప్రయత్నం ఫలించి విదిషకు న్యాయం జరుగవలెను.

    ReplyDelete
    Replies
    1. అనూహ్య మలుపులు హఠాన్మె లిక లిచట జూడ కావలె వివేకముల్
      విభ్రాంతి, దిగ్భ్రాంతి కల్గించ హెచ్చు అఘాత ,విఘాత మమేకముల్
      ఉన్మత్త పాత్రల ఉదార, రుధిర కృత్యములు కలిగించు భయోత్పాతముల్.

      Delete
  2. గృహ దహనము, అహల్య గారి మరణము, మరీదు సహాయము కేశవుడి పయనము, కీచకవధ ,సాక్ష్య సేకరణ, విదేహి అవతరణ కావ్య నిర్ఝరి తలపించును శేషుని మెలికలు మీకు ప్రత్యేక ధన్యవాదములు.

    ReplyDelete
  3. సింహాచలం కథ ముగిసెను, బైరెడ్డి, నాగిరెడ్డికి కూడా శిక్ష పడవలెను

    ReplyDelete