ముంబై మహానగరంలో జెట్ఏర్వేస్ విమానం దిగి అంచగమనమున సాగుచుండెను. విలాసహాస విలసిత తార అరుణతార మహారాణిఠీవి కన్నవారికి ఆమె నర్తకి యనిన నమ్మబుద్దికాదు. యాబది వర్షములు సమీపించుచున్ననూ బుగ్గలలో తగ్గని ఎర్రని నిగారింపు, దేహంలో తగ్గని పసిమి ఛాయ తో వెలుగుచున్న అరుణతార కామ దృష్టి తో చూచువారికి మోహిని వలే విలాసిని వలే కనిపించును. కళాదృష్టి తో చూచినా వారికి ముద్దుమోము, నాట్యధాటికి చిక్కిన నడుము, కళ్ళలో చురుకుతనం , ఆహార్యం లో అహంకారం తో, జక్కన చెక్కిన తీరైన శిల్పములా చూచువారికి తరలి వెళుతున్న తెలుగువారి తరతరాల వారసత్వ సంపదలా కనిపించును.
సూర్యకాంతి లో మిలమిల మెరియుచున్న అరుణతారను చూచినా ఓ వృద్ధ ప్రయాణికుడు
మరొక ప్రయాణికుడితో "ఎవరోయీ ఈ చెకుముకి? లకుముకి చందమున నా డెందమును పరిగ్రహించెను
"అనెను. అందుకు అతడు "ఆమె ప్రక్కనే నడుచుచున్న మొండికట్టె ఎవడోయి, నల్లని తుమ్మమొద్దు
వలెనున్నాడు, ఆమె చేతిని చూరగొనుటాయే గాక చూర్ణము చేయుచున్నాడు." అనెను. అదిచూచి మొదటి ప్రయాణీకుని
ముఖము వివర్ణమయ్యెను. విమానాశ్రయ నిష్క్రమణ
ద్వారం వద్ద నుంచి బైటపడిన అరుణతార తనకై ఎదురు చూచుచున్న రధమునధిరోహించగా ప్రక్కనున్న
పురుషుడు “ఓబరాయ్” అనెను. రధము దూసుకు పోయెను.
ఒబెరాయ్ నందు రధము దిగగానే ఆమెను
సాదరంగా తురయ టెలిఫిలిమ్స్ వారు సమావేశ మందిరమునకు కొనిపోయిరి. విద్యుత్దీపకాంతిలో
దగత్ దగాయమానమై ప్రకాశించుచున్నసమావేశ మందిరమున విద్యుత్ దీపములతో పోటీపడుచూ ఉన్నత
రంగస్థలం పై కూర్చునిఉన్న తారలందరూ అరుణతార ప్రవేశముతో వెలవెలపోయిరి. వారందరి మధ్యలో ఆమె తారల మధ్య చంద్రునివలె కనిపించెను.
ద్రోణదళముల వంటి ఆమె కనులయందు విద్యాస్పర్థలో గౌడడిండిమ భట్టును ఓడించి, అతని కంచు
ఢక్కను పగుల గొట్టించిన శ్రీనాధుని విజయ గర్వము అనేక మేటి నర్తకీమణుల శృంగార నాట్య
భంగిమల భంగపరిచి వారి స్థానములను కొల్లగొట్టిన
ఆమె ముఖమునందు తొణికిసలాడ కాతులీనుచున్నఆమె ముఖమునే అందరూ చూచుచుండిరి.
