Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, July 11, 2020

Bharatavarsha 3

రెండులక్షల యాబదివేల జనాభాగల  ఎం వీ పీ కాలనీ ఆసియాలో అతిపెద్ద జనావాసము.  అందు  ఆనంద నిలయము  చెంతన బసవ నిలయము  అను  మధ్యతరగతి ఆవాసమొకటి కలదు.  దూరము నుండి సబ్బు పెట్టె వలె  దగ్గరనుండి రైలు పెట్టవలె నుండి ఆ మిద్దె ఇల్లు పై డాబా డాబుకొరకు మాత్రమే యని  చూచువారికి చక్కగా బోధపడును. ముఖమునకు రెండు కళ్ళు వలె ఆ ఇంటికి రెండు దీర్ఘ చతురస్త్ర పు  కిటికీలు మధ్యలో పొడవాటి ముక్కువలే ఆ రెండు కిటికీల మధ్య  ఒక ఎత్తైన ద్వారము కలవు  ఇంతోటి అందమునకు దిష్టి ఎక్కడ తగులునో యన్నట్టు  ఆ ఇంటివారు  ఆ గుమ్మమునకు ఒక బూడిది గుమ్మడి కాయ వేళ్ళాడదీసినారు   

ఆ ఇంటికి ప్రహరీ గోడ దానికి రెండు ఇనప తలుపులు అమర్చబడినవి  ద్వారము  పక్కనే మిద్దెపైకి సోపానములు కలవు. ఆ ఇంటినందు బిగ్గరగా సంవాదము జరుగుచుండెను.  పై నుంచి చూచి   ఆ ఇంటి గలవారు  ఎంతో పద్దతి గలవారిని అనుకొనువారికి  ఆ సంవాదము వినినతరువాత ఎంత పద్దతి గలవారో  వారో  అర్థమగును.  

"బైక్ కొనలేక పోయావు, థూ! కనీసం ఒక స్మార్ట్ ఫోన్ కూడా కొనలేకపోయావ్, మా కాలేజీకొచ్చి చూడు ప్రతీ ఎర్రిపప్పకి కూడా స్మార్ట్ ఫోన్ ఉంది, అందరూ బైక్ల మీద కాలేజీకి వస్తుంటే నేను మాత్రం మూడేళ్లనుంచి బస్సులలో తిరుగుతున్నాను.   చేతగానప్పుడు పిల్లల్ని  కనకూడదు." అన్నాడు బసవయ్య తండ్రితో. 

"ఏం  కూసావురా! నేను చేతకానోడినైతేనేనా, లక్షలు తెగలేసి  నిన్ను పెద్దకాలేజిలో ఇంజినీరింగ్లో జేర్చేను!  సోకుల మీదే నీఫోకస్ అందుకే నీకన్నిబేక్ లాగ్స్,  నువ్వు చదువు  మీద  కాన్సెన్ట్రేట్ చెయ్యి  బేక్ లాగ్స్ క్లియర్ చెయ్యి  అన్నాడు తండ్రి సర్రాజు. 



 బసవ తల్లి బుచ్చమ్మకి అది  తెలుగా ఆంగ్లమా తెలియకున్నది.   ఆమెకు అట్టి ఆంగ్లమస్సలు నచ్చదు. కొడుకు ఎదో చెప్పబోవుచుండగా   తల్లి బుచ్చమ్మ అతడిని ఆపి, బసవా మీనాన్న చేయుచున్నది  ఆర్ టీ  సి లో గుమస్తా పని. అది గుర్తుంచుకొనుము. ఇప్పటికే శక్తికి మించి పరిగెత్తుచున్నాము .  ఆ చిన్న దాన్ని  చూచైననూ  బుద్ధి తెచ్చు కొనుము , దానిని చూడుము  డబ్బుఖర్చుపెట్టి ఆ పెద్ద బడి (కార్పొరేట్ స్కూల్)లో వేసినందుకు ఎంత మంచి మార్కులు తెచ్చుకొనుచున్నదో !" అని బుచ్చమ్మగారు అనగా బసవడికి వొళ్ళు మండెను  "దీనమ్మ బేక్ లాగ్స్ , ఎప్పుడు బండి కొనమని  అడిగినా , సెల్ కొనమని అడిగినా నాన్న   బేక్ లాగ్స్ అంటాడు , నువ్వు  చెల్లిని చూబెట్టి  నాకు దొబ్బులు పెడతావు . మీరు నాకేమిచ్చారు, కని పడేసారు , ఆఖరికి పేరుకూడా బసవయ్య అట, చెప్పుకోడానికే సిగ్గేస్తోంది, అందుకే బన్నీ అని చెప్పుకుని తిరుగుతున్నాను, అన్నాడు బసవయ్య. 

