Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, March 6, 2022

భారతవర్ష వెనుక కృషి

 కాలం వెంట కలంతో  ప్రాణాలు చాలొచ్చే ప్రయాణం. 

నా పగలు సెగలు కక్కితే నా రాత్రులు రెక్కలొచ్చి ఎగిరిపోయాయి 

2020 జులై 9 వ తారీకున భారతవర్ష మొదలు పెట్టినదగ్గరనుండి కాలం వెంట కలంపట్టుకుని పరిగెడుతూ కవితా జాలంలో చిక్కి ఉక్కిరి బిక్కిరవుతున్ననాకు చుక్కలు లెక్క పెడుతున్నట్టు పని ఎంతకీ తరగదు.  సంవత్సరం పాటు  ప్రతి రాత్రి మూడు గంటలు మురికి నిద్ర పోయినా ఆరోగ్యం  భద్రంగా ఉందంటే ఆశ్చర్యమే. అంతకంటే ఆశ్చర్యం 2021 ఫిబ్రవరి లో ఎనిమిది నెలల్లో రచన పూర్తవ్వడం.    భారతవర్ష రాసేసి  అయిపోయిందనుకున్నా, ముప్పైసార్లు తప్పులు దిద్దిన తరువాత తెలిసింది తెలుగు టైప్ చేయడానికి  గూగుల్  వాడడం  ఎంత తప్పో.  

ముద్రణ

1200 పేజీలని 1200 సార్లు స్క్రోల్ చేస్తూ  తప్పులు దిద్దుతూ వర్డ్ లో సద్దుతూ రాత్రి పగలు గడిచి పోయేవి.  భారతవర్ష రచన పూర్తయినా అది ముద్రించే వరకూ నిద్రించలేదు. మూడు చెరువుల నీళ్లు తాగితే గానీ  ముద్రణ పూర్తికాలేదు. 

ముందుమాట 

ముద్రణ పూర్తయిన తరువాత అందమైన ముందుమాట పొందడానికి అందంట, ఇందంట తిరిగి వాళ్ళని  వీళ్ళనీ కలిసినా చాలాకాలం కాలం  కలిసి రాలేదు. ఎవరిని కలవాలో  తెలిసిరాలేదు.  అయినా పట్టిన పట్టు విడవలేదు. బుద్ధప్రసాద్ గారో గారికిపాటివారో, అలాంటి వారెవరైనా ముందుమాట రాస్తే  బాగుటుందని ఆశించాను. నా కల నన్ను శాసించింది. వందలాదిమందికి వందనాలు చేస్తూ   పిచ్చిచొచ్చేలా  ప్రయత్నాలు సాగించాను.  1265 పేజీలు చదివే నాథుడేడీ? 

తెలుగు అనవసరంగా రాసావంటూ అయినా ఇప్పుడెవరు చదువుతున్నారు అంటూ పట్టపగలే చెవులో కీచురాళ్ళ రొద. నా రాత్రులు ఆవిరైపోయాక,  నా రక్తం ఆవిరైపోతోంది ఇలాటి మాటలతో.  చీకటి అలుముకున్న మార్గంలో ప్రాణాలు చాలొచ్చే ప్రయాణం. ఒళ్లు మరిచిపోయే ప్రయాణం. తుళ్ళుతూ కాస్సేపు తూలుతూ కాస్సేపు నిరాశా సౌధంలో ఆశాలలూయల లూగాను. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టు చివరికి చీకట్లు చీల్చుకుని వెలుగు కిరణాలు ప్రసరించాయి. 2021 Oct 7న యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ఆచార్య కృష్ణారావు గారిని యూనివర్సిటీలో కలిసి భారతవర్ష ఇచ్చి ముందుమాట ఇవ్వవలసిందిగా వేడేను.  నవల స్వీకరించి పూర్తిగా చదివి నవంబర్ 7 వ తారీకున మూడు పేజీల ముందుమాట  స్వహస్తాలతో వ్రాసి ఇచ్చారు. ఇది మొదటి అద్భుతం.  2021 Oct 27న డాక్టరు లక్ష్మిపార్వతిగారు విజ్ఞానవేదిక సమావేశాల్లో పాల్గొడానికి విజయవాడ వచ్చారు. ఆ సభలో కలిసి ఆవిడకు భారతవర్ష ఇచ్చాను. ఆవిడ కూడా ముందు మాట ఇచ్చారు.   ఇది రెండవ అద్భుతం. నా బాల్య స్నేహితుడు ఎవ్వడూ కూడా నాలుగు పేజీల ఇతివృత్తం కూడా చదవడానికి ముందుకు రాలేదు. నాలుగు లైన్ల ముందుమాట వ్రాయడానికి కూడా కుదరదని చెప్పేసారు.   

