Friday, October 16, 2020

Bharatavarsha 51

 “వివాహము చేసుకొని శృంగార యాత్రకి బోక అందములను మూటగట్టుకొని కన్నె తన స్నేహితురాలిని జూడ భర్తతో బడుగు వాడకు పోవుచున్నది.” అని  ఎక్కసమాడుచున్న భర్తతో “ముందు బంధముల సంగతి చూచిన  పిదప అందముల సంగతి తీరికగా చూచుకొనవచ్చు.” అనెను. మోహమతిశయించ  ప్రక్కనే కూర్చొన్న కన్నెను క్రీగంట చూచుచూ రంభోరువు పై చేతినుంచ “రోడ్డు చూసి వాహనమును నడుపవలెను ఇట్లు నన్ను చూచి నడిపినచో ప్రమాదములు జరుగును.” “నీ అందమట్లున్నది అందు నాదోషమేమున్నది”  “నా అందము ఎట్లున్ననూ ఎచ్చటికిపోవును  పరిణయమాడి సొంతము జేసు కొంటివి కదా! 

వివాహము అయిననూ  శోభనము కాలేదుకదా యని జాలి లేకుండెను. రెండు పిడికిళ్ళను ఆమె ముఖంపై బెట్టి కోపము నటించుచూ విరచసాగెను. “శోభనం పిల్ల ఇంట జరగవలెనని జెప్పి తీర్థయాత్రలకు  పోవుచున్నదికదా. రెండు దినములాగిన  మా అత్తగారు తీర్థయాత్రలకు పోవును కదా. అని చెప్పుచుండ అతను ముఖం మాడ్చుకుని పక్కకు తిప్పుకొనెను.  చిన్నపిల్లాడివలె అలకను ప్రదర్శించుచున్న అతడిని జూచి “రామ చంద్రా! ఆలి  కొరకు ఇంత ఆరాటమా!”  

“ఆయన్ను దలచిన ఆయనేమి జెప్పును , ఆలి  కొరకు అతడెంత ఆరాటపడెనో , వానరమూకలను పోగుజేసి జలధిపై వారధి గట్టెను కదా!  అదియే నాకునూ  వచ్చెను. వచ్చినది మా వూరే కదా. “అవును నీవే ఆ రాముడవని అనగల సమర్థుడవు.” అనుచుండగా వాహనము టైడల్ పార్క్ కు పదునారు కి. మీ. దూరమునున్న  రోయపురము చేరెను. వాహనము వంతెన వద్ద నిలపగా, కన్నె చుట్టూ  కలయజూచుచూ 

“ఈ చిన్న పట్టణమును వేయి నొక్క వంద మురికివాడలు గలవు అందు ఇదొకటి. ఇట్టి వాడలు యాబది శాతము పెరి గెనని. నగర  చతుర్ధభాగము ఇట్టిబడుగు వాడలనే వసించుచున్నది. ప్రభుత్వములు ఎచ్చటనున్నవో!” అని మనసు లో అనుకొనెను.

ఇద్దరు దిగి ఇరుకు దారులు ఇండ్ల తీరులు చూచుచూ చిన్న వీధులగుండా వారు నడుచు చుండిరి. నిమ్న వర్గములవారు వసించుచు మురికి పేట ఇది.  చిన్న దుకాణములు, చీకిన ఇళ్ళు గల అంగడి ప్రాంతమది.  అడుగిడుటకే అసౌకర్యముగా యున్న ఈ వాడయందు  మీనాక్షి యుండుటా ! నా మొగుడు కనిపెట్టి చూపించిననూ ఇంకనూ నమ్మజాలకున్నాను. 

 

కం.  ఆకుల  రేకుల  కప్పులు 

        చీకిన  పాతలు  బొత్తిగ  చితికిన   దారుల్

        వాకిట పారెడి  కాల్వలు

        మాకిడు అడుగిడ  మనుషులు  మకిరిని జూడన్


ఎటుజూచిన  ఆకిళ్లే  డబ్బా రేకిళ్లే  చింకి చేట   ఈ బడుగుపేట  మనుషుల ముఖములలో  చింతలు  దారుల నిండా గుంతలే అగుపించుచున్నవి   అడుగిడ మనిషే మాకిడు నట్లు  చీకిన  పాతలు  ఇటుఅటు చూపడు చున్నవి. 


వడి వడిగా నడుచు నవ వధువు

కొడి గట్టగ  దీపము వెలుగెక్కడ

వదిలి  వెడలిన వనిత జాడెక్కడ  

మది నొదలని  చింతల అంతెక్కడ 


చెలిమికి జెప్ప  దేమాయెనొ, తానెందుకు

మాయ మాయెనో, కోరదెవరిని సాయము 

జేయ నొప్పదు, చతురత జూపక తప్పదు.  

ముడి విప్పగ మురుగని వేడక తప్పదు. 