తాతగారిపేరుని ఎందుకురా అలా అంటావు , ఆయన చాలా గొప్పవారు తెలుసా ? అంది బసవయ్య చెల్లి. "ఏం గొప్ప, మొత్తం డబ్బులంతా దాన ధర్మాలు చేసి చిప్ప చేతికిచ్చాడు." అన్నాడు బసవయ్య. అదే సమయమునకు బుచ్చెమ్మ  బసవయ్య స్నేహితుడు  అగస్త్య ను ద్వారము వద్ద చూచెను.  "చందన త్రాష్టుడితో వాదించక నువ్వు లోపలి పోయి చదువుకోమ్మా , అని కుమార్తెకు  జెప్పి   గుమ్మదగ్గర నిలబడి ఉన్న  అగస్త్య ను చూపి , నువ్వు కాస్సేపు బైటికి పో నీ స్నేహితుడు వచ్చాడు" అని కొడుకుని నెట్టెను. లిప్తపాటులో జరగరానిది  జరిగిపోయెను   బసవ తల్లి చెంప చెళ్లు  మనిపిం చెను.తల్లి కళ్ళల్లో నీరు తిరిగుచుండెను, గుమ్మం వద్ద నుండి వెనుదిరుగుతున్న అగస్త్య ను చూసి బసవయ్య తండ్రి "చూడయ్యా అగస్త్య, చూడు!  వీడీని కన్నందుకు నేను చేతకానోడినట!  చూసేవా తల్లిని కొట్టేడు, ఈ ఇంటికి శనిలా దాపురించాడు " అన్నాడు.

 

అగస్త్యకి ఏమి మాట్లాడ వలెనో  తెలియక మౌనంవహించెను.

నేను చస్తే మీకు నాశనివదిలిపోతుంది." అని చెప్పులు వేసుకుంటున్న కొడుకుని చూసిన తల్లి "వాడు నన్ను కొట్టడం ఏంటి ? నన్నెవరూ కొట్టలేదు లేనిపోని అబాండాలు వేయకండి."అనెనుకొడుకు అఘాయిత్యము చేసుకొనునో యని ఆ పిచ్చితల్లి ఆరాటం   "భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్ళకునాన్నా! అని గెడ్డంపుచ్చుకొనెను.

 "మళ్ళీ వస్తానండీఅని అగస్త్య వెను తిరిగెనుబుచ్చెమ్మగారు "ఆగు బాబు, లోపలికి రా, ఇప్పుడేమయ్యిందని, ఇల్లన్న తర్వాతత గొడవలు ఉండవా, మనుషులన్నతర్వాత మాటా మాట అనుకోరా? మధ్యాన్నాము భోజనం వేళ అవుతుండగా వచ్చావు నువ్వు కూడా భోజనం చేసి వెళ్ళవలెను."అనెను 

అదివిని అగస్త్యుడు  "భోజనమునకు వీలు పడదుభారతవర్ష ఇంటికి పోవుచున్నాను, అచ్చట అవధాన కార్యక్రమమున్నది భోజనముకూడా అక్కడే. నేను పృచ్చకుడిగా పోవుచున్నాను. బసవయ్య వచ్చునేమోయని ఇటువచ్చితిని."అనెను. అగస్త్య.  అగస్త్య కూడా బసవయ్య అన్నందుకు బసవయ్య నొచ్చుకుని “బన్నీయని పిలిచిన నీ సొమ్ములేమైనా పోవునా? అనెను. బసవయ్య అనునది చక్కటిపేరు అని అగస్త్యుడు సద్ది చెప్పుచుండగా   "నాకు గిట్టని మాటలేల ఆడెదవు ?" అనెను


 "బసవయ్య అను పేరునే ఆక్షేపింతువా? కావలిసిన నేను బసవా యని పిలుతును."  అని అగస్త్య అనగా "నీకు పుణ్యముండును అట్లు నన్నెప్పుడు పిలువప్రయత్నించ వలదు  పనివానిని పిలిచినట్లు మిక్కిలి వెగటుగా వుండున"ని బసవయ్య అనగా, నటులను ఇలవేలుపుగా కొలుచువానికి  వానికి బన్నీ, చెర్రీయను పేర్లు గాక ఇంకేమియు నచ్చును. అని అగస్త్య అనెను “నన్ను ఆక్షేపించిన సరిపుచ్చు కొందును గానీ , నా అభిమాన నటులను ఏమైనా అన్నచో యూరకొనను” అనెను.