మాయ అను పౌరాణిక నాటకము నూరు
భాగములు పూర్తి చేసుకున్న సందర్భముగా నాటక విజయోత్సవమును తురయ టెలిఫిలిమ్స్ జరుప నిశ్చయించి
ఏర్పాటుచేసిన సభకు ఆ నాటకమునందు ఆస్థాన నర్తకి గా ప్రముఖ పాత్ర పోషించిన అరుణతార గొప్ప
ఆకర్షణ అయ్యెను. ఆమెపై ప్రశంసల వర్షము కురిసెను. కొందరు ఆమె నటనను
పొగడగా మరికొందరు ఆమె నాట్యమును పొగిడిరి. కొద్దిమంది ఆమె అందమును పొగిడిరి. ఎవరో ఒక రసికాశిఖామణి, కేరళ నుండి
ఎంపికైన ఎగువసభ సభ్యుడు, శృంగారోత్సాహమున పుష్పగుచ్ఛమిచ్చునెపమున
తూలిపడి ఆమె కుచాగ్రములను స్పృశించెను.
ఇది
చూచి ఒక సభికుడు ఏమిసాహసము , ఏమి కొంటెతనము
యని వ్యాఖ్యానించెను అది విని మరొక సభికుడు అది సాహసము గాదు దౌష్ట్యము , కొంటెతనము గాదు క్రొవ్విదము. అయిననూ నేటి భారత దేశమున
వయసుమళ్ళిన రాజకీయవేత్తలు సిగ్గు ఎగ్గు మరిచి ఇటువంటి పనులు చేయుట సాధారణమాయెను అని
సరిపుచ్చుకొనెను. ఈ స్త్రీ లోలుడు మొన్ననే మూడవ భార్యను మట్టుబెట్టి ఇంకనూ పరస్త్రీల
చుట్టూ భ్రమరమువలె పరిభ్రమించుచున్నాడు అనెను. అందుకు పొరుగువారు నవ్వి స్త్రీ యనిన
తేనెపట్టే కదా , ఒక్క భ్రమరమేమి ఖర్మ అనేక భ్రమరములు తిరుగుచుండును. అందు నేనొక భ్రమరము
నవ్వవలెనని నా ఆకాంక్ష. ఆమెను పెట్టి ఒక చలన చిత్రము రూపొందించవలెనని యోచించుచున్నాను.
అనెను. ఇచ్చట కామాతురులు పెచ్చుగా యున్నారు యని ప్రక్కవాడు వెనుకవరుసకు మారిపోయెను
కొద్దిమంది ముఖ్యులు ప్రసంగిచిన
పిదప ముంబయి
విశ్వవిద్యాలయ పురాణ విభాగాధిపతి ముంబై విశ్వవిద్యాలయంలోని పురాణ విద్య కు మంచి ప్రజాదరణ
లభించెనని టెలివిజన్లలో పౌరాణిక మరియు చారిత్రక నాటకాలకు ఆదరణ పెరుగుటవల్ల
ముంబై విశ్వవిద్యాలయంలోని సంస్కృత మరియు పురాణ కోర్సులపై విద్యార్థుల ఆసక్తిని పెరిగెనని
సంస్కృత కోర్సుల ప్రవేశాలు గత రెండేళ్లలో గణనీయంగా పెరిగెనని. అదనంగా, ఈ సంవత్సరం సంస్కృతం
కోసం రెండు తరగతులు పూర్తి సామర్థ్యంతో నడపడం ఇది మొదటిసారి అని చెప్పుచూ” నేను చాలా
మంది విద్యార్థులను వ్యక్తిగతంగా తిరస్కరించాల్సి వచ్చెను, వచ్చే ఏడాది ప్రారంభంలో
రావాలని వారిని కోరారు. సంస్కృత కోర్సులు, తులనాత్మక పురాణ శాస్త్రము నందు (కంపారిటివ్
మిథాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు) ప్రవేశములు గత రెండేళ్ళలో
అతిపెద్ద పెరుగుదలను చూసింది. ఇంతటివిజయానికి కారణమైనదర్శకులు మరిన్ని చారిత్రిక, పౌరాణిక
నాటకాలను ఎంపిక చేసుకోవాలని కోరెను. ఆమె నటీ నటులను కొనియాడి, ముఖ్యంగా ఈ విజయంలో సింహభాగం
నర్తకీమణి అరుణతారదే అన్నారు. సమావేశమందిరము అంతా కరతాళ ధ్వనులతో నిండెను.
