Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, July 11, 2020

Bharatavarsha 3

రెండులక్షల యాబదివేల జనాభాగల  ఎం వీ పీ కాలనీ ఆసియాలో అతిపెద్ద జనావాసము. అందు  ఆనంద నిలయము  చెంత మధ్యతరగతి ఆవాసమొకటి రెండు కిటికీలు  మధ్యలో ద్వారము  పక్కనే మిద్దెపైకి సోపానములు ప్రక్కనే చిన్న ప్రవేశద్వారం దానికి అమర్చబడిన రెండు చిన్న ఇనుప తలపులతో చల్లగా కనబడుచుండెను.  ఆ ఇంటినందు బిగ్గరగా సంవాదము జరుగుచుండెను.  
 బైక్ కొనలేక పోయావు, థూ! కనీసం ఒక స్మార్ట్ ఫోన్ కూడా కొనలేకపోయావ్, మా కాలేజీకొచ్చి చూడు ప్రతీ ఎర్రిపప్పకి కూడా స్మార్ట్ ఫోన్ ఉంది, అందరూ బైక్ల మీద కాలేజీకి వస్తుంటే నేను మాత్రం మూడేళ్లనుంచి బస్సులలో తిరుగుతున్నాను.   చేతగానప్పుడు పిల్లల్ని  కనకూడదు. అన్నాడు బసవయ్య తండ్రితో. ఏం  కూసావురా! నేను చేతకానోడినైతేనేనా, లక్షలు తెగలేసి  నిన్ను పెద్దకాలేజిలో ఇంజినీరింగ్లో జేర్చేను!  సోకుల మీదే నీఫోకస్ అందుకే నీకన్నిబేక్ లాగ్స్,  నువ్వు చదువు  మీద  కాన్సెన్ట్రేట్ చెయ్యి  బేక్ లాగ్స్ క్లియర్ చెయ్యి  అన్నాడు తండ్రి సర్రాజు . 



కొడుకు ఎదో చెప్పబోవుచుండగా   తల్లి బుచ్చమ్మ అతడిని ఆపి, బసవా మీనాన్న చేయుచున్నది  ఆర్ టీ  సి లో గుమస్తా పని. అది గుర్తుంచుకొనుము.   ఇప్పటికే శక్తికి మించి పరిగెత్తుచున్నాము .  ఆచిన్నదాన్ని చూచననూ   బుద్ధి తెచ్చు కొనుము , దానిని చూడుము  డబ్బుఖర్చుపెట్టి ఆ కార్పొరేట్ స్కూల్ లో వేసినందుకు ఎంత మంచి మార్కులు తెచ్చు కొనుచున్నదో !" అని బుచ్చమ్మగారు అనగా బసవడికి వొళ్ళు మండెను  "దీనమ్మ బేక్ లాగ్స్ , ఎప్పుడు బండి కొనమని  అడిగినా , సెల్ కొనమని అడిగినా నాన్న   బేక్ లాగ్స్ అంటాడు , నువ్వు  చెల్లిని చూబెట్టి  నాకు దొబ్బులు పెడతావు . మీరు నాకేమిచ్చారు, కని పడేసారు , ఆఖరికి పేరుకూడా బసవయ్య అట , చెప్పుకోడానికే సిగ్గేస్తోంది , అందుకే బన్నీ అని చెప్పుకుని తిరుగుతున్నాను, అన్నాడు కొడుకు. 

తాతగారిపేరుని ఎందుకురా అలా అంటావు , ఆయన చాలా గొప్పవారు తెలుసా ? అంది బసవయ్య చెల్లి . " ఏం గొప్ప , మొత్తం డబ్బులంతా దాన ధర్మాలు చేసి చిప్పచేతికిచ్చాడు." అన్నాడు బసవయ్యచందన త్రాష్టుడితో వాదించక నువ్వు లోపలి పోయి చదువుకోమ్మా , అని కుమార్తెకు  జెప్పి   

 గుమ్మదగ్గర నిలబడి ఉన్న బసవయ్య స్నేహితుడిని చూసి , నువ్వు కాస్సేపు  బైటికి పో నీ స్నేహితుడు వచ్చాడు " అని కొడుకుని నెట్టెను. లిప్తపాటులో జరగరానిది  జరిగిపోయెను   బసవ తల్లి చెంప చెళ్లు  మనిపిం చెనుతల్లి కళ్ళల్లో నీరు తిరిగి, గుమ్మంలో  నిలబడి వెనుదిరుగుతున్న బసవయ్య స్నేహితుడిని చూసి తండ్రి " చూడయ్యా అగస్త్య  వీడీని కన్నందుకు నేను చేతకానోడినట  చూసేవా తల్లిని కొట్టేడు, శనిలా దాపురించాడు " అన్నాడు.