ఇదేమి మా వాడి భాష ఇట్లు మారిపోయెను   అన్నట్టు చూచుచున్న  తలిదండ్రులతో బసవ ఇట్లనెను, “ఛీ ఛీ ఈ భారత వర్ష ప్రభావమున, అదే ఇన్ఫ్లుయెన్స్ వల్ల మా స్నేహితులు చాలామంది అచ్చతెలుగు మాట్లాడుచున్నారు, ఛీ అదే మాట్లాడు తున్నారు.” ఈవూర్లో అచ్చతెలుగు మాట్లాడే వెధవలంతా వాడి స్నేహితులు కానీ, స్నేహితుల స్నేహితులు కానీ తప్పక అగుదురు, అని  నాలిక కరుచుకుని అయ్యి ఉంటారు. అని తల్లిదండ్రులతో అని, అగస్త్యవైపు తిరిగి నువ్వెళ్ళరా బాబూ నేను ఇలాటి పోగ్రాంలకి దూరంగా ఉంటాను, మీతో తిరుగుతుంటే ఆ దరిద్రం అంతా నాకంటుకుంటున్నది. అనెను . 

బుచ్చెమ్మగారు వర్షుడింటికి  పోకున్ననూ  , భోజనం చేసి వెళ్లవలెనని  అని కొడుక్కి చెప్పి, అగస్త్యు నితో  "వాడికి ఆంగ్లమనిన   ప్రాణము  బాబూ, మీరంతా  తెలుగు మానేసి ఆంగ్లమున వాడు  మాట్లాడినచో మిమ్మలిని అంటుకొని తిరుగును,  తెలుగుదేనికి  పనికొచ్చునని ఇప్పుడంతా ఆంగ్లమే మాట్లాడు చున్నారు కదా!"   

"మీరునూ  ఆ మ్లేచ్ఛ భాషనే మెచ్చుచున్నారా ? యని   అగస్త్య  నవ్వుచూ నిష్క్రమించెను. బసవడు  "అమ్మా నాన్న  మీరు ఎన్ని చెప్పినా  నేను ఈరోజు ఇంట్లో భోజనం చేయను, నాకొక ఐదువందల ఇచ్చినచో (నాలిక కరుచుకుని ) ఇస్తే  నేను హోటలుకి వెళ్లి బిర్యానీ తింటాను. అని డబ్బు పుచ్చుకుని బసవడు బైటకు పోయెను.  మరుక్షణము గోడకి కొట్టిన బంతి వలే వెనుకకు వచ్చి నీవు ఆ ఆనంద నిలయమునకు పోవుట అదే  మాలిని గారి ఇంటికి  పోవుట  తగ్గించుము. అని బైటకు సుడిగాలి తాకినా విస్తరివలె ఎగిరిపోయెను. 


వడివడిగా నడుచుకు వెళ్లుచున్న  అగస్త్య కి వెనకనుంచి బసవయ్య గొంతు వినిపించెను" అగస్త్యా అని పిలుచుచూ అతడు అగస్త్యుని సమీపించెను.   "అక్కడ ప్రోగ్రాం అయిపోయాక బిర్యాని పెడతారా?" పక్కనుంచి నడుస్తూ  అన్నాడు బసవయ్య. "ముందే పెడతారని"  అగస్త్య అనగా బసవయ్య మరి మారు మాటాడక వెంట నడిచెను. 



వారిద్దరూ అట్లు నడుచుచుండగా అకస్మాతుగా ఉరుములేని పిడుగువలె బైరెడ్డి అతడి అనుచరులతో ఎదురుపడెను.  తత్తరపాటుతో అగస్త్య   పక్కనున్న సందులో నక్కబోయి బైరెడ్డికి చిక్కిపోయెను. బైరెడ్డి వాడివాహనమును అగస్త్యుని ముందు నిలిపెను. అతడి వెనుక మరొక రెండు ద్విచక్రవాహనములున్నవి. వాటిపై బైరెడ్డి స్నేహితులు నలుగురు  కూర్చొని ఉండిరి. వారు జై భీం తో పాటు జై బుద్ధ అనిరి. బసవడు  వారందరికీ జై భీమ్ అని వందనములు చేసెను.  అగస్త్యుడు అట్లేమీ అనక  మౌనముగా ఉండిపోయెను. వారగస్త్యను చూచి ముఖము చిట్లించిరి. 