సమావేశము ముగిసెను.అందరు వెడలిపోయిన పిదప అరుణతార మెల్లగా సమావేశమందిరము నుంచి నిష్క్రమించి నడుచుచుండెను నేను ఒక విలాస మందిరమును నిలిపిపెట్టి
యుంచితిని, ఈ రాత్రి కి మనము నా తదుపరి చిత్రము గురించి చర్చించవలెను అని అరుణతార
ప్రక్కన ఉన్ననల్లని వ్యక్తి ఆమెను వేదించుచుండెను.
అరుణతార వద్దని వారించుచూ "నాయుడుగారు, మీరు నాకు అవకాశాలు ఇచ్చినారని కృతజ్ఞతతో మీకు మారాడలేకున్నాను. మీరు ఇంత
దూరము వచ్చి ఇక్కడ సమావేశములో పాల్గొనుట విడ్డురంగానున్నది. నిజము చెప్పవలెనన్న మీకు
ఈ పౌరాణిక నాటకమునకు ఏమీ సంబంధము లేదు. బుల్లితెర
కు మీకు బాదరాయణ సంబంధమైననూ కలదా? సంవత్సరముల క్రితమే నాకు అవకాశములు మృగ్యమైనవి, నేను రాజకీయ రంగములో
చేరి నిత్యమూ నిప్పులో నడుచుచుంటిని. వెలుగు
పార్టీలో మహిళాధ్యక్షురాలిగా నా మనుగడే ప్రస్నార్ధకమయ్యెను.
రేపు హైదరాబాదులో జరుగు పార్టీ సమావేశము నా భవిష్యత్తును నిర్ణయించును. అంతే గాక నా కూతురు రేపు హైద్రాబాదు చేరుకొనును. రాత్రికి నేనిచ్చట బసచేసిన అది నాకు మరణ శాసనమగును.నేను చలచిత్రములందు ఆశలు త్రుంచుకొంటిని. మీకు ఏమి కావలెనో నాకు తెలియును. కానీ అది జరగని పని అని అరుణ అనగా , నీ అందంచూసి మనసు పడి వచ్చితిని నన్ను నిరుత్సాహపరచకు, నేను చలన చిత్రము నిర్మించలేను కానీ నిన్నూరక రమ్మన్ననని కొంత డబ్బు తీసి నాయుడు ఆమె చేతిలో కుక్కుటకు ప్రయత్నించగా అది ఘర్షణకు దారితీసెను. విసిగిపోయిన నాయిడు ఆ డబ్బు అక్కడ విసిరేసి వెళ్లిపోయెను.
ఆ దృశ్యము చూడగానే ఇద్దరు పాత్రికేయులు నాయుడు వెంటపడిరి. అక్కడ పనిచేయు కుర్రవాడొక్కడు ఆ డబ్బును ఏరి నాయుడికి అందజేసెను. అరుణ తార అవమాన భారంతో మసకవెలుతురుతో నిండిన ఒక
ఉపహారగృహములోకి వెళ్లి ఒక బల్లవద్ద కూర్చొని పండ్ల రసము త్రాగుచుండగా ఆమె మనసు కుదుట పడసాగె ను. ఇంతలో ఆమె మీద ఒక చేయి వాలెను
, మసకవెలుతురులో అతడు వెంటనే కనిపించలేదు కానీ కొద్ది సమయములోనే అరుణతార అతడు ఎవరో గ్రహించెను.
నీవంటి ప్రజాదరణగల తారామణులుండవలసినది ఆకాశమున గానీ పంకిలమున గాదని ఆమె శ్రమను హెచ్చుజేసి మెచ్చుకొని మాట్లాడి ఆమె ఖేదము ను బాపెను.
