Friday, October 16, 2020

Bharatavarsha 52

 మీనాక్షి వెంటనే దగ్గరలో నున్న తీపిభక్ష్యముల దుకాణమునకు బోయి మీనాక్షి వారికి మిఠాయిలు తెచ్చి పళ్ళెమునందుపెట్టి ఇచ్చెను.  ఆ నూతన దంపతులు  నాసిరకంగా నున్న మిఠాయిలను కూడా ఎంతో ప్రీతిగా తినుచుండగా వివాహము గూర్చి వరుని గూర్చి వివరములడిగి తెలుసుకొనెను. కన్నె కంటి  సైగనందుకొనిన మగడు చరవాణి యందు వ్యక్తిగత సంభాషణకొరకు విడిగా బోవలెనని చెప్పి  బయటకు బోయెను.

అప్పుడు కన్నె మీనాక్షి దగ్గరగా జరిగి ఇంత కష్టము వచ్చిననూ నాతో మాట మాత్రమైననూ చెప్పకున్న నిన్నేమి చేయవలెను ? అని అడుగా గా " ముందు నీ మొగుడినేమి చేయవలెనో యోచింపుము, శోభనం అయినట్టు లేదు?" 

"వాక్చాతుర్యమన్నచో  ఇది కదా  యని అసలు విషయము జెప్పమ"ని గట్టి గా అడుగగా 

మీనాక్షి రామచంద్రుని రాసలీలలు బైటపెట్టెను. "అతడొక సాయంత్రము నన్ను అతడి గదికి రప్పించుకొని తలుపు మూసి  చేయి పట్టుకొనెను.  అతడిని చేయి విడిపించుకొని బైటపడుచుండ పైట బట్టి లాగి సోఫాలో పడవేసి , నాపై బడెను.   రెండు నిమిషముల పెనుగులాట పిదప అతడిని  నెట్టివేసి  బైటపడి ఉజ్జోగమునకు రాజీనామా చేసి బయటపడితిని" “ఆ ఉలూకము ను శిక్షించక, ఉజ్జోగము వదిలి వేసి  నిన్ను శిక్షించుకొనుచున్నావు." "పిచ్చిదానా  ఉజ్జోగము వదిలి నేను కోల్పోయినది ఏమియునూలేదు. పియానో కంటే గొప్పది నాజీవితమున వేరొకటిలేదు , ఆ రామచంద్రుని దయతో నేను  ఇచ్చట నున్న రాయల్ సంగీత అకాడమీలో  అనేక  మందికి పియానో నేర్పుచున్నాను. కానీ శిక్షకురాలిగా  ఉండుటకంటె సంగీతము సమకూర్చుట యందున్నచో కీర్తి ప్రతిష్టలార్జించి ఉన్నత శిఖరములకు చేరవచ్చు.  సంగీతము నందు అనేక మెట్లు ఎక్కినాను. ఎంతో తృప్తి ఆనందముతో చెప్పుచున్న మీనాక్షిని చూచి అయినచో నీ జీవితమున బాధలే లేవా? ఈ కటిక పేదరికము నిన్ను  బాధించుటలేదా? అని  మిక్కిలి బాధతో ప్రశ్నించిన కన్నె చెవుల చవులూరు సంగీతమును కురిపించెను. 



మీనాక్షి పియానో పై మనోజ్ఞమైన  మధుర సంగీత మును సృష్టించగా కన్నె మైమరచి వినుచూ  పరిసరములను మరచి రసప్రపంచము  నోలలాడెను. "సంగీతము నందు అనేక మెట్లు ఎక్కినాను. కానీ జీవితములో మెట్లెక్కవలెనన్న ఒక పురుషునికి లొంగవలెను  అని తెలుసుకొంటిని.  ఇది దాచిన దాగని సత్యము. అచ్చటున్నది  ఒక గుడ్లగూబ.  ఇచ్చ టున్నది ఒక గుంత నక్క.  ఇరువరికీ వలయునది స్త్రీ దేహమే. ఇరువురికీ యున్నదొక  దాహమే." 

