Friday, February 12, 2021

Bharatavarsha - 130

కళ్యాణ కాంతులను విరజిమ్ము ఆనందనిలయ ప్రాంగణమందు గల వేదిక పైనుండి వేదమంత్రములవలె కవితా ఘోష వినిపించు చుండెను.  వర్షుడు నందిని వేదికనెక్కగా మీనాక్షి , అరుణ , కేశవుడు క్రిందనుండి చూచుచుండిరి. సుమారు నూరుగురు ఆహుతులు వేదికవద్ద దిగువున వేసిన కుర్చీలపై కూర్చుని యుండిరి. వర్షుడు  తల్లికి సైగచేయగా మాలిని గారు  సిగ్గు పడుచున్న వారిని  వేదికపైకి నెట్టినారు.   అరుణతారకు ఆ కవి బృందము  మత్తేభ సమూహము వలె కనిపించ మీనాక్షికి వారి కవితా రవములు సంగీతమువలె వినిపించెను. సుబ్బన్న పంతులుగారు, వెంకటప్పయ్య గారు, శేషాద్రి శర్మగారు,  సీతమ్మగారు, అచ్చమాంబ గారు ఇట్లనేక కవి కవయిత్రుల యొక్క   భావ కవితా  వృష్టి యందు తడిసి  పరవసించిన ఆహూతులందరూ కరతాళ ధ్వనులు చేయుచుండిరి. ఆ హర్ష నాదముల మధ్య వర్షుడు సభకు విచ్చేసిన కవి పండితు లందరికీ ధన్యవాదములర్పించి సుబ్బన్న పంతులుగారికి గండ పెండేరము తొడుగుట కవులందరికీ దక్షిణ తాంబూల సత్కారమును ప్రకటించెను. 

శేషాచలముగారు, పెంచలయ్య పైడమ్మగార్లు సందీపుడు అప్పుడే వచ్చి చేరినారు.  వర్షుడు వ్రాసిన పద్యకావ్యము “మదన గోపాల మహిమ” పుస్తకములను సందీపుడు అచ్చటనున్న ఆహూతులందరికీ పంచ సాగెను. వర్షుడు వ్రాసి ముద్రణ కివ్వక వదిలి వేసిన అనేక చిన్న చిన్న రచనలను నందిని సొంతముగా ముద్రించెను అని పైడమ్మగారు మాలిని చెవిలో చెప్పుచుండగా నందిని తాను వ్రాసిన అనుష్టుబ్ చంద శ్లోకంతో సరస్వతిని కీర్తించి పిదప సుబ్బన్న పంతులుగారికి ప్రణామము లర్పించెను. There is a Youtube video (song) below this line but you can not see if you are in the mobile view mode. Please change it to web view option available under Home button. 


   సనాతనీ   విద్యామాతా సర్వశాస్త్ర   పరంజ్యోతి 

   జ్ఞానప్రదా   యనీదేవీ   వేదాగ్రణి    నమోస్తుతే

    సరస్వతీ పుత్రే కవివరేణ్యే అతులిత జ్ఞాన సంపన్నే

   దినేష సంకాశ ప్రకాశితే  సుబ్బన్నే ప్రణమామ్యహం

ఆమె గానమందు ఆహూతులందరు పారవశ్యమును పొందుచుండ  వేదికపై నున్న వర్షుడు , కేశవ మీనాక్షి , మాలిని తారలు అబ్బురంగా చూచుచుండిరి. పార్వతి, సుందరి రంజని , బుచ్చమ్మగారు వారి ప్రక్కగా మధుబాల నరేంద్ర పండితులు వారి ప్రక్కనే మంజూష నిలిచియుండిరి.  బసవడు కృష్ణన్ తులశమ్మగారు అగస్త్యుడు తదితరులు వేదిక వద్దకు చేరినారు. తల్లిని చూచుచూ అగస్త్యుడు మైమరచుచుండెను.  అకస్మాత్తుగా అతడి దృష్టి సుందరి పై పడెను. ముందునున్న సుందరి కూడా అగస్త్యను చూచినది. కనులు  కనులు కలసినవి.   అగస్త్యుడు మెల్లగా  కదలుచూ తననెవరూ  చూచుటలేదనుకొని సుందరిపక్కకు పోయి "నీ తీయని తలపులు నను నిలువ నీకున్నవి" అని   చేతి నందుకొని చూడగా అతడి చేతిలో  బుచ్చెమ్మగారి చెయ్యి ఉండటతో ముచ్చెమటలు పెట్టినవి.  ఆదృశ్యము  తార కంట పడి  మీనాక్షి చెవిన వేసెను.  వేదిక క్రింద అందరూ నవ్వుచుండిరి .  