"ఏరా అగ్గి ( అగస్త్య ) జైభీమ్ అనకున్న, జై బుద్ధ అనుటకు కూడా నోరురాకున్నదే! అవునులే గబ్బు  వేదాలని పట్టుకువేలాడు గబ్బిలాలకి..".అని బైరెడ్డి    అనుచుండగా "పొట్ట పొడిచిన అక్షరము రాని  నీవా వేదాలనాడువాడవు,  ఆక్షేపించువాడవు!! "అని అగస్త్యుడనెను.  వేదాలు చదువుకున్నామని పొగరురా మీకు! త్వరలో  విప్లవం తీసుకు వచ్చి వేదాలను తెగులబెట్టి  మీ అందరినీ తరిమికొట్టకున్న...అని బైరెడ్డి అనుచుండగా   

 "ఏరా బైరీ పోలీసులు వదిలేశారా?" అని అగస్త్య అడిగెను. అది విని  బైరెడ్డి ముఖము ఎర్రబారెను. "ఏరా బొల్లి గ్రద్దనో నల్ల పిల్లిని చూసినట్లు నన్ను చూచినంతనే సందులో దూరుచున్నావే"అని బైరెడ్డి అగస్త్యుని ఆక్షేపించెను.  "నీవంటి వారితో నావంటి సామాన్యుడు తూగలేడు అందుకే తప్పుకొనుచున్నాను." అని అగస్త్యుడు అనగా బైరెడ్డి నువ్వుకొని సరే సరే " బసవడితో మాట్లాడవలెను  నీవు కొంచుకు ముందుగా నడుచుచుండుము" అనెను.  అగస్త్య "మీ రహస్యములు వినవలెనని కోరిక నాకు లేద"ని వడివడిగా నడుచుకొని ముందుకు పోయెను. 

బైరెడ్డి బసవడితో మాట్లాడ సాగెను.  "ఈ బ్రాహ్మడితో స్నేహమేల చేయుచున్నావని మందలించెను. ఎందులకని  బసవడడుగగా బైరెడ్డి " పెరియార్ బ్రాహ్మణుడి గూర్చి ఇట్లనెను.  పాము   బ్రాహ్మడు ఒకే సారి కనిపించినచో  పామును వదిలి బ్రాహ్మణుడిని చంపవలెననెను" బసవడు మ్రాన్పడెను.      

 రేపు మన విద్యార్థిసంఘము తరుపున రాలీ కలదు. నీవు పాల్గొన వలెను. అని బైరెడ్డి అనగా  బసవడు "నాకు వాహనము లేదు కదా!" అని వాపోయెను  వెనకనున్న అహమద్ రేపటికి నా వాహనము తీసుకొనుము. అనెను.  అట్లైనచో అగస్త్యుడు కూడావచ్చును అని బసవడు అనుచుండగా " బెరైడ్డి అహమద్ జాన్, ప్రమోద్  ఒక్కసారిగా " నేటికీ వాడిని ఒదిలి మాతో రమ్ము భారత వర్ష ఇంటికి పోకున్న వచ్చు నష్టమేమి ?" అనిరి. బసవడు నాకు అచ్చట ఉచితముగా బిర్యానీ లభించును అనెను.  "ఆ బిర్యానీ మేము పెట్టించెదము. ఇప్పుడు నష్టమేమియూ లేదుకదా!"  అని వారు అనగా బసవడు ముందుగా నడుచుచున్న అగస్త్యునికడకు బోయి"అగస్త్యా నేను తరువాత వచ్చెదను నీవు పొమ్మ"ని చెప్పెను. అగస్త్యుడు వడివడిగా నడుచుకుని వెడలిపోయెను.      

పిమ్మట వారు  బసవని  ఫలహారశాల కొని బోయిరి. అచ్చట బిర్యాని చెప్పి అది వచ్చునంతలో వారు  మరునాటి  కార్యక్రమమును ముచ్చటించుకొనుచుండిరి. 

అగస్త్యుడు మంచివాడు వాడు కూడా ఉండిన బాగుండునని బసవడనెను. వాడికి ఎంతచెప్పిననూ ఆధునిక భావములు తలకెక్కకున్నవి.  అని ప్రమోద్ జాన్ అనిరి.  "ఆ అగస్త్య ఆధునిక భావములను అసహ్యించుకొనును. వాడు జీన్స్ ధరించుట ఎన్నడైనా చూచితివా? వాడికి వాహనము అవసరము లేదు, ఎక్కడికి పోయిననూ నడుచుకునే పోవుచుండును.   కళాశాలలో   కుంటి  సీత కూడా వాడి వైపు  కన్నెత్తి చూడద"ని అహ్మద్ బైరెడ్డి అనిరి. అందరూ పగలబడి నవ్విరి.  