భారతవర్ష గ్రంధం సిద్ధం. ముందుమాట లేనిదే  అంత  పెద్ద గ్రంధానికి అందం ఏముంటుంది?  గురువుగారు గంధం పూసిన తరువాత అందానికి లోటేముంటుంది? భారతీయ ఆత్మకి ప్రతీక భారతవర్ష అని  ఆచార్యులు భారతవర్షకి కిరీటమే పెట్టారు. గ్రంధంలో అందం అందులో సాహిత్యంలో  సాహిత్యలో కలిసి ఉన్న సంగీతం లో ఉంది. భారతవర్షలో అనేక సంస్కృత  కీర్తనలు, గీతాలు  ఉన్నాయి వాటినేంచేయాలి? వాటికి ట్యూన్ కట్టి, వాటిని సాధన చేసి యూట్యూబ్లోకి  ఎక్కించాను.  ఇంకా పాడేవాళ్లు కావాలి.  వెనక సంగీతం కావాలి 


సంగీతం     

నా సంగీతం సమకూర్చడం కోసం నేను పడ్డ శ్రమ రాస్తే భారతవర్షను పోలిన  మరో గ్రంధం అవుతుంది. మూడునెలల పాటు వందల ఫోన్ కాల్స్  సింగర్స్ కోసం.  కాల్ చేస్తే  అలాగే కొంచెం బిజీగా ఉన్నాం వారంరోజుల తరువాత  చేయమని అనేవారు. మళ్లీ  చేస్తే మరి తీసేవారు కాదు.  చిట్టచివరకు  సింగర్స్ ని కలసి పాటల స్ట్రిప్ట్ చూపిస్తే  మొదట హార్మొనీతో మ్యూజిక్ డైరక్టర్ ట్యూన్ కడితే తప్ప పాడం  అన్నారు. లేదు నేను ట్యూన్ కట్టి పాడి ఉన్నాయంటే . ఆ పాటలు విని ట్యూన్ మార్చి శాస్తీయ సంగీతాన్ని మోడర్న్ సినీగీతాల్లా పాడేవారు కొందరు. ఉచ్చారణ దోషాలతో వింటే భయం వేసేలా పాడేవారు కొందరు తగిలేరు. మళ్ళీ  ట్యూన్ కట్టించమని..   ట్యూన్ మార్చేస్తే పాట  విలువ పోతుందని తెలిసి కూడా తప్పని సరి పరిస్థితులలో  అనేక రికార్డింగ్ స్టూడియో ల ఓనర్స్ ని కలిసి నా  వాళ్ళు డబ్బులకోసం మాట్లాడేరు తప్ప సంగీతం గురించి మాట్లాడలేదు. బేక్గ్రౌండ్ మ్యూజిక్ కి    పాట  పది వేలు చొప్పున్న ఒప్పుకుంటే  చేస్తామన్నారు లేదా మొత్తంగా  40 వేలు అన్నారు.   హైద్రాబాద్ కి చెందిన ఒక గాయకురాలు పాటలు పాడడానికి 50 వేలు అడిగింది.  హై ద్రాబాద్ లో తారక్ స్టూడియో తారక్ గారు  ఈ పాటలకి లక్ష రూపాయలు అడిగారు. ఆయనది తప్పేం లేదు పాటలు రేట్లు అలా ఉన్నాయి.  నాబుర్ర తిరిగి పోయి నేను కాళ్లరిగేలా  తిరిగి తిరిగి  ఒక పెద్ద సంగీత కోవిదుణ్ణి కలిసాను. ఆయన నేను కట్టిన ట్యూన్స్ ఏంతో బాగున్నాయని చెప్పిన మీదట  విజయవాడ గాయకుల వెంట పడ్డాను.  ఒక మధ్యవర్తికి ఫోన్ చేస్తే అతడు ఒక గాయకురాలి  అన్నయ్యకి ఫోన్ చేస్తాడు ఆమె అన్నయ్యతోనే మాట్లాడుతుంది.  నాకు సమాచారం రావడానికి అంటే ఒక చిన్న విషయం తెలియడానికి వారం రోజులు పట్టేది.  ఇక్కడికి రమ్మని అక్కడికి రమ్మని రోడ్లమీఁద కుక్కలా తిప్పారు. ఇలా మొత్తం  రాస్తే రక్తకన్నీరు అవుతుంది.  తణుకు గాయకుడు తాడేపల్లి గాయకురాలు విజయవాడ ఎఫ్ ఎం స్టేషన్ గాయకురాలు, వీరి పేర్లు చెప్పక్కరలేదు కానీ ఒకే గాయకుడికి 50 సార్లు వందనాలు చేసాను.  మూడు నెలలు పాటు ప్రతి వారం రెండు సార్లు ఫోన్ చేసేవాడిని. అలాగే ఒక ప్రోగ్రాం ఉంది అదయిపోయాక చేద్దాం అనేవాడు. చిట్ట చిరవరకు చాలా..దారుణం....    ఆయన.  అనేక మందితో అనుభవాలు అయినా తరువాత  భీమవరంలో లక్ష్మి శ్రీవల్లి అనే ఒక స్వరరాణి అద్భుత గాత్ర సౌందర్యం, హృదయ సౌందర్యం  ఉన్న గాయకురాలు దొరికింది. భీమవరం రెండు సార్లు బండి మీద వెళ్ళాను. విష్ణురేడియోవారికి అందించిన సేవ గుర్తుంచుకొని  వారు నాకు  రికార్డింగ్ చేసుకోడానికి అవకాశం ఇచ్చారు. దాంతో రికార్డింగ్ భీమవరంలో పూర్తయ్యి గానాల కోసం చేసుకున్న గాయాలు మానిపోయాయి. ఇంతకీ ఆమె డబ్బుఇచ్చినా తీసుకోలేదు. ఇది మరో అద్భుతం కాదా!