 

 అగస్త్యకి ఏమి మాట్లాడ వలెనో  తెలియక మౌనం వహిం చెను."  నేను చస్తే మీకు నాశని వదిలిపోతుంది." అని చెప్పులు వేసుకుంటున్న కొడుకుని చూసిన  తల్లి "వాడు నన్ను కొట్టడం ఏంటి ? నన్నెవరూ కొట్టలేదు లేనిపోని అబాండాలు వేయకండి." అనెనుకొడుకు అఘాయిత్యము  చేసుకొనునో యని  "భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్ళకునాన్నా అని గెడ్డంపుచ్చుకొనెను. "మళ్ళీ వస్తానండీఅని అగస్త్య వెను తిరిగెనుబుచ్చెమ్మగారు "ఆగు బాబు, లోపలికి రా, ఇప్పుడేమయ్యిందని, ఇల్లన్న తర్వాతత గొడవలు ఉండవా, మనుషులన్నతర్వాత మాటా మాట అనుకోరా? మధ్యాన్నాము భోజనం వేళ అవుతుండగా వచ్చావు నువ్వు కూడా భోజనం చేసి వెళ్ళవలెను." అనగా  అగస్త్యుడు "భోజనమునకు వీలు పడదుభారతవర్ష ఇంటికి పోవుచున్నాను, అచ్చట అవధాన కార్యక్రమమున్నది, నేను పృచ్చకుడిగా పోవుచున్నాను. బసవయ్య వచ్చునేమోయని ఇటువచ్చితిని. అనెను అగస్త్య. బసవయ్య అని అగస్త్య కూడా అన్నందుకు బసవయ్య నొచ్చుకుని “బన్నీయని పిలిచిన నీ సొమ్ములేమైనా పోవునా?

 నాకు గిట్టని మాటలేల ఆడెదవు ? "బసవయ్య అను పేరునే ఆక్షేపింతువా ? కావలిసిన నేను బసవా యని పిలుతును."  అని అగస్త్య అనగా నీకు పుణ్యముండును అట్లు నన్నెప్పుడు పిలువప్రయత్నించ వలదు  పనివానిని పిలిచినట్లు మిక్కిలి వెగటుగా వుండును అని బసవయ్య అనగా, నటులను ఇలవేలుపుగా కొలుచువానికి  వానికి బన్నీ, చెర్రీయను పేర్లు గాక ఇంకేమియు నచ్చును. అని అగస్త్య అనెను “నన్ను ఆక్షేపించిన సరిపుచ్చు కొందును గానీ , నా అభిమాన నటులను ఏమైనా అన్నచో యూరకొనను” అనెను.


ఇదేమి మా వాడి భాష ఇట్లు మారిపోయెను   అన్నట్టు చూచుచున్న  తలిదండ్రులతో బసవ ఇట్లనెను , “ఛీ ఛీ ఈ భారత వర్ష ప్రభావమున , అదే ఇన్ఫ్లుయెన్స్ వల్ల మా స్నేహితులు చాలామంది అచ్చతెలుగు మాట్లాడుచున్నారు, ఛీ అదే మాట్లాడుతున్నారు.” ఈ వూర్లో అచ్చతెలుగు మాట్లాడే వెధవలంతా వాడి స్నేహితులు కానీ, స్నేహితుల స్నేహితులు కానీ తప్పక అగుదురు , అని  నాలిక కరుచుకుని అయ్యిఉంటారు. అని తల్లిదండ్రులతో అని, అగస్త్యవైపు తిరిగి నువ్వెళ్ళరా బాబూ నేను ఇలాటి పోగ్రాంలకి దూరంగా ఉంటాను, మీతో తిరుగుతుంటే ఆ దరిద్రం అంతా నాకంటుకుంటున్నది. అనెను .