అట్లు  నవ వధువగు కన్నె వడి వడిగా నడుచుచుండ  ఆమె మదిని ఆలోచనలు పొదవుకొన్నవి . తనకష్టకాలమందు  అజ్ఞాత వాసము చేయ నిశ్చయించుకొని ఇట్లు మాయమయినది.  మీనాక్షి మీనాక్షి తన కష్టములందు సాయము కోరునది కాదు  ఇతరులు సాయము జేయ బూనిననూ   చేయి జాపదు , ఈమె కెట్లయినా నూ సాయము చేయవలెను, అందుకు ఆ మురుగు నాకు సాయము జేయవలెను. 

ఎవరో పోయినారు శవమును ఊరేగించుచున్నారు. శవము ఎదురు వచ్చు చున్నది  డప్పులమోత  పెరుగుచున్నది. గుంపుగా జన సందోహము ఎదురువచ్చుచున్నది. చిన్న సందులు, సందులలో చిందులు. భగవద్గీత వినిపించుచున్నది. 

 రోమి: భారత మందు ఎన్ని గీతలు లుండెను. (వ్యాధ గీత, అను గీత, కామ గీత, శంపాక గీత, మంకి గీత, విచక్ను గీత, బొద్య గీత, హారిత గీత , వ్రిత్ర గీత  , పరాశర గీత , హంస గీత.) అయిననూ భగవద్గీత కేదియునూ సాటిరాదుకదా. అట్టి భగవద్గీత కెట్టి  దుస్థితి పట్టెను?

కన్నె: భగవద్గీతకు దుస్థితి పట్టెనా?

రోమి: నిత్యమూవినుటకుద్దేశించబడిన భగవానుడుపదేశమిట్లు శవగీత గా మారినది కదా. 

కన్నె: హంస గీత అని పేరు వినియుంటిని అదియు ఒక గీతా ? 

రోమి: స్వర్గారోహణ ము పిమ్మట  పాండవులందరూ పోగా , కృష్ణుడు ఉద్ధవుడికి , ఉద్ధవ గీత చెప్పి పోయివత్తునని జెప్పెను. హంస  మరణించుటకు ముందు  వంటరిగా పోయి  గానము చేయుచూ తనువు  చాలించునని  ప్రాచీన పురాణమున చెప్పబడెను. కావున  ఉద్ధవ గీతని  హంసగీత మని అందురు “హంసగీతము పాడుటనిన చివరి సందేశమను పేరు అట్లు వచ్చెను.

ఇదివినిన  కన్నెకు రాయంచ వంటి మీనాక్షి స్మృతి పథమున మెదిలి హంసగీతమాల పించుటకు ఇచ్చటకి వచ్చెనని తలంపు కలిగి హృదయ భారము పెరిగెను . ఇంతలో వారు  సోలగొట్టమువలె ఉన్న ఇంటిని కాంచిరి.  ఇనుపచువ్వలు తప్ప ఏ ఆచ్ఛాదన లేని మొదటి గది వెనుక  మరొక గది  యున్నవి.  పియానో వాయించుచున్న మీనాక్షి ఆ మకిలి  ఇంట,  పంకమందు పద్మము వలె కనిపించెను. రంగులు వెలసి రోతగానున్న గోడలు ఒక కుర్చీ , ఒక చాప , నాలుగు పాత్రలు తో జీవనము  చేయుచున్న మీనాక్షిని చూసి శనీశ్వరుని  ప్రభావముచే కరి రూపము దాల్చి నరకలోకమున గడి పిన  ఈశ్వరుడు గుర్తుకొ చ్చెను. కన్నె ను చూసిన మీనాక్షి ఆనందముగా వచ్చి కన్నె ను ఆలింగనము చేసుకొనెను. ముఖముచూడగానే విషయమును గ్రహించి కన్నెను, భర్తను అభినందించగా  వారు ఆమె పాదములకు  నమస్కరించి ఆశీస్సులు గైకొనిరి. చాపమీద కూర్చొని యున్న ఆమె ఇంట ఒక కుర్చీ ఒక చిన్న పీట   మాత్రమే యున్నవి. అతడికి కుర్చీ వేసి కన్నెకు పీట వేసిన  మీనాక్షి  సిగ్గుపడుచూ నిలుచుండెను. రోమి  కుర్చీ, పీట పక్కన పెట్టి చాపపై కూర్చొనగా  కన్నె, మీనాక్షి కూడా చాప మీదనే కూర్చొనిరి.  

2 comments:

  1. భగవద్గీతకు సంభందించిన చాలా విషయాలు తెలియచేశారు.మురికివాడలో నడుచుచు కన్నె మనసులో భావాలను పద్య రూపంలో చాలా బాగా వివరించారు.

    ReplyDelete
  2. సామాన్యులు తేట తెలుగును మరిచిపోయి చాలా కాలం అయింది
    ధన్యవాదాలు సర్

    ReplyDelete

The Indian who wrote more books in Foreign languages

 Poolabala wrote most books in Foreign languages. He has written books to learn foreign languages such as French, German, Spanish, Italian, ...