భారతవర్ష  పబ్లిషింగ్    

నేను చేస్తే ఒక పుస్తకం ఖరీదు  2400. బల్క్ లో చేయిస్తే తగ్గుతుందని ఎన్నో పబ్లిషింగ్ హౌస్లను అడిగాను.  ఎవ్వరూ తక్కువ కాపీలు వేయమన్నారు. ఒక వెయ్యి కాపీలు వేయించుకోమని చెప్పేవారు. 10 లక్షలు బిల్లు చెప్పేవారు. ప్రయత్నం చేయగా చేయగా  ఒక రెండు వందలు పుస్తాకాలు వేయనుకోలేరా అని మాటలు వచ్చాయి ? చిట్టచివరకు  ఒక వంద పుస్తకాలు అయితే వేస్తామని ఒక చిన్న పబ్లిషర్ వచ్చారు. పెద్ద ఖర్చు ఏముండదండీ 2లక్షలు అంతే! అదిచ్చుకోలేరా? ఎందుకిచ్చుకోలేను ఫారిన్ లాంగ్వేజెస్ మీద బాగా సంపాదిస్తున్నాను. (అని వాళ్ళ ఉద్దేశం.) జర్మన్ బీ వన్  కోర్సు 50 వేలు ఉంటుంది. నేను 15 వేలకి చెప్తాను. వాళ్ళు నాకు పది వేలు చేతులో పెడతారు. నేను పావలా అడిగితె నాకు పది పైసలు చేతిలో పెడతారు.  (ఒక ఇండియన్ ఇంజినీర్ అమెరికాలో అమెరికన్ ఇంజనీర్ కంటే మూడురెట్లు ఎక్కువ పని చేసి తొమ్మిది రేట్లు తక్కువ జీతం పొందుతాడు. అని విప్రో  చైర్మన్  అజీమ్ ప్రేమజీ చెప్పారు.)

భారతవర్ష  పబ్లిసిటీ 

ఇలా పబ్లిష్ చేసే మార్గాలు అన్వేషిస్తూ. భారతవర్ష గ్రంధాన్ని ఎవరూ చదవకపోగా  నాలుగు పీజీలు ఇతివృత్తం కూడా చదవకపోతే రెండు పేజీల లో పాత్రల గొప్పతనాన్ని రాస్తూ ఉండేవాడిని, కథ గొప్పతనాన్ని , ఆధ్యాత్మికత , శృంగారము, హాస్యముఎలా ఉన్నాయి అని రెండు పేజీల చిన్న ఆర్టికల్స్  రాస్తూ ఉండేవాడిని.  భారతవర్ష  మళ్లీ మళ్ళీ  చదువుతూ  విశ్లేషిస్తూ అనేక పాత్రలమీద, భారతవర్ష లో  స్నేహ సంబంధాలు మీద,  అలంకారాలమీద వ్యాసాలూ వ్రాస్తూ ఒక విషయాన్ని కనుక్కున్నాను 

భారతవర్ష ప్రపంచంలో నే అతిపెద్ద తెలుగు కావ్యమని   ఇది ఒక అద్భుతం కాదా!