నాపేరు శశి మా పార్టీ లోకి ఆహ్వానించుచున్నాను. మా పార్టీ జాతీయపార్టీ నీవు పని చేయుచున్న ప్రాంతీయపార్టీకన్నా వేయి రేట్లు మెరుగు. విధాన సభకు పోటీ చేసి నాయకురాలిగా వెలగవలసిన నీవుఒక కుటుంబపార్టీ లో మహిళాధ్యక్షురాలిగా పనిచేయుట మిక్కిలి శోచనీయము. అని శశి చెప్పుచుండగా నావద్ద ఏమిచూచి అట్లు చెప్పుచున్నారో నన్ను ములగచెట్టు ఎక్కించుచున్నారు అని అరుణ అనెను.
శశి: నీ సమస్య అచ్చటనేయున్నది. నీవు స్వయం ప్రకాశితవు. కానీ నీప్రతిభను నీవు గ్రహించ లేకున్నావు. హిమాయల మున కూర్చొండ వలసిన నీవు మూలగా చెట్టుకే భయపడుచున్నావు.
మీ వన్నియూ ఒత్తి పొగడ్తమాటలు అని అరుణతార ఏమీ అర్థం కాని దాని వలె తెల్ల ముఖం వేసెను మహారాష్ట్ర లో పోటీ చేసిన తప్పక నెగ్గగలరు. అనెను
శశి: మీ నాట్య భంగిమలు నా మనసులో ముద్రించి నాకు నిద్రించు భాగ్యమును లేకుండా చేసినారు. అట్లే మహారాష్ట్రలో హిమాలయ కీర్తిని ప్రజాహృదయ మునం దు సుస్థిర స్థానమును సంపాదించారు. ఎవ్వరేమన్ననూ మీరు పోటీచేసిన గెలు పొందుట ఖాయము. తక్షణము వెలుగు పార్టీ నాయుడిని ఒక్క తప్పు తన్ని మీ స్థానమును చేజిక్కించుకొని సమయామాసన్నమైనది.
అరుణ వదనము వికసించెను. అది చూచి అతడిలో కాంక్ష విప్పారెను. అతడు ఆమె కంఠమును , పెదవులను వక్షములను చూచి మత్తెక్కి మైమరచెను.
ఆమె అందమును తేనెపట్టు వంటి ఆమె అందమునకు ఒక వజ్రపుటుంగరమను రాయిని విసిరెను. నీ అందమునకు నా బహుమానము అనుచూ ఒక వజ్రపుటుంగ రమును బహూకరించెను. అరుణ వద్దు అనునంతలోనే అతడే ఆమె వేలికి దానిని తొడిగి "నాకు ఎల్లపుడు ఇక్కడ ఒక విలాసమందిరము నిలిపిపెట్టబడి ఉండు" ననిజెప్పి, లలామ లావణ్యమును పెనవేసుకొనెను. తార అతడిని ఒక్క వుదుటున నెట్టి ఉంగరమును అతడి మొఖంపై కొట్టెను. ఇట్టి స్పందననూహించని శశి " అయ్యో తేనెపట్టు చేజారేనే!"అని మెల్లగా అనుకొనెను. "తేనెపట్టుపై రాయి విసిరితివి తేనెటీగ కాటు రుచి చూడుమ."ని అరుణ అతడి చెంప పగుల గొట్టెను. శశి తత్తరపడి చుట్టూ చూసి ఎవ్వరూ చూచుటలేదని చల్లగా జారుకొనెను.