బుచ్చెమ్మగారు వర్షుడింటికి  పోకున్ననూ  , భోజనం చేసి వెళ్లవలెనని  అని కొడుక్కి చెప్పి, అగస్త్యు నితో  "వాడికి ఇంగ్లీష్ అంటే ఇష్టం బాబూ, మీరంతా  తెలుగు మానేసి ఇంగ్లిష్ మాట్లాడినచో మిమ్మలిని అంటుకొని తిరుగును,  తెలుగుదేనికి  పనికొచ్చునని ఇప్పుడంతా ఇంగిలీషే మాట్లాడు చున్నారు కదా!"   

 అగస్త్య మాట్లాడకుండా నవ్వుచూ నిష్క్రమించెను. బసవడు  అమ్మా నాన్న   మీరు ఎన్ని చెప్పినా  నేను ఈరోజు ఇంట్లో భోజనం చేయను, నాకొక ఐదువందల ఇస్తే  నేను హోటలుకి వెళ్లి బిర్యానీ తింటాను. అని డబ్బు పుచ్చుకుని బసవడు బైటకు పోయెను.  


వడివడిగా నడుచుకు వెళ్లుచున్న  అగస్త్య కి వెనకనుంచి బసవయ్య గొంతు వినిపించెను" అగస్త్యా అని పిలుచుచూ అతడు అగస్త్యుని సమీపించెను.   "అక్కడ ప్రోగ్రాం అయిపోయాక బిర్యాని  పెడతారా?" అన్నాడు పక్కనుంచి నడుస్తూ బసవయ్య. ముందే పెడతారు అని  అగస్త్య అనగా బసవయ్య మరి మారు మాటాడకుండా వెంట నడిచెను. వారు ఇరువురు ఆనందనిలయం చేరుసరికి ఒక గుడ్డపందిరి (షామియానా)  కింద సుమారు ఒక యాబది మంది గుంపు కనిపించెను. వారిరువురూలోపలికి పోవుచుండగా ఎవరో ఇరువురు సంభాషించుకొనుచున్నారు.

ఒకటవ వ్యక్తి  రెండవ వ్యక్తితో ఇచ్చట అన్నసంతర్పణ ఎందులకు జరుపుచున్నారు ఏ సందర్భమున  జరుపుచున్నారు? అనెను  అందులకు రెండవ వ్యక్తి నవ్వి  నిర్వాహకుడు భారతవర్ష యని తెలియును. ఎందుకు జరుపుచున్నారో తెలుసుకొనవలెననెడి ఆశక్తి అడుగంటెను, మొదటిసారి వచ్చినపుడు నీవలె నేను కుతూహలంతో అడుగగా " తన మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిచినందుకు భారతవర్ష సంతోషముతో అన్న సంతర్పణము చేయుచున్నాడని ఎవరో తెలిపిరి. మరొక సారి భారత వర్షను అడగగా ఇటువంటిదేదో సాకు చెప్పినాడు. ఎదో ఒక వంకన అన్నసంతర్పణ చేయుచున్ననూ వీరి ఉద్దేశ్యము తదుపరి కార్యక్రమమున  గమనించవచ్చు. అని తెలిపెను. ఆ కార్యక్రమమేదో నేను చూచియే పోయెదను అని మొదటి వ్యక్తి అనెను.   

భోజనములు ముగిసిన  పిదప , పక్కనే ఉన్నపెద్ద  గదిలో ఏర్పాటు చేయబడి ఉన్న వేదిక పై  అర్ధ చంద్రాకారముగా అమరచిన కుర్చీలలో స్థానిక కాలేజీలలో పనిచేయు తెలుగు ఉపన్యాసకుడు రామకృష్ణ, పదవీవిరమణలో నున్న ప్రభుత్వ కళాశాల అధ్యక్షుడు ఆంకాలరావు, సిద్ధాంతి చంద్రశేఖర శర్మ, ప్రజాదరణ పొందిన  రచయత  మారయ్య, వసతి గృహ సంరక్షకురాలు దామిని,  అంతర్జాల పత్రికాధిపతి  పెంచలయ్య , తెలుగు భాషాభిలాషకుడు అగస్త్య పృచ్ఛకులుగా వేదికపై యుండిరి. మధ్యలో అవధాన కృషీవలుడు భారతవర్ష కూర్చుండెను. 