  జాన్  "వాడికి పాతచింతకాయ పచ్చడి రుచించును.వాడికి పెద్దలను ధిక్కరించుట చేతకాదు.   కొత్తగా ఆలోచించుట చేతకాదు. పనికిమాలిన వేదములవెంట పడు వెర్రి కుక్క.   వేదములు రాసి బ్రాహ్మణులు సమాజమును నాశనము చేసినారు." అనెను . 
వేదములు  పనికి మాలినవా?  మా అమ్మ నాన్న కూడా వేదములు చదువుచున్నారు. అని బసవడు అనగా ప్రమోద్ "పిచ్చివాడా బుద్ధుడంతటివాడే వేదముల ను ఖండించలేదా " అనగా బైరెడ్డి  "వేదములు, పద్యములు, అచ్చ తెలుగు అనుచూ  భారతవర్ష  తిరుగుచుండగా  అగస్త్యుడు వాడి వెనుక   తిరుగుచున్నాడు. భారతవర్ష ని  అందరూ పిచ్చి వాడి వలే చూచుచున్నారు.  వాడి పిచ్చి వీడికెక్కినది. నీవునూ వాడితో తిరిగె దవా? " అని అడిగెను 

భారతవర్ష మనదరికంటే పెద్దవాడు చదువు పూర్తి చేసుకుని  ఉపన్యాసకుడిగా పనిచేయుచున్నాడు.  ఆయన సద్బుద్ధిని పాండిత్యాన్ని మెచ్చనివారు లేరు. ఆయన నీకు నచ్చకున్నా నీవు మెచ్చకున్నా వాడు వీడు అన్నచో నేను సహించజాలను. అని బసవడు తెగేసి చెప్పెను. ఇంతలో బిర్యానీ వచ్చినది. 

బసవడు తినుటకు ఉపక్రమించునంతలో జాన్  చేతిలో చరవాణి తీసి ఏమి వాడి పాండిత్యము వేదములు గొప్పవి అనువాడు వెధవ. ఇదిగో ముఖపుస్తకమునందు నా సమూహమును చూడుము." అని  చూపెను  "వేదములన్నియూ చెత్త" అని ఒకరు  వ్రాసిరి.  "బ్రహ్మ కి సరస్వతి ఏమగును?" అని మరొకరు వ్రాసిరి . "రాముడు కృష్ణుడు దేవుళ్ళు కారు.   ఏసు ఒక్కడే దేముడు " అని రాసి యున్నది." దానిని జాన్ నొక్కి వక్కాణించెను  

అంతవరకూ నిశ్శబ్దముగా యున్న అహ్మద్ కి దుమ్ము ముఖము పైకి చిమ్మినట్ట య్యెను.అప్పుడతడు " కామ్రేడ్! లా ఇలాహ  ఇల్లల్లాహు  ముహమ్మదుర్  రసూలుల్లా " దీని అర్థం తెలుసా ? ఈ సృష్టి కి కారణం అల్లాహు. అల్లాహు  ఒక్కడే పూజ్యనీయుడు. మా మసీదులలో నిత్యము ఇదే విషయమును ఐదు సార్లు మైకులలో చెప్పెదరుఅనెను.  అహ్మద్ అట్లనుటతో   జాన్ కి జిల్లేడు పాలు కంటిలో   పోసినట్లయ్యెను   "ఆదియందు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; అగాధ జలము మీద చీకటి కమ్మియుండెను. దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. అని ఆదికాండము చెప్పుచున్నద"ని అతడు  బల్ల గుద్దెను బిర్యాని ఆలస్యమైనందుకు అతడికి కోపము వచ్చెనని భావించిన ఆ ఫలహారశాల యజమాని తానె స్వయముగా  పరుగుపరుగున బిర్యాని పళ్ళెములు తెచ్చి పెట్టెను 

 అందరు దేవుళ్ళూ ఒక్కటే కదా ఎందుకలా కాట్లాడుకుంటారు. అన్నాడు బసవడు. బైరెడ్డి జాన్ ని వెనకేసుకొచ్చాడు.   'కామ్రేడ్ ఏసు నిజదేవుడని నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. " అంటూ బైరెడ్డి  ఎదో చెప్పబోయెను.    కొత్తగా  నిన్నకాక మొన్న   మతం మారిన వాడివి నీతో నాకేంటి.   నీ చర్చ్ కి వచ్చే గొర్రెలకు చెప్పు. లేదా వాడికి చెప్పు అని బసవడిని చూపించెను .  