అరుణ నిస్సహాయముగా ఉపహారగృహములో ఒక బల్ల వద్ద కుర్చీలో కూలబడి ఒంటరి
పాటున తన అసహాయతకు చింతించుచుండెను. చుట్టూ మసక వెలుతురావరించి యున్నది. అల్పాహారశాలలో బల్లలన్ని యూ స్త్రీ పురుషులుతో నిండి యున్నవి. మసకవెలుతురులో వారి ముఖములు అస్పష్టముగా గోచరించుచున్నవి. ఈ హఠాత్పరి ణామము నుండి తేరుకొనకముందే వెనుకనుండి అరుణ భుజము నెవరో తాకినారు. అరుణ వెనుకకు తిరిగి చూసెను. ఆమె వెనుక ఒక స్త్రీ చిరునవ్వు తో నిలబడి యున్నది. ఆమె తనతో పాటు మాయ ధారావాహికలో తల్లి పాత్రలో నటించిన దేవయాని. ఆమె అరుణముందు కొచ్చి కుర్చీలో కూర్చొనెను.
“తల్లిపాత్రలో వయసు మళ్లిన దానివలె నటించిన నువ్వు వయసులో చిన్నదానివ”ని అరుణతార నవ్వెను. "వయసుకుతగ్గ పాత్రలు చలన చిత్రరంగమందు మాత్రమూ వచ్చుచున్నావా? పిన్న వయస్కులైన రాజేంద్రప్రసాద్, జగపతిబాబు వంటివారు తండ్రి పాత్రలు వేయుచుండగా బాలకృష్ణ, నాగార్జున వంటి వృద్దులింకనూ కుర్రపాత్రలలో నటించుచూకూతురు వయసున్న పిల్లలతో గెంతుచూ కథానాయకులుగా చలామణీ అగుచు న్నారు. అరుణ హ హ్హ హ్హ యని ఒక జీవం లేని నవ్వు నవ్వెను. ఆ విగతహాసము ను పసిగట్టి "ఎందుకో మీరు ఆందోళనలో ఉన్నట్టు స్పష్టమగు చున్నది. మీరు వచ్చినప్పటినుంచి నేను గమనించుచున్నాను."అనెను
"ఆ శశి చేసినదంతయూ చూచితివా?" అని అరుణ అడిగెను. నేనే కాదు ఇచ్చట ఉన్నవారందరూ చూచినారు. నీ అందము స్త్రీలనే వెర్రెత్తించును. ఇక పురుషుల సంగతి చెప్పపనేమున్నది. అయిననూ ఇందు నీవు చేసిన తప్పేమున్నద"ని దేవయాని అరుణను ధైర్య పఱచుచుండగా ఇక దాచాల్సిన పనిలేదనుకొని “ఇందాక శశి నా చేతిని తాకిన దృశ్యమును చూసినావు కదా కొంచెమాందోళన గాయున్నది.పాత్రికేయులా చిత్రము నచ్చువేసి చిలువలుపలువులుగా కల్పించి వ్రాయకుందురా!" అని అరుణ కలత చెందెను.
అది వినినంతనే దేవయాని ఘొల్లని నవ్వి “పాత్రికేయులకు ఇట్టి దృశ్యములు పరమాన్నములు. “అట్టి లైంగిక ఆరోపణలు. అక్రమ సంబంధముల వార్తలన్న ప్రజల పడిచత్తురు. మన దేశమున అత్యధికముగా చదువు వార్తలివియే!" అని నవ్వసాగెను
అరుణ తార ముఖములో భయము తొంగి చూచెను. అది చూచి దేవయాని మరల నవ్వెను. నీవు ఎంత పవిత్రముగా నున్ననూ పచ్చకామెర్లు వచ్చిన ప్రజలు నిన్ను అర్థము చేసుకొని పద్దతి మారదు. అడ్డదారులు ద్వారా పైకి వచ్చుటకు అవకాశములు కొరకు పక్క లెక్కుటకు సిద్ధముగా నున్న నావంటివారే ఎక్కువగా యున్న చిత్ర పరిశ్రమలో నే నీవునూ యున్నావు. తాటిచెట్టుక్రింద కూర్చుని పాలు తాగిననేమి ప్రయోజనము ?