ఎనిమిదవ వ్యక్తి ఎవరా యని అందరూ ఆసక్తిగా చూచుచుండ లంగా ఓణీలో తెల్లని పొడవాటి  పిల్ల వచ్చి వేదిక నలంకరించెను. ఆ అమ్మాయి  ఆలస్యమునకు క్షమాపణ చెప్పుచుండ గా , సిద్ధాంతి గారు ,రచయత  మారయ్య తో ఈమె పేరు మంజూష అవధాని సోదరి, నేటి అష్టావధాన ప్రక్రియ లో అసందర్భ ప్రసంగం జేయును  అని చెవిలో చెప్పెను. అవధాన ప్రక్రియ మొదలగు సమయానికి  వేదిక చుట్టూ  వేసిన కుర్చీలు నిండినవి.  భారతవర్ష తల్లి మాలిని మొదటివరుసలో కూర్చొండెను , పక్కనే పొరుగువారు , భారతవర్ష మిత్రులు , మంజూష మిత్రులు కూడా కూర్చొని ఉండిరి. అష్టావధాన కార్యక్రమానికి అధ్యక్షత స్థానిక తెలుగు సంఘం కోటేశ్వర రావు స్వాగత వచనం పలుకుతూ భారతవర్ష కి శుభాకాంక్షలు తెలియజేసారు, చిన్నపటినుంచి  అనేక సాంఘిక సేవ కార్యక్రమాల్లో పాల్గొని  మెడల్స్ అందుకున్న భారతవర్ష, ఈ సాహిత్య సేవ చేయడానికి ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు ప్రశంసించారు.   పాల్కురికి సోమనాధుడు వ్రాసిన 

డమరుగజాత డండడమృడండ మృడండ మృడండ                                    
మృండమృం డమృణ మృడండడండ మృణడండడ 
డండ మృడం డమృం డమృం డమృణ మృడండడంకృతి
విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ త్ర్పమథన తాండవాటన
“డ”కారనుత బసవేశ పాహిమాం!  

పద్యముతో బారతవర్ష కార్యక్రమమునకు శ్రీకారం చుట్టెను , బసవేశ్వరుడు గొప్పతనం  మధ్య మధ్యలో చర్చకు వచ్చెను,  అదివిని బన్నీ మొఖం ఎర్రబారెను. బసవయ్య మాత్రము ఈ చర్చ యాదృచ్ఛికమా లేక అగస్త్యుని ప్రేరణమా అని ఖిన్నుడయ్యి  కార్యక్రమం ముగియక మునుపే నిష్క్రమించెను. అనేక చిక్కుప్రశ్నలమధ్యలో మంజూష అన్నగారి ద్రుష్టి  మరలింప ఎంత యత్నించిననూ ఆమె సఫలము కాలేదు. అష్టావధానము ప్రక్రియ దిగ్విజయమాయెను. కార్యక్రమము పూర్తి అయిన పిదప అగస్త్య తప్ప అందరూ వెడలిపోయిరి. 

మంజూష చేత తేనీటికప్పుతో తళుక్కుమనెను. ఆమె తేనీరు ఇవ్వగా భారతవర్ష, అగస్త్య ఎదురెదురుగా కూర్చుని త్రాగుచుండిరి. అగస్త్య నీవెందులకో నేడు మిక్కిలి కలత జెంది యున్నట్లు కనబడుచున్నది  కారణమేమి ? అని అడిగెను . అటువంటిదేమియునూ లేదని అగస్త్య బదులు పలికెను. 