చందన అందరికీ పానీయములు పలహారములు అందించుచూ ఇంటిలోనే ఉండెను.  విదిష మరికొందరు ఏర్పాట్లు చూచుచున్న స్త్రీలు,  కొద్దిమంది పేకాట రాయుళ్లగు పురుషులు మాత్రము ఇంటిలోనే ఉండిరి.  లకుమ ప్రియుడు తనకు దొరికిన బహుమతిని విడువక ప్రాంగణమందు ఒక మూల ముచ్చట్లాడుచుండెను. అందరికీ వేదిక పై గానము వినబడుచున్నది. సుందరి ఆసువుగా సంస్కృత శ్లోకములను సులువుగా సంధించు ఆహుతు లందరిపై పూలవాన కురిపించుచుడెను. 

 వేదికపైనున్న ప్రౌఢ కవులగు వర్షుడు, సుబ్బన్న పంతులుగారు కూడా ఆ గానమునకు     చూచి సంభ్రమాశ్చర్యములు పొందిరి.  వర్షుడు సుబ్బన్న పంతులుగారి కి దుశ్శాలువా కప్పి కాలికి గండ పెండేరమును తొడిగెను, కరతాళ ధ్వనులు మిన్నంటినవి.  వేదికపై నున్న కవులందరికీ దుశ్శాలువాలు కప్పి స్వర్ణ బహుమతులనొసగి ఆనందింపజేసెను.

నాటి రోజులలో , రాజులు కవులని ఆదరించెడివారని ప్రజాప్రభుత్వములు వచ్చిన పిదప కవులకు ఆదరణ కరువైనదని చెప్పుచూ  భాషాభిమానం గల వర్తకులు , జమీందారులు వైద్యులు వంటి అనేకులు ప్రభుత్వముకంటె ఎక్కువగా కవులను ఆదరించెడివారని తెలిపి ఒక దశాబ్దము తర్వాత అటువంటి ఆదరణ పొందితిమని కవులందరూ  చెప్పుచుండగా   మాలిని గారు మంజూషను తీసుకువచ్చి అతడి కాళ్లకు నమస్కరింప జేసిరి. పైడమ్మగారు సందీపుని కూడా తీసుకొచ్చి ఆమె  ప్రక్కనే నమస్కరింప జేసిరి.  

సుబ్బన్న పంతులుగారు "సుదినం సుదినం కళ్యాణం తవ సుదినం సుదినం భవతు మంగళం సుదినం సుదినం చిరంజీవి సౌభాగ్యవతి సుదినం సుదినం యశో వర్ణనం విజయీభవ సర్వత్రా సర్వదా , శతమానం భవతి సతాయు హ్  పురుష సతేంద్రియ ఆయుష్యే వేంద్రియ  ప్రతితిష్ఠతి. “  అని ఆశీర్వదించిన పిదప మదన గోపాల మహిమ పుస్తకము చేరగా సంతోషముతో వర్షుని  చూచుచూ

సరస కవిరాజ రసిక సురరాజ ఘనరాజ రాజ రాజ 
దోష  రాహిత్య, నిత్య సాహిత్య భోజ, మహిత సాహితీ మనో వల్లభా 
కీర్తి దుర్లభా, భక్తివిజయ జ్యేష్ఠ, విదిష శృంఖలిత శృంగార శ్రేష్ఠః
కృష్ణ క్రీడల దృష్టి ఘన కృష్టి మదన గోపాల కావ్య సృష్టి 
కలుగు భక్తి పుష్టి కురియు నీదు నీలాల మీద క్రిష్ణనీలాల వృష్టి. 

అని ఆశీర్వ దించినారు  “ప్రక్క భవనంలో భోజనములు ఏర్పాటు చేయబడినవి కవులందరూ భోజనము చేయవలెను.” అని భారత వర్ష వారిని భోజనములవద్దకు కొనిపోయి విడిచి తిరిగి వేదిక వద్దకు వచ్చెను. సందర్శకులు ఆహుతులు కూడా వెడలిన పిదప ఆనందానిలయములో కేవలము కుటుంబ సభ్యులు మిత్రులు మాత్రమే  మిగలగా  వారికి భజనములు ఇంటిలోనే వడ్డించుచున్నారు. 
తార మీనాక్షిలు ఇంకనూ వేదిక దిగక అచ్చటనే ఉండి మాలినిని వేదికపైకి లాగినారు. అరుణ మనసు ఆనందముతో గంతులు వేయుచుండ ఆమె నాట్యము చేయుచుండెను. మీనాక్షి కూడా ఆమెతో నాట్యము చేయుచుండెను.   నందిని రంజని కూడా వేదికపైకి ఎక్కి మాలిని గారిని నాట్యము చేయవలెనని పోరగా మాలిని గారు నాట్యము చేయుచూ చతికిల బడినారు. వర్షుడు విదిష తటాలున వేదిక నెక్కినారు. విదిష “అయ్యో అత్తయ్యా!” అని ఆమెను లేవనెత్తెను.  అరుణ తార మీనాక్షి నాట్యమాపి ఆమెకు ఊతమిచ్చిరి 