 బసవడు అది పట్టించుకొనక బిర్యాని మెక్కుచుండెను. అది చూసి వారు  బసవడు మతసంబంధము లేని మనిషని అని   ఆదర్శప్రాయుడని  జనోద్ధారకుడని మెచ్చుకొని బిర్యానీ ఆరగించిరి.  తినుట ముగిసిన పిదప బసవడు "సరస్వతి జ్ఞానానికి రూపము.  ఆ జ్ఞానముతోనే బ్రహ్మ సృష్టి కార్యము జరిపెను"  అనెను. అని ఎచ్చట చెప్పబడెను  అని అహ్మద్ వెటకారంగా అడిగెను . బసవడు ఆదినాకు తెలియదనెను. అదివిని జాన్  "వచ్చిన పని ముగిసినది కదా ఇక పొమ్ము"  అనెను 

అతడి గొంతులో వెటకారము  బసవడి కి కారము రాసినట్టు తోచి  బిర్యాని పై  మమకారము నశించి  వికారము జనించినది. అతడు లేచి చేయి కడుగుకొనుటకు పోయెను.  చూసేవా వాడికి తెలియని ప్రశ్న అడిగి వాడిని ఎట్లు నోరు మోయించితినో  అని  జాన్ అనగా అహ్మద్  వాడికి తెలియదని ఖచ్చితముగా నీకెట్లు తెలియును ? అనెను.     హిందువుల ఇళ్లలో  తల్లిదండ్రులు  చదువులో ఒక్క మార్కు తగ్గినా చంపి పాతివేతురు విదేశములు పోవలెనని తపన తప్ప స్వదేశము స్వధర్మము  వారికి పట్టవు.  వారికి చదవ సమయమెచ్చటున్నది వారు చదువువారు కాదు ఎవరుచెప్పిననూ వినువారు కాదు. వారికి సినిమాలు తప్ప ఏవీ తలకెక్కవు ఎక్కవు. ఒక్క ప్రశ్నతో వారి నోరు మూయించుచవచ్చు. ఆవి వారు ఆడు మాటలు.  చేతులు కడుగుకొనుచూ బసవడు అంతయూ వినుచుండెను.బసవడు బల్లవద్ద యజమానికి అందరి తిండికీ డబ్బు చెల్లించే వెడలెను.      

పగలబడి  కూతురైన సరస్వతిని పెండ్లాడి  గొప్ప సృష్టి కార్యమే నడిపెను." అని అందరూ  హేళన చేసిరి.

                                                                    ***

వారు ఇరువురు ఆనందనిలయం చేరుసరికి ఒక గుడ్డపందిరి (షామియానా)  కింద సుమారు ఒక యాబది మంది గుంపు కనిపించెను. వారిరువురూలోపలికి పోవుచుండగా ఎవరో ఇరువురు సంభాషించుకొనుచున్నారు.

ఒకటవ వ్యక్తి  రెండవ వ్యక్తితో ఇచ్చట అన్నసంతర్పణ ఎందులకు జరుపుచున్నారు ఏ సందర్భమున  జరుపుచున్నారు? అనెను  అందులకు రెండవ వ్యక్తి నవ్వి  నిర్వాహకుడు భారతవర్ష యని తెలియును. ఎందుకు జరుపుచున్నారో తెలుసుకొనవలెననెడి ఆశక్తి అడుగంటెను, మొదటిసారి వచ్చినపుడు నీవలె నేను కుతూహలంతో అడుగగా " తన మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిచినందుకు భారతవర్ష సంతోషముతో అన్న సంతర్పణము చేయుచున్నాడని ఎవరో తెలిపిరి. మరొక సారి భారత వర్షను అడగగా ఇటువంటిదేదో సాకు చెప్పినాడు. ఎదో ఒక వంకన అన్నసంతర్పణ చేయుచున్ననూ వీరి ఉద్దేశ్యము తదుపరి కార్యక్రమమున  గమనించవచ్చు. అని తెలిపెను. ఆ కార్యక్రమమేదో నేను చూచియే పోయెదను అని మొదటి వ్యక్తి అనెను.   