మొఖంలో ఆశ్చర్యము తొంగి చూచు చుండ , కడుపులో బాధ పేగులను మెలిపెట్టు చుండ ఇది నిజమా ఇట్లు అడుగు గలరా యని నమ్మ జాలనట్లు అడుగుచున్న కన్నెతో

రోయల్ అకాడమీ అధ్యక్షుడు అడవన్ కోర్కె తీర్చినచో మంచి అవకాశములనే కాక చలచిత్రములకు సంగీతము కూర్చు   అవకాశములను  పొందగలను. అది దీర్చ లేక ఇట్లుతక్కువ సంపాదించుచూ  ఎక్కువ భాగము  కొడుకుకి పంపుతూ నా భాద్యతలు నెరవేర్చుచూ  నేనెంతో ఆనందముగా యున్నాను. నాగూర్చి మీరు దిగులు పడవద్దు. భౌతికములైన వస్తు ప్రపంచమును ఐశ్వర్యమని అవి లేనిచో   పేదరికమని భావించి. ఖేద పడవలదు.  అని మీనాక్షి చెప్పుచుండ  " సంగీతమే ఐశ్వర్యమని సాహిత్యమీ సిరి సంపదలని భావించువారు ధన్యులు వారికి  లేమి కలుగదు కదా" అని అప్పుడే  తిరిగి వచ్చిన రోమి అనెను. మీనాక్షి వారిని చిరునవ్వున సాగనంపెను. అడవన్ కోర్కె తీర్చువలెనని  ఒక నిర్ణయమునకు వచ్చి  మగని తో  కన్నె అచ్చట నుంచి కదిలెను.   

పూర్తి అలంకార రహితమైన ఆమె వన వాసమున సీత వలె నున్ననూ,  పార్వతి దేవి స్వాభావిక  ఠీవి,  రతీ దేవి రూపము,  సరస్వతీ కళ  ఆమెను వీడి పోలేదు. వారిరువరూ వంతెన వద్ద నిలిపిన వాహనము కడకు  నడుచుచుండగా అన్నమయ్య కీర్తన వినిపించుచుండెను.     

 "తందనాన అహి - తందనాన పురె  తందనాన భళా.. తందనాన…బ్రహ్మ మొక్కటే పర... బ్రహ్మ మొక్కటే .. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్ర .. అదియు నొకటే  మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే     చండాలుడుండేటి సరిభూమి యొకటే” 

ఆ.    ఆరు నూరు  గోపుర  అగ్రము లపైన 

        మురికి వాడ లోన మురుగు కాల్వ 

        లోన భాసిల్లు భానుడు రీతి ఋజువును

        జూప  నమ్మ వెమన  సాబ్ర  హ్మమొక  టేనని

చెన్న పట్నమున ఆరువందల గోపురములున్నవి. పదకొండువందల మురికివాడలున్నవి ప్రత్యక్ష దైవ మునకు రెండు ఒక్కటే. మురుగు కాల్వ నైననూ గోపుర శిఖరము నైననూ ఒక్కతీరు గా  భాసిల్లు  భాస్కరుని రెండిటిమధ్య అంతరము  లేనట్లు  కలిమి లేముల అంతరమును మరచిన   మీనాక్షి  అరుణాత్మజుని వలె  కనిపించుచుండెను.    

3 comments:

  1. మీనాక్షికి ఇలాంటి దుస్థితి కలగడం నిజంగా బాధాకరం.

    ReplyDelete
  2. అంతరంగములు అవిష్కరిస్తున్నారు

    ReplyDelete
  3. Concept of story shows womam ability of her life sir. Great and super

    ReplyDelete

The Indian who wrote more books in Foreign languages

 Poolabala wrote most books in Foreign languages. He has written books to learn foreign languages such as French, German, Spanish, Italian, ...