నందిని వర్షుని నాట్యము చేయవలెనని కోరగా విదిష వర్షుని ఒక ప్రక్కకు లాగి అతడి దగ్గరగా  నిలిచెను.  అరుణ తార , మీనాక్షి  నందిని సంస్కృత గానము నందు పారవశ్యమంది మరల పాడమని కోరిరి , మాలిని బుచ్చెమ్మగారు మంజూష , బసవ పార్వతులు  కూడా అట్లే  కోరగా  నందిని ప్రారంభించెను   
  
   మితభుద్ది ఏవం పరిమిత శుద్ధి,  ధనం పరితః పరి భ్రమణం నిత్యం                     
   నివసితి ఏవ బహు అల్ప ప్రపంచం కదాపి చేతతి  ప్రత్యక్ష  ప్రపంచం
   లేఖిక భుద్ది లోక ప్రసిద్ధి ఉదారబుద్ధి వాగ్దేవి బద్దం 
    సుశబ్ద శోభిత సుందర కోసం భారత వర్షం అనేకవర్ణం  
   రసిక రంజకం దుఃఖ భంజకం పండిత ప్రభవ కవితా తరంగం  
   పండిత పారంగత గీర్వాణ కావ్యం, కారు కృత కావ్యం వాణి సంభూతం 
   చారు సందేశం అమృత భాండం బహు దుఃఖ వారణం ఆనంద సాగరం
   భువనైక సుందర మాంగళ్య తోరణం భారత వర్షం సర్వతీ పుత్రం 
   సర్వతీ పుత్రం బహుజన మిత్రం సర్వతీ పుత్రం బహుజన మిత్రం

కవి సమ్మేళనమందు ఇంతవరకూ పాడి ఆపివేసిన నందిని.  వర్షుని ఆరాధనా పూర్వకముగా చూచుచూ  మరొక   రెండు శ్లోకములు చేర్చి…పాడుచుండగా అందరూ ఆశ్చర్యముగా చూచుచుండిరి.  

   కష్టాని క్లేశాని  నిర్భర  లోకం,  దుర్హిత దుష్కృత అవరోధక లోకం 
   అమీవ, కైటవ కాళిందివ లోకం తస్మిన్ లోకే సుక తాండవకృష్ణం.   
   భారత వర్షం తాండవ కృష్ణం తాండవ కృష్ణం కవితా తృష్ణం
   గీర్వాణ నిర్వాణ రాగ సంకీర్ణం…     యాస్యతి నందిని 
   నందనందనం నందనందనం మమ అదృష్టం

అని విదిషను చూచుచూ వర్షుని చేతినందుకొని ముద్దాడుచుండగా, లిప్తలో  వర్షుడు తన చేతిని విదిలించుకుని నందిని వైపు కోపముగా చూసేను అదే సమయములో విదిష నందినిని చూసి నవ్వెను. అనుకోని సంఘటనతో  హతాశు రాలయ్యెను. వర్షుడు అక్కడ నిలువ జాలక వేదిక దిగి విసవిసాపోయెను.  నందిని ఏడ్చుచూ కారువద్దకు పోయెను. " మాచెల్లి  మీకొరకు శ్రమించి  పుస్తకములను ముద్రణచేయించగా   ఆమెను కన్నీరు పెట్టించినారు.   నా చెల్లి కన్నీరు  కార్చిన మీ చెల్లి పెళ్లి ఎట్లగును? అని సందీపుడు చెల్లి వద్దకు పోవుచుండగా వర్షుడు శిలా ప్రతిమ వలె నిలిచిపోయెను. అరుణ తార మీనాక్షిలు అవాక్కయ్యిరి. 

No comments:

Post a Comment

పేరు పాపారావు - మనసు మల్లెపూవు

తెలుగుపై మల్లెల్ల జల్లు కురిపించే కుర్రోడు. తల్లి దండ్రుల కల ఎలా ఉంటుంది అంటే ? స్కూల్ నుంచి  తెలుగు ఊసెత్తడానికి వీల్లేదు. తెలుగు పుస్తకాలు...