భోజనములు ముగిసిన  పిదప , పక్కనే ఉన్నపెద్ద  గదిలో ఏర్పాటు చేయబడి ఉన్న వేదిక పై  అర్ధ చంద్రాకారముగా అమరచిన కుర్చీలలో స్థానిక కాలేజీలలో పనిచేయు తెలుగు ఉపన్యాసకుడు రామకృష్ణ, పదవీవిరమణలో నున్న ప్రభుత్వ కళాశాల అధ్యక్షుడు ఆంకాలరావు, సిద్ధాంతి చంద్రశేఖర శర్మ, ప్రజాదరణ పొందిన  రచయత  మారయ్య, వసతి గృహ సంరక్షకురాలు దామిని,  అంతర్జాల పత్రికాధిపతి  పెంచలయ్య , తెలుగు భాషాభిలాషకుడు అగస్త్య పృచ్ఛకులుగా వేదికపై యుండిరి. మధ్యలో అవధాన కృషీవలుడు భారతవర్ష కూర్చుండెను. 

ఎనిమిదవ వ్యక్తి ఎవరా యని అందరూ ఆసక్తిగా చూచుచుండ లంగా ఓణీలో తెల్లని పొడవాటి  పిల్ల వచ్చి వేదిక నలంకరించెను. ఆ అమ్మాయి  ఆలస్యమునకు క్షమాపణ చెప్పుచుండ గా , సిద్ధాంతి గారు ,రచయత  మారయ్య తో ఈమె పేరు మంజూష అవధాని సోదరి, నేటి అష్టావధాన ప్రక్రియ లో అసందర్భ ప్రసంగం జేయును  అని చెవిలో చెప్పెను. అవధాన ప్రక్రియ మొదలగు సమయానికి  వేదిక చుట్టూ  వేసిన కుర్చీలు నిండినవి.  భారతవర్ష తల్లి మాలిని మొదటివరుసలో కూర్చొండెను , పక్కనే పొరుగువారు , భారతవర్ష మిత్రులు , మంజూష మిత్రులు కూడా కూర్చొని ఉండిరి. అష్టావధాన కార్యక్రమానికి అధ్యక్షత స్థానిక తెలుగు సంఘం కోటేశ్వర రావు స్వాగత వచనం పలుకుతూ భారతవర్ష కి శుభాకాంక్షలు తెలియజేసారు, చిన్నపటినుంచి  అనేక సాంఘిక సేవ కార్యక్రమాల్లో పాల్గొని  మెడల్స్ అందుకున్న భారతవర్ష, ఈ సాహిత్య సేవ చేయడానికి ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు ప్రశంసించారు.   పాల్కురికి సోమనాధుడు వ్రాసిన 

డమరుగజాత డండడమృడండ మృడండ మృడండ                                    
మృండమృం డమృణ మృడండడండ మృణడండడ 
డండ మృడం డమృం డమృం డమృణ మృడండడంకృతి
విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ త్ర్పమథన తాండవాటన
“డ”కారనుత బసవేశ పాహిమాం!  

పద్యముతో బారతవర్ష కార్యక్రమమునకు శ్రీకారం చుట్టెను , బసవేశ్వరుడు గొప్పతనం  మధ్య మధ్యలో చర్చకు వచ్చెను,  అదివిని బన్నీ మొఖం ఎర్రబారెను. బసవయ్య మాత్రము ఈ చర్చ యాదృచ్ఛికమా లేక అగస్త్యుని ప్రేరణమా అని ఖిన్నుడయ్యి  కార్యక్రమం ముగియక మునుపే నిష్క్రమించెను. అనేక చిక్కుప్రశ్నలమధ్యలో మంజూష అన్నగారి ద్రుష్టి  మరలింప ఎంత యత్నించిననూ ఆమె సఫలము కాలేదు. అష్టావధానము ప్రక్రియ దిగ్విజయమాయెను. కార్యక్రమము పూర్తి అయిన పిదప అగస్త్య తప్ప అందరూ వెడలిపోయిరి. 

మంజూష చేత తేనీటికప్పుతో తళుక్కుమనెను. ఆమె తేనీరు ఇవ్వగా భారతవర్ష, అగస్త్య ఎదురెదురుగా కూర్చుని త్రాగుచుండిరి. అగస్త్య నీవెందులకో నేడు మిక్కిలి కలత జెంది యున్నట్లు కనబడుచున్నది  కారణమేమి ? అని అడిగెను . అటువంటిదేమియునూ లేదని అగస్త్య బదులు పలికెను. 