" నేను కూడా శీలమునకు తిలోదకములిచ్చి అడ్డ దారిన అందలమెక్కవలెనా ?" అరుణకు దుఃఖము పొరలి వచ్చుచుండెను. దేవయాని ఆమెను బాధను అర్థము చేసుకొని "ఆధునికంగా కనిపించే నాట్యతారవి కానీ నీవు సత్తె కాలపు మనిషివి. నేడు సమాజము మారిపోయెను. ఇప్పుడు భారతదేశంలో 76% స్త్రీలు మరియు 61% పురుషులు అక్రమసంబంధములను అనైతిక చర్యగా భావించుట లేదని గణాంకములు జెప్పుచున్నవి.
అరుణ : ఏమీ గణాంకములు ఏమీ విపరీతము. అట్లు చెప్పువారిని చెప్పుతీసి కొట్టవలెను.
దేవయాని : నీవు సత్తె కాలపు మనిషివనుకొంటిని క నీవు నూతిలో కప్పవలెనున్నావే
అక్రమ సంబంధాలు నేరం కాదు. సహజీవనం నేరం కాదు.పెళ్ళికి ముందు శృంగారం నేరం కాదు.
స్వలింగ సంపర్కం నేరం కాదు. స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు. అవినీతి పరులు ఎన్నికలలో పోటీ చెయ్యడం నేరం కాదు. వ్యభిచార గృహానికి వెళ్లిన విటుణ్ని విచారించరాదు.వ్యభిచారము చేయువారిని ఖైదు చేయరాదు. స్త్రీ కి సంతానము కలిగినచో దానికి ఆమె భర్తే తండ్రి అగును.
జాతీయగీతం పాడునపుడు నిలబడకపోయినచో నేరము కాద"ని ఉన్నత న్యాయస్తామే జెప్పెను.
అవాక్కయిన అరుణ మెదడు స్థంభించెను ఆమె దేవయానికి నమస్కరించి విమానాశ్రయములకు బయలుదేరెను. "శశి చెడ్డ వాడైననూ అతడు చెప్పిన మాటలు నీకు వరములని మరువకుము. "అని చెప్పి దేవయాని చేయి ఊపెను.
***
న్యూ ఢిల్లీ ప్రపంచ పుస్తక మహాసభ : ప్రగతి మైదాన్ లో మహా సంద్రమును తలపించి పుస్తక ప్రదర్శన జరుగుచున్నది. అది ప్రధానమంత్రి యువ 2.0 కార్యక్రమము. భారత్ మండపం నందు 2,000 కంటే ఎక్కువ ప్రచురణకర్తలు, పంపిణీదారులు మరియు పుస్తక విక్రేతలు పాల్గొని, విస్తృత శ్రేణి పుస్తకాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించుచున్నారు.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శనలో భారతీయ భాషలను ప్రోత్సహించుటకు యువ రచయితలు రాసిన పుస్తకాలను ఆవిష్కరించుచున్నారు. మొదటగా 14వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్త శ్రీ మాధవ మలయాళ అనువాదంను ఆయన విడుదల చేసినారు.
తదుపరి సర్ చార్లెస్ ఎలియట్ రచించిన "హిందుత్వం మరియు బౌద్ధం - ఒక చారిత్రక స్కెచ్ తెలుగు అనువాదమును ఆయన విడుదల చేసిరి. అది భారతవర్ష చేసిన అనువాదం. అనంతరము రచయితకు 2 నిముషములు మాట్లాడుటకు అవకాశమిచ్చిరి.