నీవు దాచదలుచుకొన్నచో అటులనే కానిమ్ము , కానీ రహస్యమైనచో దాచవలియును సమస్య అయినచో నావద్ద దాచపనిలేదు. అని భారతవర్ష పలకగా, "భావనావహన(టెలిపతి) విద్య తెలిసిన వానివద్ద  దాచి ప్రయోజనమేమి? అనెను. "నీ భావములు చదువుటకు  నీ హృదయమెరిగిన మిత్రుడికి ఏ విద్యలు నక్కరలేదు అని భారతవర్ష అనెను. నేను అపరాహ్ణవేళ బసవయ్య  దర్శనానికి బోయితిని  అని మొదలు పెట్టి ఆగెను, నీవు అవధానప్రక్రియకు ముందే ఈ విషయము నాతో చెప్పినావు , కానీ వాడు వచ్చిన పనియేమి చదువు అనిన వాడికి చుక్క ఎదురు కదా ! అని భారతవర్ష యనగా వాడిచ్చటకు వచ్చినది తినుటకు మాత్రమే అని అగస్త్య చెప్పెను.  "ఒకడు తిన్నచో మనకు నష్టమేమియునూలేదు కానీ, ఎంతకు చెడినాడోయి, అయ్యయ్యో ! రజోగుణముచే ప్రేరేపితుడయ్యి  లోభమున పాతాళము జేరినాడు కదా.  చిన్న పెద్దల మధ్య అంతరం గమనింపక  తల్లిని గొట్టి  హీనుడయ్యి తమస్సున యాతనపడు జీవి   ఉచ్చ నీచ వ్యత్యాసములు గణింపక ఉచితముగా వచ్చినదేదైనా స్వర్గమని భావించును. వీనికి ఇడుములు కడు బెడిదములు ముందున్నవి. అయిననూ తప్పంతయు బసవడిదిగాదు,తల్లి దండ్రులే వాడినిట్లు తీర్చి దిద్దగా వాడిట్లుగాకింకెట్లుండును? యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా యధా పిత్రా తథా పుత్ర.  అకటా !  తల్లిదండ్రులు ఆఇంటికి ఎంత చేటు తెచ్చినారోకదా!"

"ఇంతకీ నీసమస్య చెప్పక  ఎందులకీ అసందర్భ సంవాదము?" అని వర్షుడనగా. అగస్త్యుడు   " మా తండ్రిగారు  ఒక పరస్త్రీ మోజున పడుటచే మా తల్లి తండ్రుల మధ్య విభేదములు తలఎత్తినవి. రాజీ పడియుండమని ఎందరు చెప్పిననూ ఆమె వినకుండుటచే.... అని అగస్త్య చెప్పుచుండగా  వర్షుడు "ఇప్పుడు వారింకనూ కలహించుకొనుచున్నారా?"  అని అడిగెను.  వారిరువరు ఎన్నడో  విడిపోయినారు, త్వరలో విడాకులు తీసుకోబోవనున్నారు.  నా కథ  మొత్తము నీకుతెలియదు, నేను ఏడవవతరగతి, నీవు పదవతరగతిలో నున్నప్పుడు, నేను ఇంటిలోనుంచి పారిపోవుట మాత్రము నీకు తెలుసు  అని తన కథ చెప్పదొడిగెను.   

7 comments:

  1. చాల చక్కని తెలుగులో ఎంతో హృద్యంగా యున్నది

    ReplyDelete
  2. భరత వర్ష గ్రంథం నిజ జీవితాలకు అద్దం పడుతుంది

    ReplyDelete
  3. ఈ కథ లో బసవయ్య క్యారెక్టర్ నేటి పిల్లల మనస్తతత్వం లాంటిది అతి గారాబం వలన అతను ఎలా చెడిపోయినాడో మనకు తెలుస్తుంది

    ReplyDelete
  4. Bharatvarsha Lo Chala baavalu Vinni sir

    ReplyDelete
  5. Naku Baga upayoga padthuthundhi sir, ee bharathavarsha

    ReplyDelete
  6. Basaweswarudi sthithi vasthavaniki sameepamuga unnadhi ,talli tandrula prabhavam mariyu perigina vathavarana pramayam prathi Manishi Medha mikkili ekkuvuga undunu.

    ReplyDelete
  7. అచ్చ తెలుగులో అద్భుతంగా రాసారు. అబినందనలు

    ReplyDelete