నీవు దాచదలుచుకొన్నచో అటులనే కానిమ్ము , కానీ రహస్యమైనచో దాచవలియును సమస్య అయినచో నావద్ద దాచపనిలేదు. అని భారతవర్ష పలకగా, "భావనావహన(టెలిపతి) విద్య తెలిసిన వానివద్ద  దాచి ప్రయోజనమేమి? అనెను. "నీ భావములు చదువుటకు  నీ హృదయమెరిగిన మిత్రుడికి ఏ విద్యలు నక్కరలేదు అని భారతవర్ష అనెను. నేను అపరాహ్ణవేళ బసవయ్య  దర్శనానికి బోయితిని  అని మొదలు పెట్టి ఆగెను, నీవు అవధానప్రక్రియకు ముందే ఈ విషయము నాతో చెప్పినావు , కానీ వాడు వచ్చిన పనియేమి చదువు అనిన వాడికి చుక్క ఎదురు కదా ! అని భారతవర్ష యనగా వాడిచ్చటకు వచ్చినది తినుటకు మాత్రమే అని అగస్త్య చెప్పెను.  "ఒకడు తిన్నచో మనకు నష్టమేమియునూలేదు కానీ, ఎంతకు చెడినాడోయి, అయ్యయ్యో ! రజోగుణముచే ప్రేరేపితుడయ్యి  లోభమున పాతాళము జేరినాడు కదా.  చిన్న పెద్దల మధ్య అంతరం గమనింపక  తల్లిని గొట్టి  హీనుడయ్యి తమస్సున యాతనపడు జీవి   ఉచ్చ నీచ వ్యత్యాసములు గణింపక ఉచితముగా వచ్చినదేదైనా స్వర్గమని భావించును. వీనికి ఇడుములు కడు బెడిదములు ముందున్నవి. అయిననూ తప్పంతయు బసవడిదిగాదు,తల్లి దండ్రులే వాడినిట్లు తీర్చి దిద్దగా వాడిట్లుగాకింకెట్లుండును? యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా యధా పిత్రా తథా పుత్ర.  అకటా !  తల్లిదండ్రులు ఆఇంటికి ఎంత చేటు తెచ్చినారోకదా!"

"ఇంతకీ నీసమస్య చెప్పక  ఎందులకీ అసందర్భ సంవాదము?" అని వర్షుడనగా. అగస్త్యుడు   " మా తండ్రిగారు  ఒక పరస్త్రీ మోజున పడుటచే మా తల్లి తండ్రుల మధ్య విభేదములు తలఎత్తినవి. రాజీ పడియుండమని ఎందరు చెప్పిననూ ఆమె వినకుండుటచే.... అని అగస్త్య చెప్పుచుండగా  వర్షుడు "ఇప్పుడు వారింకనూ కలహించుకొనుచున్నారా?"  అని అడిగెను.  వారిరువరు ఎన్నడో  విడిపోయినారు, త్వరలో విడాకులు తీసుకోబోవనున్నారు.  నా కథ  మొత్తము నీకుతెలియదు, నేను ఏడవవతరగతి, నీవు పదవతరగతిలో నున్నప్పుడు, నేను ఇంటిలోనుంచి పారిపోవుట మాత్రము నీకు తెలుసు  అని తన కథ చెప్పదొడిగెను.   

7 comments:

  1. చాల చక్కని తెలుగులో ఎంతో హృద్యంగా యున్నది

    ReplyDelete
  2. భరత వర్ష గ్రంథం నిజ జీవితాలకు అద్దం పడుతుంది

    ReplyDelete
  3. ఈ కథ లో బసవయ్య క్యారెక్టర్ నేటి పిల్లల మనస్తతత్వం లాంటిది అతి గారాబం వలన అతను ఎలా చెడిపోయినాడో మనకు తెలుస్తుంది

    ReplyDelete
  4. Bharatvarsha Lo Chala baavalu Vinni sir

    ReplyDelete
  5. Naku Baga upayoga padthuthundhi sir, ee bharathavarsha

    ReplyDelete
  6. Basaweswarudi sthithi vasthavaniki sameepamuga unnadhi ,talli tandrula prabhavam mariyu perigina vathavarana pramayam prathi Manishi Medha mikkili ekkuvuga undunu.

    ReplyDelete
  7. అచ్చ తెలుగులో అద్భుతంగా రాసారు. అబినందనలు

    ReplyDelete