భారతవర్ష మాట్లాడుతూ " సర్ చార్లెస్ ఎలియట్, రచన హిందూయిజం మరియు బౌద్ధమతంలో ఏది ప్రాచీనమైనది? ఏది ముందు పుట్టింది అని స్పష్టంగా ఉందని, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధమతం ప్రస్తుత వేద సంప్రదాయాల ( హిందుత్వము) నుండి ఎలా ఉద్భవించిందో రచయిత వివరించాడని తెలియజేసి బౌద్ధమతం తరువాత కాలంలో హిందుత్వమును గణనీయంగా విభేదించి విభిన్నంగా మారింది. ఇది బ్రాహ్మణిజానికి ఒక ప్రతిచర్యగా కనిపిస్తుంది. అంటే బుద్దుడి కంటే ముందే బ్రాహ్మణత్వము ఉన్నది. బౌద్ధమతం ఒక ప్రత్యేక మతంగా పునాది వేద కాలం తర్వాత అభివృద్ధి చెందింది. అని స్పష్టంగా తెలుస్తోందని, కొంతమంది విదేశీ మతాలను అవలంభించే రచయతలు బౌద్ధమే ముందనీ వితండవాదం చేస్తూ హిందు చరిత్రను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని. ఇది తండ్రి కంటే ముందు కొడుకు పుట్టేడన్నట్టుగా ఉందని భారతవర్ష తెలియజేసెను. తదుపరి వర్షుడు రచించిన సరస్వతీ శతకమును విడుదల గావించెను
అట్లు విద్యాశాఖామంత్రి 41 పుస్తకాలను ఆవిష్కరించెను . తరువాత అతడి సరస్వతీ శతకమును
మంత్రిగారు విడుదల గావించిరి. పిమ్మట ఆయన భారతీయ సంస్కృతి, వారసత్వం, చరిత్ర, గర్వించదగిన రాయబారులాగా రచయితలను మెచ్చుకొనిరి. విద్యాశాఖామంత్రి మన వారసత్వ సంపదను వెలుగులోకి తీసుకువచ్చి భావితరాలకు అందించాలని రచయితలందరి నీ కోరినారు.
ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ వినీత్ జోషి, పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, జాతీయ పుస్తక సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ మిలింద్ సుధాకర్ యుజిసి చైర్పర్సన్ ప్రొఫెసర్ ఎం. జగదీష్ కుమార్ మరియు జాతీయ పుస్తక సంస్థ దర్శకుడు శ్రీ యువరాజ్ హాజరయ్యారు.
ఆనంద నిలయములో ఆ కార్యక్రమమును ప్రత్యప్రసారములో చూసిన మాలిని మంజూషలు తమ భావములను సీతారత్నముగారి (అప్పుడు అచ్చట యుండుటతో) తో పంచుకొనుటకు ప్రయత్నమూ చేయగా "అమెరికాలో నున్న మా కృష్ణుడు నుండి పిలుపు వచ్చున"ని లేచి వెడలిపోయిరి. మాలిని మంజూషలు తమ భావములను రాధామనోహర పుష్పములతో పంచుకొనిరి.