1265 పేజీలు విశ్వనాధుని వారి వేయిపడగల (999 పేజీలు )కంటే పెద్దది 

200 ఛందోబద్ధ పద్యాలు ఉన్నాయి. మొల్ల రామాయణంలో ఉన్న పద్యాల (138)కంటే ఎక్కువ. ఇది అద్భుతం కాదా!

2000 వేల  ఉపమానాలు ఉన్నాయి ప్రాచీన సంస్కృత కవుల కంటే ఎక్కువ ఇది అద్భుతం కాదా!

గిన్నిస్ బుక్కి దరకాస్తు చేసాను  అంగీకరించారు పరిశీలిస్తున్నట్టు ఉత్తరం ఇచ్చారు. ఇది అద్భుతం కాదా!

గిన్నిస్ బుక్ పరిశీలనలో భారతవర్ష 

 200 మంది జర్నలిస్టులని సంప్రదించాను ఈ వార్త ని ప్రచురించడానికి ఎవ్వరూ ముందుకురాలేదు. ఒక ఇరవై సార్లు  బాగాతెలిసిన జర్నలిస్ట్ మిత్రుడిని సంప్రదించగా ఆయన కూడా మౌనం వహించారు. ప్రయత్నాలు మానకుండా అలా చేస్తూనే ఉన్నాను. చివరకు గురువుగారు అని నన్ను సంబోధించే శ్రీధర్ ఆయాళ్వార్ అనే హైద్రాబాద్ న్యాయవాది  భారతవర్ష గ్రంధాన్ని అమెరికా తెలుగు సంఘంవారికి పంపారు.

అమెరికాలో భారతవర్ష విడుదల 

 2022 జనవరి 16న  కనుమ పండుగనాడు వారు  భారతవర్షను వారి పండుగ సంబరాల్లో  వెబినార్లో ఆవిష్కరిస్తామని చెప్పారు.  అమెరికాలో రిలీజ్ అవుతున్నాదని మళ్లీ  చాలామంది జర్నలిస్ట్ మిత్రులకి చెప్పాను. అనేక మంది విని ఊరుకున్నారు. కానీ సాక్షి జర్నలిస్ట్ నారాయణగారు తెనాలి నుంచి "గిన్నిస్ పరిశీలనలో భారతవర్ష" రేపు అమెరికాలో విడుదల కాబోతోందని వార్త ప్రచురించారు. ఆయన కోసం నేను ఏదైనా చేయాలని అనుకున్నా ఆయన నాకేమీ వద్దని తానే ఇంకా తెలుగుకి ఏదైనా చేయాలని అంటారు . 

విజయవాడలో భారతవర్ష విడుదల 

ఫిబ్రవరి ప్రేమికుల దినోత్సవంనాడు భారతవర్ష అనే ప్రేమ కావ్యం ఘంటసాల సంగీత కళశాలలో సాయింత్రం ఆరు గంటలకి తెలుగు అకాడమీ చైర్పర్సన్  డాక్టర్ లక్ష్మి పార్వతిగారి చేతిమీదుగా, ఆచార్య కృష్ణారావుగారి చేతులమీదుగా,  విడుదలయ్యింది.ఆంధ్రా ఆర్ట్స్  అకాడమీ అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు గారి, ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణంరాజుగారి ఆశీస్సులతో , కానోపి థియేటర్ వారి కేరళ సంప్రదాయ నృత్యాలతో, పాడుతా తీయగా కీర్తి జేత స్వరరాణి  శ్రీవల్లి గాత్రంతో,  కేంద్ర ప్రభుత్వ యువా  కర్నాటక సంగీత యువప్రతిభ  షణ్ముఖ  సంగీత నృత్య విభావరితో  భారతవర్ష పుస్తకావిషకరణ జరిగింది.  భారతవర్ష ప్రయాణం,  అద్భుతాలు కొనసాగుతూనే ఉన్నాయి. 


        

No comments:

Post a Comment