మరునాడు వర్షుడు వాయుయానములో విశాఖ వచ్చెను. బసవడు ఆనందనిలయమునకు వర్షుని అభినందించెను పోయి . అచ్చట విదిషను అగస్త్యను చూచెను. అప్పుడే స్నానము చేసి తెల్లని పంచె ధరించి వచ్చిన వర్షుడు వారికి శుభోదయము చెప్పెను. వర్షుడు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసెను. అప్పుడే బైరెడ్డి ద్విచక్రికపై అచ్చటకు జేరి వర్షుని అభినందించెను
విదిష భారతవర్ష పుస్తకావిష్కరణ కార్యక్రమమును సజీవ తైలవర్ణ చిత్రముగా లిఖించి తెచ్చి వర్షున కిచ్చెను. బసవడు వర్షని సరస్వతీ శతకము అడిగి తీసుకొనెను. విదిషకు చిత్రకళలో నైపుణ్యము పెరిగెనని ఆమెను, బసవకి మాతృ భాషపై మమకారము పెరిగెనని అతడిని మాలిని గారు అభినందించిరి. బైరెడ్డి రాకకు కారణమేమో ఎవరికీ అంతుచిక్కకున్నది. అతడు ఒక సంచి నుంచి డబ్బు తీసి బసవడికి ఇచ్చి ఆసుపత్రిలో ఉన్నప్పుడు నీ ఆరోగ్యమును పట్టించుకొనక డబ్బులడిగితిని నన్ను క్షమింపుము ద్విచక్రిక నాది కాదు నేను మా అన్నకి సమాధానము చెప్పవలెను. అందుకే ... " నీవు సంపాదన పరుడివి కాదని నాకు తెలియునుఅందుకే నీగురించి మేమె తప్పుగా అనుకొనలేదు." అని బసవడు బదులు పలికి డబ్బు తీసుకొనుటకు నిరాకరించెను. బైర్రెడ్డి వర్షుని బతిమాలి బసవని డబ్బు తీసుకోనున్నట్లు జేసెను.వర్ష కళాశాలకు వెడలిపోయెను. బైరెడ్డి మారినందుకు మాలిని మంజుషలు సంతోషించిరి. మంజూష అందరికీ తేనీరు తెచ్చి ఇచ్చెను. బైరెడ్డి మంజూష కళ్ళలోకి చూసేను ఆమె కళ్ళలో దయ ప్రేమ కనిపించెను. బైర్రెడ్డి ఆమెను చూసి నవ్వెను.
***
భారతవర్ష లకుమ చదువు కళాశాలలో ప్రధానోపాద్యానుని కలుకుకొనుటకు బోయెను. అతడి పేరు పినాకపాణి భారవర్ష స్నేహితుడే. అతడు అచ్చట ప్రధానోపాద్యానునిగా పనిచేయుచున్నాడు. అతడు తన గది ద్వారం వద్ద తెల్ల పంచెలో నిలిచి యున్న ఆరడుగుల మనిషిని చూచి "మేఘములెచ్చటనూ కానరావే ! మేఘములు లేకనే వర్షమా!" అని హాస్యమాడెను.
కవితా మేఘములివిగో అని వర్షుడు చేతిలో యున్న పుస్తకములను చూపెను. "ఓహో! వచ్చినది కవితా వర్షమన్న మాట" అని పినాకపాణి అనగా "ఆ కవితా వర్షమే వచ్చెను. హర్షించినచో కురియును. లేనిచో కొండపైకి పోవున"ని బారతవర్ష చమత్కరించగా. "వరదలా వెల్లువై పొంగిననూ స్వాగతమే లోనికిరమ్ము" అని కుర్చీచూపి కూర్చొనమనెను.
నేడు వసంత పంచమి. మేము సరస్వతీ పూజ ఘనముగా జరుపుకొందుము. నీవు రాసిన సరస్వతీ శతకమును విద్యార్థులకు పరిచయము చేసి ఆలపించమని నిన్ను ఇచ్చటికి ఆహ్వానించి తిని అని చెప్పెను

My god. I had a lump in my throat when I read this
ReplyDeleteI got a great feeling after reading your comments, hope you are also enjoying the language apart from the story. Is my decision of using old Telugu for this novel correct?
ReplyDeleteDear sir it is very tough to write in perfect telugu without using English words. I can understand your efforts. But people addicted to Tinglish(Telugu+English)Very few people can understand this.
DeleteThe language which is used in bharatavarsha remembering my old days of school
ReplyDeleteనాటి సబా సబికులు, ప్రజలు అరుణతార అందమును, ఆదరించినారో లేదో తెలియదు గాని మీ రాతాలలో ఆమెను నేను స్పస్టముగా చూడగలిగాను. మీ వంటి రచయుతలు ఈ రోజులలో కూడా ఉండబట్టే తెలుగు తల్లి బ్రతికి ఉండనే నమ్మకం వస్తుంది. ధన్యోస్మి గురు గారు
ReplyDelete